ఇప్పటిలా ప్లే స్కూల్స్ లేనప్పుడు మాకు అంగన్వాడి అని ఉండేది. మా వాళ్ళు పొలం పనులకి వెళ్తూ, మమ్మల్ని అంగన్వాడి కి పంపే వాళ్ళు. అంగన్వాడి లో పాటలు, పద్యాలు చెప్పి తినడానికి పిండి కానీ వడియాలు కానీ పెట్టే వాళ్ళు. వడియాల్లో పసుపువి పెట్టే వాళ్ళు ముందు, బాగుండేవి. అవి మానేసి, పచ్చవి పెట్టడం మొదలుపెట్టారు. అవి అంత బావుండేది కాదు. అవి కూడా మానేసి పిండి పెట్టడం మొదలు పెట్టారు. అవి తెచ్చుకోవడం కోసం, మేము "మానిక" లు తీసుకెళ్ళే వాళ్ళం. పిండి పెట్టడం మొదలు పెట్టే సరికి మేము అక్కడ నుంచి బడి కి ప్రమోట్ అయ్యాం.


ఇప్పటి పిల్లల్లా బండెడు పుస్తకాలు లేవు. ఒక "రేకు పలక" ఉండేది. మట్టి పలకలు వారానికి ఒకటి పగిలి పోతు ఉండేది. మనకున్న స్తోమత కి అంత లేదు. అందుకే ఓ రేకు పలక కొని ఇచ్చే వాళ్ళు. కొన్న ఓ వారం రోజులు బాగానే ఉండేది, పైన రబ్బరు తో చుట్టి, పట్టుకోవడానికి హేండిల్ కూడా ఉండేది. ఒక మంచి రోజు చూసుకొని ఆ రబ్బరు తెంపి, పదునుగా ఉండే రేకు పలకని బయటకు తీసే వాళ్ళం. అది రాజమౌళి సినిమాలో ఆయుధంలాటిది మాకు. 

కొత్త పలక ఎవడైనా కొంటె ఆటలా పోటీలు జరిగేవి. పలకలతో కొట్టుకోవడం. ఎలా కొట్టిన మన పలకే గెలిచేది. అవతలోడి పలక రబ్బరు తెగేది. వాడు కూడా వచ్చి మన కమ్యూనిటీ లో చేరి పోయే వాడు. అలా అన్ని రబ్బరులు తెగి పోయాక, అలా వాటితోనే కొట్టుకునే వాళ్ళం. అలా పలకంతా నొక్కులు పడి పోయేది. ఇంకా అదే పలకతో జామ కాయలు కోసుకునే వాళ్ళం. కోపం వచ్చినప్పుడు అవతల వాడికి బొక్క పెట్టే వాళ్ళం. నానా రచ్చ చేయాగా అది తుప్పట్టి పోయేది. ఒక పక్క పెయింట్ లేచి పోయేది. అలానే రాసి రాసి ఇక ఇంట్లో వాళ్ళు చూడలేక మళ్ళీ ఓ కొత్త పలక కొనే వాళ్ళు. మళ్ళీ మొదలు. కొంత మంది ఉమ్ము వేసి తెగ తుడిచే వాళ్ళు. 

ఆ పలక మీద రాయడానికి నా దగ్గర మాములు నాపరాయి బలపాలే కాకుండా, పిండి బలపాలు, రంగు బలపాలు ఇలా రకరకాలు ఉండేవి. కొంత మనది వాటిని రాయడానికి, ఇంకొందరు తినడానికి, ఇంకా కొంత మంది ఔత్సాహికులు ముక్కులో పెట్టుకోడానికి, మరి కొందరు ఆడుకోడానికి వాడే వాళ్ళు.  ఎన్ని బలపాల ముక్కలు ఉన్నా కొత్త బలపం అందమే వేరు. అది మన చేతిలో క్షణం ఉండదు. వెంటనే ముక్కలు అయ్యేది.

చాలా రోజుల దాక అదే నాకు రఫ్ బుక్. 
పలక మీద మొదటి సారి అ ఆ లు నేర్చుకునేప్పుడు, వాటిని దిద్దరా అంటే దారం లా సన్నగా రాసి ఇచ్చిన అ ఆ లని దిద్ది దిద్ది చేంతాడు అంత లావు చేస్తే కానీ మేము చదివినట్టు అనుకునే వాళ్ళు కాదు అయ్యవార్లు. ఇక చూడండీ ఒకటే దిద్దడం.

మా ఇంట్లో ఇంకా ఎక్కడో ఉన్నాయి మట్టి పలకలు. జ్ఞాపకాలు మాత్రం నాతో ఉండి పోయాయి. పసితనం దానితోనే మొదలైంది.


నీళ్ళ మీద పెద్ద శబ్దం రావడంతో లోపల ఉన్న గణపతులందరూ తలెత్తి పైకి చూశారు .. "అబ్బో చాలా పెద్దగా ఉన్నాడు చోటు ఇవ్వండి" అని పక్కకి తప్పుకుంది P&T కాలనీ లో ఓ గల్లీ లో గణపతి... అందరు అలా కదిలే లోపే ఓ సారి ధబెల్ మని పడి మళ్ళీ నీళ్ళ పైకి చేరి చిన్నగా మునగడం మొదలెట్టాడు చైతన్యపురి గణపతి... ఓ మూల నుంచి చిన్న చిన్న గణపయ్యలంతా అలా చూస్తూ ఉన్నారు.. అవి మట్టివి కాకపోవడం వలన కరక్క చేతులు, తొండాలు విరిగిపోయి అలా పడి ఉన్నాయి... 

ఇంతలో పైన ఒకటే గలాటా మొదలైంది.. ఏమిటబ్బా అనుకుంటూ ఉంటె... పక్కనే సగం విరిగిన  సరూర్  నగర్ గణేష్ చెప్పాడు.. "ఏముంది... మనలో ఉన్న ఇనుము కోసం కాట్లాడుకుంటున్నారు. మట్టితో చేసి ఉంటె ఈ పాటికి నీటిలో కలిసి పోయి ఉండే వాళ్ళం కదా " అంటూ నిట్టూర్చాడు... 

బోలో గణేష్ మా రాజ్ కి ...జై ఐ ఐ ఐ ఐ అని అరుపులు ...

చైతన్యపురి గణేష్ అడిగాడు"ఏవిటి ఇంకా బడంగ్ పెట్ పెద్దాయన రాలేదా?" అని. "లడ్డు వేలం అయితే  కానీ కదల్చరంట" అని ఓ మూల నుంచి సమాధానం. "రేయ్ చిన్నగా, దేవుడిని అని కూడా చూడకుండా ఏవిటా పగలకొట్టడం. ఈ మనుషులకి బొత్తిగా మనసు లేకుండా పోయింది. మీరే తాయారు చేస్తారు, మీరే కొంటారు, మీరే పూజ చేస్తారు, మీరే ఈ మురికి నీళ్ళలో పడేస్తారు, మీరే పగలకొడతారు. మళ్ళీ నన్ను దేవుడు అంటారు." అని మొరపెట్టుకుంటున్నాడు. ఇంతలో ఠపీ మని శబ్దం, పైన జై గణేశా అన్న అరుపు... "క్షమించాలి" అని ఓ మూలకి సర్దుకుంటున్న బుజ్జి గణపతి...." చూసుకోవద్దా, ఏంటా తొందర.. బొప్పి కట్టింది" అని నుదురు రుద్దుకుంటూ అది అడిగాడు చై.పు గణపతి.. "మీరేనా, నేను కూడా మీ కాలనీ నే, ఏమనుకోవద్దు..." అని కరగడం మొదలుపెట్టాడు బుజ్జి గణపతి. "కెవ్వు కేక నా సామిరంగా కెవ్వు కేక, చాయ్ చాయ్..ఏస్కో నా గుమ గుమ చాయ్...పగలైన నాకు ఓకే, రాత్రైతే డబల్ ఓకే" అని పాడుకుంటూ ఓ గణపతి మునుగుతూ ఉన్నాడు ... అప్పటికే సగం విరిగి లోపలకి చేరుకున్నాడు చై.పు గణపతి... చుట్టూ వేల గణపతులు... తొండాలు, చేతులు, తలలు విరిగి ముక్కలు ముక్కలు గా పడి ఉన్నారు.. మనసు చివుక్కుమంది...

మట్టితో చేసి, ప్రకృతి లోని మంచి మొక్కలని పత్రి గా పెట్టి పూజ అయ్యాక నీళ్ళలో కలిపితే నీళ్ళలో ఔషధ గుణాలు పెరుగుతాయని పెద్ద వాళ్ళు చెప్తే, మీ ఇష్టానికి ప్రవర్తించి ప్రకృతి ని నాశనం చేస్తున్నారు... మళ్ళీ దేవుడిని నిందిస్తున్నారు... మిమ్మల్ని దేవుడు కాదు మార్చాల్సింది.. మీరే... లేనప్పుడు ప్రకృతి కోపాన్ని చూడాల్సిందే... అంటూ నీటి  అడుక్కి చేరుకున్నాడు చైతన్యపురి గణపతి....

(పక్కనే ఉన్న చెరువులో గణేష్ నిమజ్జనం చూసి వచ్చిన ఊహ... తప్పులుంటే మన్నించాలి)
మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని, స్వాంతంత్ర్య సమరయోధులను నాయకులను చేశాము. అక్కడ కూడా అవకతవకలు జరిగాయి.

వెన్నుముక లా నిలిచిన గాంధీ కుటుంబం గాలికి కొట్టుకుపోతే, గాంధీ ని ఇంటి పేరు చేసుకొని నెహ్రు కుటుంబం రాచరిక వ్యవస్థ సాగిస్తూ వస్తుంది. ఇలా దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన  ఎందరో నాయకులు, వారి కుటుంబాలు  మరుగునపడిపోయి కుక్కమూతి పిందెలు అధికారాన్ని చేపడుతూవస్తున్నాయి. వాళ్ళే స్వాతంత్ర్యాన్ని తెచ్చినట్టు, వాళ్ళు లేకపోతే మనకు భవిష్యత్తు లేదన్నట్టు నమ్మబలుకుతున్నాయి. దానికోసం కులం,ప్రాంతం,వర్గం,ధనం,అధికారం,కుట్ర,కుతంత్రం అన్నిటినీ వాడి అధికారం లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో ప్రజల నిర్లక్ష్యం, అవగాహనా  లోపం, ఐకమత్యం లేకపోవడం, ప్రజలు,వారి జీవన విధానాల మద్య అంతరాలు సహాయం చేస్తున్నాయి.

ఎక్కడ విన్నాను అమెరికా లో ఉంటున్న ఒక భారతీయుడు, ఈ మధ్యనే భారత దేశం వెళ్లి వచ్చిన ఒక అమెరికా దేశస్థుడిని అడుగుతాడు, "ఎలా ఉంది మా దేశం " అని . "అద్భుతం, అంత బావున్నాయి కాని పేరుకే అది భారత దేశమైనా అక్కడ ఒక్క భారతీయుడిని కూడా చూడలేకపోయాను. ఎవరికీ వారు మేము తమిళులం, మలయాళీలం, కన్నడిగులం, తెలుగు వాళ్ళం (ఇందులో మళ్ళీ రకాలు ), గుజరాతీలం, బెంగాలీలం అంటారే తప్ప ఒక్కడన్నా భారతీయుడిని అని చెప్పుకోవడం లేదు." అని అన్నాడట.నిజమే కదా, ప్రాంతీయ భావన ను రాజకీయ పార్టీలు పెంచి  పోషిస్తున్నాయి. జాతీయ భావనను  పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి.  మహారాష్ట్ర వాళ్ళు, గోదావరి నది మీద  డాం కడుతున్నారట తెలుగు వాళ్ళు అన్యాయం అయిపోతారు. తమిళులకు కావేరి జలాలు అందడం లేదు. ఆంధ్రా ప్రాంతంలో ఉన్న గ్యాస్ అంత గుజరాత్ కి తరలిపోతుంది, లాటి విషయాలను ఎక్కువగా చూపించి వాళ్ళు వేరు మనం వేరు, మన వనరులను వాళ్ళు లాక్కుపోతున్నారు  అనే  భావన అందరిలో నాటుతున్నారు. అందరు మన వాళ్ళే, కూర్చుని పరిష్కరించుకోవాలి. అదే చినా నొ పాకిస్తాన్ ఓ చొరబడితే దానికి మాత్రం శాంతి చర్చలు.


ఆశ్చర్యంగా కేంద్రం లో కాంగ్రెస్ ఉంటుంది, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఉంటుంది. కాని ఆ చిచ్చు ని ఆరనివ్వదు.దానికో పరిష్కారం చూపదు. ఉదాసీనత చూపిస్తుంది. ఇక రాష్ట్రాల్లోనే చిచ్చు పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్రులు,సీమ వాళ్ళు, తెలంగాణా వాళ్ళు అని రాజకీయ పబ్బం గడుపుకుంటూ అభివృద్ధి ని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశంలో ఇలాటివే జరుగ్తున్నాయన్న భావన పెరుగుతున్నా మౌనం వహిస్తుంది. ఆ దేశం వెళ్ళకండి, అక్కడ మృగాళ్ళు ఉంటారు, అని దేశాలు ఘోషిస్తుంటే, "భారత దేశము నా మాతృ భూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను." అని ఎలుగెత్తి అరిచే మన భూమిలో పరాయి సంస్కృతితో పెరిగిన వాళ్ళే ఈ మృగాళ్ళు అని వాళ్లకు జ్ఞాపకం రాదు, అవసరం లేదు.

చైనా వాడు అక్కడెక్కడో ఒక ప్రాజెక్ట్ కడుతున్నాడట. దాని వల్ల మన దేశానికి నష్టం. మనం ఎం చేయాలి, దీనిపై ఎలా స్పందించాలి? మన భూభాగంలోకి అడుగు పెడితే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి? మన దేశం పై జరుగుతున్న టెర్రరిస్టు దాడులను ఎలా ఎదుర్కోవాలి లాటి అంశాలను ప్రజల్లో చర్చకు తెచ్చి ఇది మన దేశం, మనమంతా ఒక్కటే అన్న భావన పెంచాలి. అంతెందుకు రేపో మాపో చైనా మన సరిహద్దుల్లో సైన్యాన్ని మొహరించి, మన  మీదకు దండయాత్రకు వస్తుందంటే ఆ ఎవరో బోర్డర్ లో ఉండే వాళ్ళు కదా నష్టపోయేది అని ఊరుకోగలమా? ఎవడ్రా వాడు, మన దేశం మీదకి వచ్చే దమ్మున్న వాడు? మన సైన్యం ఎంత గొప్పది? రమ్మను చూసుకుందాం లాటి ఆలోచనలు మన మనసులల్లో ఉడుకుతుంటాయి. ఏ దేశం లో నైనా ఆ దేశ ప్రజలే ఉంటారు కాని, మన లాగ ప్రాంతాల ప్రజలు, భాషా ప్రజలు ఉండరు. మనల్ని అలా ఉండనివ్వడం లేదు.

అసలు ఈ రాజకీయ నాయకులకు ఎం అర్హత ఉందని ఎన్నికల్లో నిలబడనివ్వాలి? దేశానికీ సేవ చేశారా? కాదంట , పదవి ఇస్తే చేస్తారంట? అది ఎవడైనా చేస్తాడు. ముందు మీకున్న అర్హత ఏంటి? వినండి పిచ్చి ఎక్కుద్ది మనకి. ఒకడు అంటాడు, ప్రజలు నేను రావాలని కోరుకుంటున్నారు అని? ఇంకోడు మా తాతలు, నాన్నలు చేసిన సంక్షేమ  పధకాలు జనాలకి ఇంకా అందాలంటే నేను రావాలి, లేకపోతే జనం చచ్చిపోరు. పాపం లక్షల్లో జీతాలుండే ఉద్యోగాలు మానేసి ప్రజా సేవ చెయ్యడానికి వస్తారు. ఇలా సంవత్సరాలుగా చేస్తున్నా, అదేంటో ఆశ్చర్యంగా పిచ్చి జనాలకి బాగుపడటం చేత కాక అలానే ఉన్నారు.. ఆ రాజకీయ కుటుంబం లోంచి పిల్లకాయలు వచ్చి ఉద్ధరిస్తునే ఉన్నారు.

కొందరైతే ఈ నాయకులని చూసి ఓటేయ్యడం మానేస్తున్నారు.

దేశానికీ రక్షణ కలిపించే త్రివిధ దళాల నాయకులని ఎలా ఎన్నుకుంటారు? వాళ్ళ సర్వీస్ చూసే కదా?( ఖర్మకి వాళ్ళు కూడా ఈ రాజకీయనాయకుల కిందే పని చేయాలి...). మరి నాయకులని ఎందుకు అలా ఎన్నుకోరూ? ఎన్నో సర్వీసుల్లో ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోతున్న ఆఫీసుర్లు ఉన్నారు.పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు.

రక రకాల సర్విసులున్నాయి.ప్రతి ప్రాంతంలో వివిధ అధికారులను నియమించి,  ఒక పదిహేనేళ్ళ సర్వీసు తరువాత కొందరు ఆఫీసుర్లను ఎన్నిక చేసి ప్రజల ముందుంచి "ఇదిగో ఈయన మీ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. ఇదిగో ఈయన చేసిన మంచిపనులు.ఈ సారి ఎలక్షన్లో వీళ్ళని మీ ప్రాంతపు MLA లు నిలబెడుతున్నాము... మీరే ఓటు వేసి గెలిపించుకోండి " అని చెప్తే. ఆ ఆఫీసర్ కి కులం తో పని లేదు, మందు, డబ్బు, కుట్ర , కుతంత్రం, ప్రాంతీయత, వర్గం వీటితో వేటితో సంబంధం లేదు. ఎలాటి మంచి పనులు చేశాడు అని మాత్రమే చూస్తారు. ఒక చదువుకున్నవాడు, ఆ ప్రాంతం కష్ట సుఖాల మీద, అవసరాల మీద  అనుభవం ఉన్న వాడు,  దేశానికీ సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో కష్టపడి చదివి ఈ శాఖలోకి వచ్చినవాడు మనకు నాయకుడౌతాడు.

ఈ రాజకీయ పార్టీల గోల ఉండదు. ప్రతోడు పార్టీ పెట్టడమే.

ఇక కష్టపడ్డ వాడికే ప్రతిఫలం. ఇక్కడ కుల ప్రాతిపదిక మీదనో, మత ప్రతి పదిక మీదనో ప్రజలు ప్రభుత్వ సహాయానికి అర్హులు కారు. ఆర్ధిక వెనుకబాటు తనం, సామజిక వెనుకబాటు తనం మాత్రమే అందుకు అర్హత.

దీనికి రాజకీయ నాయకులు ఒప్పుకోరు. ఒక రాజకీయనాయకుడు ఎన్నికైన ఒక సంవత్సరం తరువాత అవినీతి చేశాడని ఆరోపణలు వస్తే విచారణ పేరు మీద ఐదేళ్ళ పాటు వాడిని మనం భరించాలి. అంతే కాని వాణ్ని పీకి పారెయ్యరు. ఇటువంటి చట్టం తేవడానికి అందరి అభిప్రాయాలు కనుక్కోవాలంటూ కాలం వెళ్లబుచ్చుతారు. టెర్రరిష్టు లి దేశం లో చొరబడి ప్రాణాలు తీస్తున్నారు బాబో అంటే, ఆ సంఘటన జరిగినప్పుడు తీవ్రంగా ఖండిస్తారే తప్ప పోటా లాటి చట్టాలను అమలు చెయ్యరు. అదే "రాజకీయనాయకులంతా వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ బంధు జనాలని విమానంలో గాని రైలు లో గాని, బస్ (హీహీ అది అసాధ్యం కదా, ఎవడెక్కుతాడు(పల్లె వెలుగు బస్సుల్లో ఉంటుంది, reserved for MP/MLA ani ) ) లో గాని ఉచితంగా ప్రయాణించవచ్చు " అంటే ఆ బిల్లు ఏకగ్రీవంగా అమలౌతుంది.

ఇది పోవాలి, ఈ రాజకీయ నిరుద్యోగులు మన నాయకులైనంత కాలం , మనలో నిర్లక్ష్యం, స్వార్ధం గూడుక్కట్టుకున్నన్ని నాళ్ళు  భారత దేశంలో భారతీయుడిని పట్టుకోవడం దుస్సాధ్యం.
నాకు ఊహ తెలేసేనాటికి నాకు తెల్సిన కథ "పేదరాశి పెద్దమ్మ కథ".... చందమామ ని చూపించి అదుగోరా దానిమీద నీడ కనిపిస్తుందా? అక్కడ ఓ చెట్టు కింద కూర్చుని ఓ ముసలామె రాట్నం వడుకుతూ ఉంది..కనిపించిందా? అంటే ఆరుబయట మంచాల మీద పడుకొని చల్లగా కురుస్తున్న పండు వెన్నెల్లో ఆ ముసలామెతో ఆ నల్లని మచ్చలని పోల్చుకోడానికి ప్రయత్నించే వాళ్ళం...  నా ఊహ చంద్రమండలాన్ని తాకేది..

పున్నమి రాత్రి సినిమా చూసి ఒక్కడినే బయటకు వస్తే, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద దూరంగా పరిగెత్తుతున్న డ్రాకులా కనిపించి నన్ను రోడ్డు మీద పరుగులెట్టించింది.

బలానికిచ్చిన టానిక్ ని తాగకపోతే మా ఇంటి ఎదురుగా ఉండే చింత చెట్ల లోంచి ఎవడో చూస్తుంటాడు, వచ్చి ఎత్తుకుపోతాడు అని చెప్పే మా నాయనమ్మ... నాకా క్షణం ఆ చెట్ల గుబురులలో ఎవడో కూర్చుని ఉండేవాడు..చచ్చినట్టు తాగేవాడిని ... ఈ గోలా భరించలేక ఓ రాత్రి లేచి మొత్తం టానిక్, దానితో తాగించే తేనే కూడా తాగేసి గమ్మున పడుకున్నా....

మా తాతయ్య దగ్గర తెచ్చుకున్న పుస్తకాల్లో ప్రతి పాత్ర నా ఆలోచనల్లో రూపు దిద్దుకునేది... యశుపాలుడు, శిశుపాలుడు జారిపడ్డ లోయ... పడ్డం పడ్డం ఓ రాక్షసుడి తల మీద పడతారు... వాళ్ళకి దూరం గా ఎత్తుగా కనిపిస్తున్న కొండలు ...జరుతున్న జలపాతాలు... బయటి ప్రపంచం తెలీకుండా అక్కడ బ్రతుకుతున్న వివిధ జాతుల ప్రజలు.... నా తలలో చేరి గోల గోల చేసే వాళ్ళు....

ఇక చందమామ అలవాటు అయ్యాక.... చెప్పనవసరం లేదు...  ప్రతి ఆలోచనకో రూపం... రంగు రంగుల్లో బొమ్మలు ...  మెరిసిపోయే నగలు, వజ్రాలు,మణులు మాణిక్యాలు... ప్రతిది ఒక అద్భుతమే...  నా మెదడులో ఓ ప్రపంచం ఉండేది... ఇలా అలవాటయ్యాక నేనే కథలు చెప్పడం మొదలు పెట్టా పిల్లలకి....

ఇహ మధు బాబు గారి పుస్తకాలు అలవాటయ్యాక, ఆయన వర్ణించే తీరుకి ప్రతిది కళ్ళ ముందు కదిలేది....

ఊహ హద్దులు దాటితే నిజం దాన్ని చేరుకోలేకపోవచ్చు... ఏదైనా చేరుకోవాలంటే, ఒక హద్దు ఉండాలి కదా ..అదే ఊహ...

కొన్ని కథలు చదివాక అవి మన మనసుని తాకి అవి సినిమాలుగా వస్తే నచ్చకుండా ఉన్న సినిమాలు చాల.. మన ఊహ అంత అందంగా ఉండవు మరి....

ప్రకృతి ని దగ్గరగా చూడటం కూడా మన ఊహా శక్తి ని పెంచుతుంది అనిపిస్తుంది.... నాకు చిన్నప్పుడు బోలెడు అనుమానాలు వచ్చేవి.. అందులో ముఖ్యమైనది ...భూమిని తవ్వుకుంటూ పోతే ఇటు నుంచి అటు వెళ్ళినప్పుడు మనం ఎలా బయటకి వస్తాం? ఊడిపడిపోతామా? లేకా పైకి ఎక్కినట్టు వస్తామా? అసలు విమానం ఎలా ఎగురుద్ది? రేడియో లో మాటలు ఎలా వినిపిస్తాయి? ఇంకా ఛిన్నగా ఉన్నప్పుడు భూమి గుండ్రటి బాల్ ని సగానికి కొస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది... మనమంతా దాని మీద ఉంటాం... పైన ఆకాశం కప్పి ఉంటుంది ... సూర్యుడు చంద్రుడు వచ్చి వెళ్తుంటారు అని...

కాని ఈ తరానికి ఆ అవకాశం లేదేమో అనిపిస్తుంది... వాళ్ళ ఊహని కూడా కట్టడి చేస్తున్నారేమో... వాళ్ళకి ఎం ప్రపంచం తెలుస్తుంది? పాలు గేద పొదుగులోంచి వస్తాయని తెలియని చాల మంది పిల్లలు ఉన్నారు, అల వస్తున్నాయని తెలిస్తే తాగరు కూడా.....

ప్రకృతి పరిచయం తగ్గిపోతుంది... చిన్నపటి నుంచే టీవీ కి అంకితమవ్వడం (అమ్మ పిల్లలు టీవీ ముందు పడేస్తే గొడవ చెయ్యరు అనుకుంటే అక్కడే కూర్చోబెడుతుంది..ఇలా చాలా ఇల్లు ఉన్నాయి) వలన వాడికి చోటా భీమ లో అడవులు లేదా పోకిమన్ లాటి ఆలోచనలే తాకగలరు కాని ఊహ ప్రపంచాన్ని నిర్మించుకోలేరు.....

ఇది నిజమో కాదు తెలీదు...కాని కొందరిని చూసాకా అనిపించింది... కొందరిని చూశాను అంటే ఇప్పుడు 6-7 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళని , నన్ను అడిగారు "ఎందుకు నువ్వు నాన్నా అంటావు? daddy అని ఎందుకు అనవు అని..."  ...

కూచిపూడి లేదా ఏదైనా శాస్త్రీయ నృత్యం నేర్పిస్తే ఆలస్యమౌతుందని వేస్త్రెన్ పేరు చెప్పి సినిమా పాటలు నేర్పిస్తున్నవాళ్ళు లేకపోలేదు (ఇది అసందర్భం)...

ఇప్పటి వాళ్ళలో ఊహ శక్తీ మాత్రం తగ్గిపోతుందని అనిపించింది.... ఊహలోకం అనేది పసితనం లో మొదలై బాల్యం చివరికి ఒక స్థాయికి చేరుకొని ఆగిపోతుంది







....
ఊరి చివరన పొలాల పక్కన వున్న పశువుల కొట్టం లో సెనగ కట్టలన్నీ వేసున్నాయి. మొన్ననే మిషను కేసి అన్ని గోతాలకెత్తి కొట్టం లో వేశారు..నాన్నకి ట్రాక్టర్ పని ఉండటంతో, పని మీద మా ఊరికి వెళ్ళిన నేను కాపలా ఉంటా అని చెప్పాను... భోజనం చేసి చార్జింగ్ పెట్టిన టార్చి లైటు తీసుకొని 11 ఆ ప్రాంతంలో బయలుదేరాను.దాదాపుగా అందరు ఇళ్ళకు వెళ్ళిపోయారు. మంగయ్య కొట్టు కాడ జయమ్మ పొద్దున దోసలకి పిండి రుబ్బి అప్పుడే లైటు అర్పెస్తు,"ఎవరదీ" అన్నది..."నేను జయమ్మమ్మ పచ్చలోళ్ళ వెంకటనరసిమ్మ కొడుకుని" "ఏడకి ఈయాల", "కొట్టంకాడ సెనగలుంటే వెళ్తన్నాను, నాన్న పనుండి వెళ్ళాడు " "నీకెందుకయ్యా అలవాటు లేని పని" అంటూ ఉంటె నవ్వుకుంటూ నడక మొదలెట్టాను.కొట్టం ఊరికి బాగా దూరం..తూరుపీధి మీదగా వెళ్ళాలి...ఊరి మొగదాల్న ఉండే బడి పక్కన కట్టిన రచ్చబండ మీద ఎవరో కూర్చుని వున్నారు. అది దాటి కొంచెం దూరం వెళ్తే మా కొట్టం.. ఆ కూర్చున్న ఆకారం ఊరికే కూర్చో లేదు...చిన్నగా రోదన. గుండె వేగం పెరిగి నడక వేగం తగ్గింది...

 నా అదృష్టానికి బడి ముందు రోడ్డు మరి సన్నగా అవుతుంది. చచ్చినట్టు ఆ అరుగు పక్కగా నడవాల్సిందే. ఎహే, మనూళ్ళో, మన బడి కాడ అని సర్ది చెప్పుకుంటూ పిల్లిలా నడవసాగాను...ఆ అరుగు దగ్గరకు పోయే లోపే నిర్ధారణ అయింది అక్కడ కూర్చున్న ఆకారం ఓ ఆడ ఆకారం.దెయ్యమేమో? ఈ ఆలోచన దూరేసరికి మెదడు మొద్దుబారి పోయింది..వెనక్కి వెళ్ళిపోలేనంత దగ్గరకు వచ్చాను...ఆ ముసుగు ఆకారం నిజంగానే ఏడుస్తుంది.నేను ఏడవ తరగతి దాకా చదివిన బడి భయంకరంగా కనిపిస్తుంది..దాటి వెల్లిపోదాం అనుకునే లోగ, ఆ ఆకారం లేచి గట్టిగా అరిచింది... ఓరి దీనెమ్మ చంపేసింది అనుకోని ఎగిరి వెనక్కి దూకాను... ఏ మాత్రం జంకినా ప్రాణాలు గాల్లోకే.. అప్పుడు తట్టింది దూదేకలోళ్ళ పిచ్చి బీబీ (బీబీ బాగానే ఉండేది ఎందుకో పిచ్చి పట్టింది). "ఎం బీబా" అని గెట్టిగా కేకేసి, సర్దుకుని,భయంలోంచి వచ్చిన నవ్వుతో భయాన్ని కప్పేస్తూ, చుట్టూ ఎవరైనా చూశారేమో గమనిస్తూ హడావిడిగా కొట్టానికి చేరుకున్నాను.ఆ దడ మాత్రం తగ్గలా.. 

 చుట్టూ వెదురు కంపతో చేసిన తడికెలు.మధ్యలో పెద్ద వేప చెట్టు, గాలికి జుట్టు విరబోసుకున్నట్టు ఊగుతూ ఉంది.తూర్పున వేసున్న వరి గడ్డి వామి,ఓ పక్క గడ్డి పీకేయడం వల్ల మోకాళ్ళ మీద కూర్చున్న నల్లటి రాక్షసుడిలా వుంది. కొట్టంలో వేసి కట్టలన్నిటి మీద పరజా పట్ట కప్పి ఉంది. ఒద్దు మొర్రో అంటే వినకుండా ఒక ఆవుని కొనింది మా అమ్మ. అది చూడ్డానికి ఇంతే వుంటుంది కాని, అదంటే మా ఊర్లో బర్రెలన్నిటికి హడలంట.దానికి, పెద్ద బర్రె కి నీళ్ళు పెట్టి, మేతేసి వేపచెట్టు కింద నులక మంచం మీద పక్కేసుకొని కూర్చున్నా. పక్కనే లచ్చుపతియ్య గారి చేలో జామాయిలు కొట్టేసినట్టున్నారు,మూలన వున్న తుమ్మ చెట్టు భయంకరంగా ఉంది..అదంటే చిన్నప్పుడు కూడా భయమే.చెంబు కెళ్తే దాని దగ్గరకు మాత్రం వెళ్ళే వాళ్ళం కాదు... దానవతల కుమ్మర గుంట (ఇందులో పడి ఒకామ, చిన్న బాబు చనిపోయారు) గట్టున నాటిన సీమ సింత చెట్లు కొండ మీద రాక్షసుల్లాగా అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. లచ్చుపతియ గారి చేనుకి ఈ పక్క మేకలోళ్ళ రమేషోళ్ళ చేలో వేసిన చవకల్లోంచి "స్స్స్" చిన్న ఈల లాంటి గాలి శబ్దం.. పొద్దున్న పూట మాములుగా వున్న ప్రతిది చీకటయ్యే వేళకి భయపెడుతున్నాయి.ఇలాక్కాదని ఫోన్ తీసి పాటలు పెట్టాను.. "అరే ఏమైందీ" అంటూ ఇళయరాజా పాట గుండలవిసేలా ప్రతిధ్వనించింది. అనవసరంగా పడుకున్న వాటిని లేపిన ఫీలింగ్. చల్లటి గాలి, ఆకాశం నిండా చుక్కలు, కింద నులక మంచం..ఎహే భయడ్డం ఏందీ పడుకోక అనుకోని మేను వాల్చాను... దూరంగా బీబీ ఏడుస్తున్న చప్పుడు సోనీ హెడ్ ఫోన్స్ లో గిటార్ సౌండ్ లాగ నిదానంగా నా చెవులకి చేరుతుంది. దుప్పటి నిండుగా కప్పుకొని పడుకున్నా. ఆ గాలికి చిన్నగా నిద్ర పట్టింది.. నిద్రలో కూడా ఎదో పిచ్చి కల.

తడిక తీసిన శబ్దం. దుప్పట్లోంచి తల తిప్పి చూడాలన్నా ఒళ్ళు సహకరించడంలా... ఏదీ స్వాధీనంలో లేదు. చిన్నగా మంచం దగ్గరకి వస్తున్న అడుగుల శబ్దం..ఆంజనేయ దండకం గుర్తురావడంలా..మురళి పంపిన కథల్లో దెయ్యాలన్నీ చుట్టూ చేరిన ఫీలింగ్...ఆ టైములో ధైర్యం అనే పదం కూడా గుర్తు రావడంలా.. ఎం చేయాలి? ఆ అడుగుల చప్పుడు మంచం దగ్గరికి వచ్చి ఆగిపోయింది, నా జీవితం ఐపోయింది.. వచ్చి ఎవ్వరో మంచం మీద కూర్చున్నారు...
మళ్ళి ఓ హీరో పుట్టాడు...

షాడో....

కాళికాలయం లో వసంతుడు, బలదేవుడు....
ఆనంద జ్యోతి లో శ్రీధరుడు..
మచ్చలగుర్రం లో చంద్రుడు...
చతుర్నేత్రుడు లో మాధవుడు...
స్వర్ణ ఖడ్గం లో ప్రతాపుడు...
వెన్నెల మడుగు లో విజయుడు...

ఇప్పుడు  శివుడు....


మధు బాబు కథానాయకుడంటే ధీరో, నిర్లక్ష్యం నిండిన చూపులు, పెదాల మీద చెరగని  చిరునవ్వు. ఆపద లో ఉన్నవాళ్ళని  ఆదుకోడానికి  ప్రత్యక్షమౌతాడు, ప్రమదాలని లెక్క చెయ్యడు...


నాకు బాగా నచ్చేది ఆయన కథ చెప్పే విధానం.అందులో వాడే పేర్లు. అవి చదువుతూ ఉంటె అవి మన ఊహల్లో మెదులుతాయి. మనమే వాటికీ ఓ రూపాన్ని అపాదిస్తాము...


పై పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన పుస్తకం షాడో తరువాత కాళికాలయం. మొత్తం మూడు భాగాలు... 


కాళికాలయం...కంకాళ లోయ..కళ్యాణ తిలకం....


ముందు ఈ రోజు నవ్య లో  ప్రారంభం ఐన 'శివుడు' గురించి చెప్తాను....


శివుడు అనే పదమూడేళ్ళ బాలుడు  ఓ అనాధ. వాడు సారంగుడు అనే ఓ  మండలాధీసుడి దగ్గర పెరుగుతూ ఉంటాడు...తనతో పాటు ఇంకో పది మంది అనాధల్ని(తల్లి తండ్రులు ఉండి ఆర్ధిక స్తోమత లేని వాళ్ళు  ) పెంచుతుంటాడు సారంగుడు..వాళ్ళకి విధ్యబుద్ధుల్ని నేర్పించి తన సంస్థానంలోనే వారి వారి ప్రావీణ్యాన్ని బట్టి కొలువు ఇస్తాడు...


ఓ రోజు కోట గోడల్ని ఆనుకోని ఉన్న మైదానం లో మిగతా పిల్లల్ని ల తో కలిసి ఆడుకుంటూ ఉన్న శివుడిని అమ్మ, నాన్న లేని వాడని తోటి వాళ్ళు హేళన చేస్తారు... కోపం తో ఒకడి మెడ పట్టుకొని బిగిస్తాడు (మధు బాబు గారిలా చెప్పడం రాదండి)...ఈ లోగ కాపలా ఉన్న భటులు రావడం..అక్కడ నుంచి పారిపోయి(పారిపోవడం అంటే చిరుత వేగం తో ), దగ్గరలో ఓ పండ్ల తోటలోకి వెళ్ళి మిగల మగ్గిన రెండు పండ్లని కోసి, గమనించిన ఆసామి నుంచి తప్పించుకొని పారిపోతాడు...కోట లోకి వెళ్దాం అనుకుంటుండగా దగ్గర లో ఉన్న ఓ పొదల నుంచి ఓ ఆడగొంతు  ఆర్తనాదం.... ఏదైతే అది అవుతుంది  అని వెనక్కి వెళ్ళి చూస్తే నది వడ్డున ఉన్న ఓ పడుచు నదిలో కొట్టుకు పోతున్న తన పసివాడి ని చూసి అరుస్తూ ఉంది..వెనకా ముందు చూడకుండా దూకేసాడు శివుడు..దూరం గా ఉన్న ప్రకీర్తి పర్వత సానువుల్లోంచి దూకుతున్న సువర్ణ నది ప్రవాహం ఉధృతం గా ఉంది(పేర్లు భలే ఉన్నాయి కదా? )...మొత్తానికి పిల్లవాడిని కాపాడతాడు శివుడు అలానే ఆ తోట కాపలా వాళ్ళకి పట్టుబడతాడు...


అక్కడ నుంచి సభలో కొలువుతీరి దోపిడీ ముఠా కి  శిక్షి విధిస్తున్న సారంగుడి ముందు ప్రవేస పెట్టబడ్డాడు ... శివుడు చేసిన మంచి పనిని మనసులోనే మెచ్చుకుంటూ గజశాలని ఊడ్చే శిక్షని విధించాడు....


ఇంకా కొంచెం ఉంది...నచ్చితే నవ్య కొని చదవండి....


షూస్ కొనాలి అంటే 2000 నుంచి ౩౦౦౦ దాక పెట్టి బ్రాండెడ్ షూస్ కొంటాను....అవి మహా అయితే సంవత్సరం... 
ఏదైనా హోటల్ కి వెళితే మొహమాటం లేకుండా ఖర్చు...ఒక మల్టీప్లెక్స్ కి వెళితే అక్కడ కూడా ఇంతే...

ఇంటర్ ముందు జీవితం వేరు...ఇంటర్ లో మా నాన్న నాకు ౩౦౦ పెట్టి వెల్కమ్ చెప్పులు కొనిచ్చాడు..అవే అప్పటిదాకా  నా జీవితం లో విలువైన చెప్పులు..నలుపు రంగు, గట్టి సోల్, పాదం అంతా అందులో ఇమిడి పోయి..ఎంత బాగుండేవో..అప్పటికే అందరు వాడుతూ ఉంటె ఎప్పుడు కొంటాన అని ఎదురుచూసి, కొన్న రోజున ఆ ఆనందమే వేరు...
ఇంకా చిన్నప్పుడు...అంటే మా ఊర్లో మండల ప్రజాపరిషత్ పాటశాల లో చదువుకునేప్పుడు, డబ్బులంటే పెద్దమొత్తం అర్ధరూపాయి...ఐదు పైసలకి ఒక కొబ్బరి గోలి వచ్చేది...పావలాకి ఐదు వచ్చేవి. ఆ ఐదు తీసుకొని చేతిలో పెట్టుకొని ఆ చేతిలోంచి ఈ చేతిలో కి మారుస్తూ ఆ చెయ్యే నాక్కుంటూ అబ్బో అదో ఆనందం...అందరి దగ్గర అయిపోయాక నా చేతిలోవి తీసి నా దగ్గర ఇంకా ఉన్నాయిగా అని గెంతిన రోజులు...

మా నాగూర్ మామ కొనిపెట్టిన 2.50 రూపాయల పెన్ను పోతే రాత్రంతా ఏడ్చిన రోజు...

ఇరవై పైసల కి శేషయ్య కొట్లో తాటాకు టపాసులు కొని కాల్చిన రోజులు... మా నాన్నతో పాటు ఒంగోలు వెళ్తే దప్పిక అవుతుంది అంటే మా నాన్న రూపాయి ఇచ్చాడు..నేను వెళ్లి సోడా తాగి వచ్చాను..షోడ 50 పైసలు...వచ్చి అది మిగిలింది మా నాన్న కి ఇచ్చేసా..ఎం తాగావురా అని అడిగాడు...సోడా అని చెప్పా..పద అని తీసుకెళ్ళి రూపాయి పావలా పెట్టి సుగంధ సోడా తాగిచ్చాడు...అదో అద్భుతం...

మా అమ్మ కి చెప్పకుండా మా చెల్లి శేషయ్య కొట్లో అర్ధరూపాయి బిస్కెట్ అప్పుగా తెచ్చుకుంటే, అది తెల్సి మా అమ్మ ఇంట్లో చల్ల గుంజకి కట్టేసి వాతలు తేలేలా తన్నిన తన్నులు...

ఎక్కడైనా రోడ్డు మీద ఓ రూపాయి దొరికితే అబ్బురం గా తీసుకెళ్ళి అమ్మకిచ్చిన రోజులు... ఒక్కో సారి  కలలో, ఒక రూపాయి దొరికేది తవ్వుతూ ఉంటె రూపాయిలు దొరుకుతూనే ఉండేవి..అబ్బో కలలోనే ఆనందం...

బడి ఊరి నుంచి సింగరాయకొండ కి మారాక, ఎనిమిదవ తరగతిలో దీపావళి కి  మా నాన్న 50 రూపాయిలు ఇచ్చి టపాసులు కొనుక్కోమని ఇస్తే...ఓ పది మంది ని వెంటపెట్టుకెళ్ళి అవి అన్ని అవగొట్టి ఓ రెండు కవర్ల నిండా టపాసులు తెచ్చి మా నాన్న కి చూపిస్తే మిగతా డబ్బులేవిరా అని మా నాన్న అడిగినప్పుడు గుండె జారి కారిపోతుంటే మా అమ్మ ఉతుకిన ఉతుకుడు...

సింగరాయకొండ బడికి వెళ్ళేప్పుడు పోను రాను కలిపి బస్ కి రూపాయి చార్జి...అంతే ఇచ్చేది అమ్మ. బాక్స్ లో అన్నం... బడి లో వంటిగంట కొట్టగానే, బయట అన్నమ్మ అమ్మే కేకులు, జీళ్ళు, గొట్టాల పాకెట్లు చూసి అబ్బ ఒక్క రూపాయి ఉంటె ఎంత బాగుండేది అని ఆశ పడ్డ రోజులు...

ఊర్లో విసిఆర్ లో సినిమా వేస్తుంటే టికెట్ అర్ధరుపాయో,రూపాయో అది లేక ఇంట్లో అడగలేక ఇద్దరం కూర్చుని చెప్పుకున్న  కబుర్లు, నోటి కొచ్చిన కథలు...

తొమ్మిదవ తరగతి లో అమ్మ తో బాటు ఒంగోలు హాస్పిటల్ కి పొద్దున్న  వెళ్లి సింగరాయకొండ వచ్చేసరికి ఆకలి కి అల్లాడిపోయి నీరసం గా ఉంటె అమ్మ చూడలేక డబ్బులిస్తే 14 రూపాయలు పెట్టి శబరినాథ్ హోటల్లో మొదటి సారి తిన్న ఫుల్ మీల్స్....

చందమామ ఐదు రూపాయలు కదా..కొనలేం...దాంతో చందమామ ని ప్రతి నెల తెచ్చే స్నేహితుడిని ఎంచుకున్నాను....

ఐదు లోనో ఆరులోనో తెలీదు అమ్మ తో పాటు యరజర్ల మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఊరు పోతే, కమల పెద్దమ్మ 15 రూపాయలు ఇచ్చింది..దాంతో ఎం కొనుక్కోవాలి అని అమ్మని అడిగితే నీ ఇష్టం అంది....చెక్కతో చేసిన తిరుపతి వెంకన్న బొమ్మ కొనుక్కున్నాను..అది ఇప్పటికి ఉంది..ఆ మాట చెప్పుకొని మా అమ్మ ఇంకా మురిసిపోతూ ఉంటుంది...

ఒంగోల్లో ఇంటర్ చదివేప్పుడు బస్ చార్జి ఎక్కువని లారీ లో 5 రూపయిలిచ్చి వెళ్ళిన సందర్భాలు....

అప్పట్లో ప్రతిది విలువైనదే....ఎంత భద్రం గా దాచుకునే వాళ్ళమో....


 2004 లో రాజశేఖర్ రెడ్డి గెలవాలని  తపించిన వాళ్ళలో నేనొకడిని...గెలిచాక ఎదో మా ఇంట్లో పండగలా సంతోష పడ్డాము...ఇప్పటికి మా ఇంట్లో ఆయన అంటే అభిమానం, వాళ్ళకి అందాల్సింది వాళ్ళకి అందింది కాబట్టి..అది చంద్రబాబు చేయలేకపోయాడు కాబట్టి... కానీ చంద్రబాబు చేసింది పల్లెటూరి దాక చేరలేదు.IT అభివృద్ది, రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగులు సక్రమంగా పని చేయడం, విదేశి పెట్టుబడులు. అంత లాభం కాకపోయినా, ప్రజలకి మేలు జరిగింది. ప్రత్యక్షం గా అందలేదు, అందుకే ఎందరికో చంద్ర బాబు పరిపాలన చేదుగా ఉంటుంది. రైతులు కష్టల్ల్లో ఉన్నప్పుడు ఉదాసీనం గా వ్యవహరించడం ముఖ్యమైన తప్పిదం.

అంతా అయ్యాక ఆనందం ఆవిరయ్యింది. పథకాల పేరిట నిధుల మళ్లింపు , నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆస్తుల  సంతర్పణ,నిత్యావసర వస్తువుల  ధరల పెంపు, రాష్ట్ర విభజన నినాదాన్ని  ఒక పార్టీ పతనానికి వాడుకోవడం, ప్రభుత్వ సంస్థలు నష్టాల్లోకి వెళ్ళడం. అలా అని అన్ని  చార్జీలు పెరిగాయి. అయినా నష్టాల్లోనే ఉన్నాయి... విపరీతం గా పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపు. రియల్ బూమ్ పేరుతో   సామాన్యుడికి అందకుండా పోయిన స్థలాల ధరలు...సిమెంట్, ఇనుము, ఇసుక అన్ని రేట్లు పెరిగాయి.సామాన్యుడి ఆశ బంగారం, వెండి ఆకాశాన్ని తాకాయి.. విభజన సెగల్ని సాకుగా చూపి ఎన్నో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, IT పార్క్ లు పక్క రాష్ట్రాలకి తరలి పోయాయి..వాటి ని మన రాష్ట్రానికి తీసుకురావడం మానె అందులో కూడా స్కాం  చేసారు కొందరు మేధావులు...

ఇక దేశమంతా తీసుకుంటే కాంగ్రెస్ పాలనలో జరిగినన్ని స్కాం లు ఎక్కడ జరిగి ఉండవేమో..మీ కోసం ఈ లింక్..

http://en.wikipedia.org/wiki/List_of_scandals_in_India 

కాదేది దోచుకోడానికి అనర్హం అన్నట్టు ప్రతిదాన్లో మంత్రులు, అధికారులు తలా ఒక చెయ్యి వేసి పాల్గొన్నారు...

దాదాపుగా యాభై లక్షల కోట్ల అవినీతి జరిగింది..ప్రతి దాన్లో మంత్రుల హస్తం ఉంది... ఏదైనా ఒక చట్టం చేసి ఆ నల్లదనాన్ని వెనక్కి తీసుకురావడానికి వాళ్ళు చెప్పే సాకులు వినాల్సిందే...

ఇక నిత్యావసరాల ధరలు ఎలా పెరిగింది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది...మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనల్ని దోచుకోడానికే అన్నట్టుంటుంది...పండించే రైతు నష్టపోతున్నాడు, కొనే వినియోగదారుడికి గిట్టుబాటు కావడం లేదు. మరి బాగుపడుతుంది ఎవరు? ఎం పని చెయ్యకుండా ఉన్న దళారులు... వీళ్ళు ప్రతి రంగం లో ఉన్నారు, దోచుకున్నారు, శాసించారు.. 

బియ్యం,పప్పు,ఉప్పు ఇది అని లేకుండా అన్ని పెరిగాయి..గ్యాస్ మీద నియంత్రణ కూడా పెట్టారు..సామాన్యుడిని ఆదుకోడానికి ఎ విధంగాను ప్రయత్నం జరగలేదు..పెట్రోల్ కంపెనీల మీద నియంత్రణ ఎత్తివేయడం వల్ల వాళ్ళ ఇష్టానుసారం పెంచుతున్నారు...కొత్తగా డీజిల్ మీద ఎంత పెంచాలో అన్నది ఆ కంపనీ లకే వదిలేసారు...

సెజ్ ల పేరు చెప్పు వేల ఎకరాలని అప్పనం గా ఎవడికో కట్టబెట్టడం...ఎవరు బ్రతుకుతున్నారు?

ఇక విద్యుత్ బిల్లుల పెంపు..ఇది ఎవరికీ అర్ధం కాని ఓ పజిల్...2009, 2010 సంవత్సరాలకి గాను విద్యుత్ చార్జీల బకాయిలని ఇప్పుడు వసూలు చేస్తున్నారు..http://www.kseboa.org/news/power-tariff-hiked-in-andhra-pradesh-from-april-1-02042155.html... ఎవరు అడిగారయ్యా పథకాల పంపకాలు...ఇపుడు మా మాడు పగులుతుంది....

ఇక వాట్,  సేల్స్ టాక్స్, సర్వీస్ టాక్స్ ఇలా పన్నుల రూపంలో సామాన్య ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారు...

రిటైల్ రంగం లోకి విదేశి పెట్టుబడులని ప్రత్యక్షంగా అనుమతించడం....

మైనారిటీ ల సక్షేమం పథకాలు.ఆ పథకాల వల్ల లాభ పడ్డ కొందరు, వాళ్ళే మైనారిటీలు గా చెలామణి అవుతున్నారు...అవసరం లో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు.. అంతే కాకుండా  ఇతర కులాల్లో ఆర్ధికంగా వెనుకబడ్డ వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళుగా గుర్తించబడలేదు...దానికి కులమే అడ్డం...

ఇక ఎన్నో అంతర్జాతీయ సమస్యలు...అరుణాచల్ ప్రదేశ్ ని చైనా లో అంతర్భాగం గా చైనా చెప్తూ ఉన్నా, ఇంటర్నెట్ లో అన్ని మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ని డాట్స్ తో గుర్తిస్తున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం.

ఎన్నో తీవ్రవాద దాడులు జరిగినా పోటా లాటి చట్టాలని తిరిగి తీసుకురావడానికి ఏమాత్రం మనసు రావడం లేదు. నిన్న గాక మొన్న మన సైనికుల మీద దాడి చేసి తలలు తీసుకెళ్తే ధాటిగా సమాధానం చెప్పే దమ్ము లేకపోయింది...

ఇదంతా ఎందుకంటే అప్పటి నుంచి జరిగిన నష్టాన్ని ఉటంకించడమే...  భారత ప్రజలకి భవిష్యత్తు మీద భరోసా ఇవ్వడానికి యువరాజు రాబోతున్నాడు...

ఇక ఉంది మన చేతుల్లోనే..మీకు ఎవరు కావాలి? ఎలాటి ప్రభుత్వం కావాలి? ఒక నిర్ణయం తీసుకునేప్పుడు ఎప్పుడు మన అభిప్రాయం అడిగలేదు.. వాళ్ళ ఇష్టానుసారం గా తీసుకున్నారు...మనకున్న అవకాశం ఓటు వెయ్యడం... నేను ఎవ్వరిని బలపరచడం లేదు.. వచ్చే ఒక్కరోజు కులం,మతం,డబ్బు ఇవన్ని పక్కన పెట్టి దేశ భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేద్దాం...అది మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది...





మల్లన్న పండగ...

నేనైతే ఈ పండగ కోసం ఎదురు చూసేవాడిని. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తిండి పండగ, తినేవాళ్ళకి పండగ...

మా ఇంట్లో అడిగితే, కరువు వస్తే ఈ పండగ చేస్తారంట.కరువు తీరిపోవడానికి అన్నమాట.

ప్రతి ఇంట్లో ఎవరి స్తోమత కి తగ్గట్టుగా పిండి వంటలు చేస్తారు... ఇంటికి ఒక మల్లన్న ఉంటాడు... ఒక రాయికి నామాలు పెట్టి పూజ చేస్తారు...దేవుడికి నైవేద్యం పెట్టి, మల్లన్న ని ఒక్కడినే ఇంట్లో కి పంపించి తలుపు వేస్తారు. 

ఇక మాయాబజార్ లో పప్పు సర్ లాగ వియాల వారి విందు అహహ్హ నాకే ముందు అని కుమ్మేయాలి...అక్కడే ఒక చుట్ట ఉంటుంది..దాన్ని ముట్టించి నోట్లో పెట్టుకొని, చెయ్యి కడుక్కోకుండా ఆ నామాలు పెట్టిన బండ ని చేత్తో పట్టుకొని  వచ్చి తలుపు తట్టాలి..బయట నుంచి మూడు సార్లు అడుగుతారు"అయిందా మల్లన్నా?" అని...ఎం మాట్లాడకూడదు..ఊ అనాలి అంతే. అప్పుడు తలుపు తీస్తారు...

ఇక అక్కడ నుంచి నడుస్తూ ఊరి చివరి వరకు వెళ్ళాలి..మధ్యలో చాల మంది నవ్వించడానికి చూస్తారు, నవ్వకూడదు.. కొంతమంది గోచి కూడా లాగేస్తారు...ఐన సరే ఊరి చివరకి వెళ్లి ఆ రాయి అక్కడ పెట్టి చెయ్యి కడుక్కొని రావాలి...

నేను అందరి కన్నా ముందు తినేసి వెళ్లి వచ్చి గోల చెయ్యడానికి రెడీ గ ఉండే వాడిని...పొద్దున్నే వెళ్లి ఎవరి రాయి వాళ్ళు వెతుక్కునే వాళ్ళం...ఓ సారి రెండు ఇళ్ళకి  మల్లన్న గా ఉండే అవకాశం వచ్చింది...కొంచెం కూడా సందు ఇవ్వకుండా కూర్చోబెట్టారు...ఏదో మానవ ప్రయత్నం చేసా...


దాదాపు గా ఇరవై ఏళ్ల నుంచి ఆ పండగ చెయ్యలేదు...చిన్నప్పుడు మా అమ్మ ని అడిగా "మా మల్లన్న పండగ  ఎప్పుడు, అన్ని పండగలు వస్తున్నయి..మల్లన్న పండగ రాదా" అని...తిట్టింది..ఆ ఎప్పుకప్పుడు రాకపోదా అని ఎదురు చూసా..వయసొచ్చింది.పండగ మాత్రం రాలా..హ్మ్మ్ 
మాకు ఉహ తెల్సే నాటికి మా ఊరికి HNRBS బస్ సర్వీస్ నడుస్తూ ఉంది. దాన్ని సింగరాయకొండ లో ఉండే ఎర్జాని వాళ్ళ నాన్న నడిపేవాడు..అందులో ఎర్జాని వాళ్ళ అన్నదమ్ములు డ్రైవర్ గా ఉండే వాళ్ళు..మా ఊరి నుంచి సింగరాయకొండ మీదుగా పలుకూరు కి నడిచేది... 

మేము మా ఇంటి ముందున్న ప్రభుత్వ బడి లో చదువు సాగిస్తూ ఉన్నాం...కాని కొందరు బస్సెక్కి కాన్వెంటు కి పోతుంటే అదో సరదా,మేం కూడా బస్సెక్కి బడికి పోవాలని...

మా నాన్నకి  కూడా నా ఆలోచనే వచ్చి మా పిలకాయ్ కాన్మేంట్ లో సదివితే సించేచ్చాడని హనుమాన్ విద్యాలయ ( కాన్వెంట్ అయినా పేరు బాగుంది కదా) లో చేర్పించారు.అప్పుడు నేను ౩ వ తరగతి. ఇక బస్సు ఎక్కే యోగం పట్టింది...

బస్సు మేము వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు  కిట కిట లాడుతూ  ఉండేది. సీటు దొరకడం గగనమే...పిల్లలం అంతా ఇంజిన్ దగ్గర చేరే వాళ్ళం...అద్దం ముందు కూర్చుని ప్రయాణం ఓ గొప్ప అనుభూతి..చీకటి పడితే లైట్ల వెలుగులో తిరిగే పాములు, వాన పడేప్పుడు పైన్నుంచి కురిసే జల్లు...నిజంగా అద్భుతం..అక్కడ  కాని సీటు దొరికితే అంతే ఏదో పొడిచేసినట్టు అందరి వంక చూసేవాళ్ళం...

ఆ బస్సు లో ఓ ముసలాయన డ్రైవర్ గా వచ్చేవాడు..పెద్దగా మాట్లాడేవాడు కాదు...ఓ సారి బస్ ఎక్కిన్చేప్పుడు మా నాన్న వచ్చి ఎక్కించాడు, బస్ అంతా నిండు గా ఉండటం తో డ్రైవర్ వైపు నుంచి ఎక్కించాడు. లోపల కుదరక అక్కడే కూర్చున్నా..ఆయన ఏమనలేదు. ఇక అక్కడ కూర్చోడం అంటే అదేదో మనకోసం సింహాసనం వేసినట్టే...అలా చిన్నగా అలవాటయ్యింది.ఆయన బస్ తాత అయ్యాడు.రోజు అక్కడే నా సీటు.ఆయనతో యవ్వారం..బస్ రాత్రి వచ్చి మా ఊర్లోనే ఆగిపోయ్యేది.. మా ఇల్లు ఊరి మొగదాల్నే కాబట్టి బస్సు  మా ఇంటి ముందే ఆగేది. బస్ తాత మా ఇంటి కి వచ్చి మంచి నీళ్ళు తాగే వాడు..చేతిలో ఏదైనా తినడానికి ఉంటె నాకు, చెల్లికి ఇద్దరికీ చేరి సగం పెట్టె వాడు...ఉదయాన్నే బస్సు బయల్దేరి ఊర్లోకి పోయి వచ్చేది.. నేను బుజ్జి ఆయనతో పాటు ఊర్లో తిరిగి వచ్చే వాళ్ళం.. ఉదయాన్నే బస్ తాత తో పాటు ఊర్లో తిరిగి రావడం ఓ అలవాటు ఐంది... అప్పుడప్పుడు పలావు అన్నం కూడా తెచ్చేవాడు..భలే ఉండేది...
ప్రతి పండక్కి ఆ బస్సుని అలంకరించేవాళ్ళు...రంగు కాగితాలు, రంగులు,బుడకలు, తళుకు కాగితాలు, కొబ్బరి మట్టలు..అబ్బో అదో సంబరం...మాకైతే నిద్ర పట్టేదే కాదు.. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని...   బస్ అంతా అతికించడం అయ్యాక, బస్ తాత మాక్కూడా కొన్ని రంగు కాగితాలు ఇచ్చేవాడు....అవన్నీ మా ఇంటి పందిరికి వేలాడేవి...

ఒక సంవత్సరం అయ్యాక బస్ ఎక్కి తిరగలేక నేను,  నన్ను చూడకుండా ఉండలేక మా ఇంట్లో వాళ్ళు  తీసుకొచ్చి మా ఇంటి ముందున్న బడిలో వేసారు....బస్ తో బంధం తగ్గిపోయింది...బస్ తాతని తప్పకుండ పలకరించే వాడిని..కాని ఆయన రావడం తగ్గిపోయింది..ఎప్పుడైనా వచ్చేవాడు...కొన్ని రోజులకి పూర్తి గా రావడం మానేసాడు...నేను నా పనుల్లో పడిపోయాను...

మా ఊర్లో ఏడవ తరగతి వరకే ఉంది..అయిపోయాక మళ్ళి సింగరాయకొండకి..ఈ సారి శ్రీ శారద రెసిడెన్షియల్ లో చేరాను...స్కూల్ అయిపోయాక ఓ రోజు బస్ స్టాండ్ లో ఓ ముసలాయన..బాగా ముసలయన..పాత బట్టలేసుకొని ఉన్నాడు..తరిచి చూస్తే బస్ తాత.పరిగెత్తుకుంటూ వెళ్ళాను..బస్ తాత నేను గుర్తుపట్టావా అని అడిగా..గుర్తు పట్టలేదు..ఏడుపొచ్చింది.. ఎం మాట్లాడలేదు..అలానే ఇంటకొచ్చి మా అమ్మ కి చెప్పా..మా బస్ తాత ని చూసాను అని... కానీ నన్ను గుర్తు పట్టలేదు అని...వయసయిపోయింది కదరా అంది...

కాని మనసు ఒప్పుకోలేదు ఇప్పటికీ....