ఉఫ్, అమ్మా. రొప్పొస్తంది. ఆడ దాకా పోతానో లేదో. పెతి సారీ ఇట్నే అనుకుంటా, మొత్తానికి పోతా. ఈసారెందుకో వల్ల కావడం లా అంటూ పైకి చూసాడు తిరపస్సోమి. దూరాన గాలిగోపురానికి ఉన్న నామాలు నవ్వుతూ కనిపించాయి. తెల్సిన మనుషులు పలకరించినట్టుంది. మళ్ళీ ఓపిక తెచ్చుకొని అడుగు వేస్తూ ఉన్నాడు. ఉహు,  వల్ల కాడంలా. వయసైపోయింది కదా. ఉరామారిగ్గా 60 ఉండవూ, ఎల్లవ వచ్చినపుడు పుట్టానని అంటుండేది మా ముసల్ది. ఏడుకొండల వాడా వెంకరమణ గోవిందా గోవింద అప్రయత్నం గా నోట్లోంచి వచ్చేసింది. ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా   గోవిందా .
మజ్జాన్నం వచ్చా అలిపిరి కాడ్నుంచి ఇంకా ఈడ్నే ఉన్నా. కాసేపు కూసుంటే కానీ కదల్లేను అనుకుంటూ ఓ రాయి కి జరిగిలపడ్డాడు. పోతా ఉన్నారు పైకి జనాలందరూ. ముసిలోళ్ళు, కుర్ర పిలకాయలు, పసి బిడ్డలు. ఒక్కోర్ది ఒక్కో మొక్కు. కొత్తగా పెళ్లైనట్టుంది, పెళ్లి బట్టల్లో పోతన్నారు ఓ జంట. ఇంకో మొగుడు పెళ్ళాలు, బిడ్డని మెడ మీద కూసోబెట్టుకొని గోవింద నామాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకో కుర్ర పిల్లలు ముగ్గురు ఒకరు పసుపు, ఇంకొరు కుంకుమ, సివర పిల్ల కర్పూరం బెట్టి ఎలిగిస్తా ఉంది. అందరు వెళ్ళేది ఆయన కాడికే. నేనెప్పుడు వచ్చా మొదటి సారి?
ఎప్పుడ్నుంచో జుట్టు పెంచిన మా నాయన ఓ పాలి మొక్కు తీర్చుకోడానికి తిరపతి పోదామని గొడ్లని ఈరాసోమి కి అప్పజెప్పి మర్నాడు ఇంట్లో పూజ చేసి, మేళం పెట్టుకోని ఊరంతా తిరుగుతావుంటే అందరు వారు పోసి, దండం పెట్టి డబ్బులేసారు. అదేదో బలే ఉన్నింది అప్పుడు. ఆడ్నుంచి టేసన్ కాడికి వచ్చి రైలు రాక సానా సేపు ఎదురుచూశాం. మా అమ్మ చేసిన పులిహోర తింటా కూసున్నం.  రైలు వస్తాంటే ఎదో పెద్ద సంబడం. అదే ఫస్టు సారి రైలెక్కడం. అందరు గుంపులు గుంపులుగా తోసుకుంటా ఎక్కేరు. యాడ్నో కాస్త సోటు దొరికితే పిల్లోడ్ని అని కూసోబెట్టారు నన్ను. అదేదో ముసిల్దానిలా సిన్నగా పోతా ఉంది. యాడ బడితే ఆడ ఆగుతా. అయినా బాగున్నింది. దూరంగా కొండలు ఎవరో పడుకోని ఉన్నట్టు. అదే తిరపతని దింపినారు. గుడి యాడుందో ఎతుకుతా ఉంటె, సాన దూరం అని జెప్పినాడు మా నాయన. ఆడ నుంచి నడవాలంట. నేను మా నాయన, అమ్మ, మా సిన్నయ్య వచ్చాము. ఆడో పెద్ద గోపురం, ఇంకేంది గుడొచ్చేసింది అనుకున్నా. కాదంట అదే మొగదాల అన్నారు . పోతా ఉన్నాం. అడివి ఉన్నట్టుంది. అట్టా నడుసుకుంటా గుంపులు గుంపులుగా జనాలు. గోవింద నామాలతో హోరెత్తిపోయింది.గుండు చేయించుకున్నాం అందరం .  మొత్తానికి నల్లోడి దర్సనం ఐన్ది. అదో గొప్పఅనుభూతి . దేవుడంటే దేవుడే. నల్లటి మొహాన తెల్లటి నామాలు, చిన్నగా నవ్వుతు ఉండే మొహం. 

ఎప్పున్నా ఎవురన్న తిరపతి పోతంటే ఆళ్ళ కూడా పంపే ఓళ్ళు నన్ను . పెళ్లై నా కూతురు పుట్టినాక, మొక్కుకున్నా వస్తానని .  ఆడ్నించి పట్టుకుంది నాకీయావ. పెతేడు రావాల, ఆయన్ని సూడాల అని.  అప్పట్నుంచి పెతేడు నడిచే వత్తన్నా. కూతురుకి పెళ్లై  పొయిన్ది. మా ఆడది జబ్బు చేసి సచ్చిపోయింది . ఒక్కడనే, గొడ్డు కాయడం. ఉన్న కాత్తె పొలం సూసుకోడం . నాకు తొందరగానే ముసిల్తనం వచ్చేసినట్టుంది . నడవలేకపోతున్నా. 
"గోవిందా ఆ ఆ  గోవిందా " ఎవరో నన్ను లేపారు.. మళ్ళీ నడుస్తూ ఉన్నా... చీకటి పడుతుంది.జనాలు పల్చబడతన్నారు . నాకు ఎగసోస గా ఉంది. మొండికేసి నడుస్తానే ఉన్నా. మొక్కు తీర్చుకుంటానా ? ఏదో దిగులు. కాసేపటికి గుండెలో మంట, దడ. ఆగుదామని కూర్చున్నా . ఊపిరి అందడం లా. గొంతు పట్టేసినట్టుంది.ఎక్కిళ్ళు వచ్చాయి. దూరంగా నామాలు నవ్వుతూ ఉన్నాయి. మొక్కు తీరలేదు, అదే గమనం లో ఉంది. నల్లవాడి నవ్వు పిలుస్తూ ఉంది.  

ముందు వెళ్తున్న పెద్దాయన హఠత్తుగా కూలబడ్డాడు. దగ్గరకెళ్ళి కదిపి చూస్తే,తల వల్చేసాడు. ఖంగారు పుట్టింది. లేదు, అప్పటికే ప్రాణం పోయింది. ఎం చేయాలో తోచలేదు. అందరూ  గుమిగూడారు. పైన చాయ్ అమ్ముతున్న ఓ కుర్రాడిని  అడిగితే పోలీసులు ఉంటారు కొంచెం ముందుకు వెళితే చెప్పమన్నాడు . ప్రాణం ఉసూరుమంది . ముందుకు వెళ్లి పోలీసులకి చెప్పాను . వాళ్ళు నిట్టూర్చి కదిలారు. 



అమ్మమ్మ వాళ్ళ ఊరంటే నాకు గుర్తొచ్చేది ఏటి(పాలేరు) దగ్గర చేను, అక్కడ తాటి కర్ర, తేగలు, రోడ్డు పక్కనే ఉన్న మాగాణి, అక్కడ కూర్చుని లెక్కబెట్టిన బస్సులు, లారీలు. పక్కనే ఉన్న అమ్మ వారి గుడి. దూరంగా పొదల్లో కనిపించి భయపెట్టే వీరభద్రుడి గుడి. ఇంకా రైల్వే ట్రాక్ పక్కన పొలాన కూర్చుని లెక్కబెట్టిన గూడ్స్ రైలు పెట్టెలు, రైల్లో వెళ్ళే వాళ్ళకి చెప్పిన టాటాలు. ఊరికి అవతల దూరంగా ఉండే పెద్ద బడి, ఊర్లో ఉన్న అంగన్వాడి.. ఊరి నిండా ఉన్న గుడులు. ఇవన్నీ ఒక ఎత్తైతే, తాతయ్య దగ్గర పడుకొని విన్న కథలు, పొద్దున్నే ఆయన వడిలో దుప్పటి చుట్టుకొని కూర్చున్న రోజులు. అమ్మమ్మ వండే మెత్తాళ్ళ కూర, రొయ్యల పొడుం,ఎర్రగా కాచి తోడు వేసిన గడ్డ పెరుగు. పెద్ద మావయ్య డ్రామాలు వేసినప్పుడు కింద నేను వేసిన డాన్సులు. శీను మావయ్యతో ఏటి పక్కన చెట్ల కింద కూర్చొని తిన్న తాటి ముంజలు, తేగలు, బురి గింజలు, మావయ్యతో సైకిల్ మీద ముందు కూర్చుని స్పేడ్ గా ఫాస్ట్ గా అని అరిచిన రోజులు..... దాచుకోడానికి గుండె నిండా జ్ఞాపకాలు.

నేను పుట్టింది అక్కడే. నన్ను చంకన వేసుకొని తిప్పని వాళ్ళు లేరు అంట. ముందుగా అమ్మ కన్నా పిన్నే నన్ను పెంచింది.నన్ను సాయంత్రం వేళకి తయారు చేసి తల నిండా పూలు పెట్టి, దిష్టి చుక్క తో సహా గుడి దగ్గరకి తీసుకు వెళ్తే అందరు ఎత్తుకునేవాళ్ళు అంట. "బాగా బరువుగా ఉండే వాడివి రా, చేతులు మార్చుకుంటూ తిప్పల్సి వచ్చేది" అనేది పిన్ని.  ఓ రోజు అంకమ్మ గుడి దగ్గరకి వెళ్తుంటే ఎవరో లాటరీ అని చెప్తే 75 పైసలు కడితే నా పేరు మీద ఓ పెద్ద ఆంజనేయ స్వామి పటం వచ్చిందంట. దాన్ని ఇప్పటికీ ఇంట్లో  పెట్టారు. వెళ్ళినప్పుడు ఆయనకి కనపడకుండా రాను. ఏమో నాది అని గట్టి నమ్మకం. ఆ ఇంటికి,  మా ఇంటికి మొదటి బిడ్డ ని కావడంతో అందరు ముద్దుగానే చూసుకున్నారు. పిన్ని, పెద్ద మావయ్య, చిన్న మావయ్య, అమ్మమ్మ, తాతయ్య ఇలా అందరూ. అమ్మమ్మ అయితే "తిరిపిగాడు" (తిరుపతి స్వామి అంట, ఇలా అయితే అందరు నన్ను స్వామీ స్వామీ అని పిలుస్తారంట)అని పిలుచుకునేది. అందరూ అలానే పిలిచేవాళ్ళు.

మా ఇంటి ముందు రెండు పెద్ద కొబ్బరి చెట్లు, ఓ పెద్ద నీళ్ళ తొట్టి ఉండేది. ఇంటి ముందు బర్రెలు కట్టేసే వాళ్ళు. ఆ కొబ్బరి చెట్ల మీద కాకులు తెచ్చి పడేసిన బాదాం కాయలు ఏరుకొని పగలకొట్టుకొని తినడం ఓ జ్ఞాపకం. రాజ్యం కొట్టు, వీరయ్య కొట్టు, హుస్సేన్ కోట్లో తిన్న చిరు తిళ్ళు. ఆ రాజ్యం ఇంకా ఉంది "ఏందయ్యా బాగా పెద్దయ్యావుగా, మమ్మల్ని గుర్తు పెట్టుకున్నావా " అంటూ ఉంటుంది. ఆమె మా అమ్మమ్మ స్నేహితురాలు. ఆ ఊర్లో చాలా గుడులు ఉన్నాయి. శివాలయం, చేన్నకేశవుడి గుడి ఇవి ఊర్లో ముఖ్యమైనవి. ఊరవతల అయితే ముత్యాల గుంట దగ్గర ఉండే గంగమ్మ గుడి, పక్కనే కొత్తగా కట్టిన పోలేరమ్మ గుడి, మగాట్లో ఉండే అంకమ్మ గుడి, దూరంగా ఉండే వీరభద్రుడి గుడి.




చెన్నకేశ స్వామి గుడిలో ధ్వజస్తంభం చిరు గంటల శబ్దం గమ్మత్తుగా ఉండేది. సెంటర్లో ఉండే రచ్చబండ మధ్యలో పెద్ద రావి చెట్టు గల గలలు, ఆ చెట్టు మీద వాలే పిట్టల శబ్దాలతో సందడి గా ఉండేది. చెన్నకేశవుడి గుడిలో ఉండే వాహనాలు పెట్టే గది పాడుబడి ఉండేది. అందులో ఏముందో అని తెగ ఆలోచించే వాడిని. ఇక ముత్యాలగుంట నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ గంగమ్మ గుడి కి వెళ్ళడం ఓ ఆనందం. అక్కడకి వెళ్ళాక మాత్రం గంగమ్మ ని చూడ్డానికి భయం. ఎప్పుడూ తలుపులు మూసి ఉండేవి. ఎవరైనా ఎత్తుకుంటే, పాకులాడుతూ చూస్తే ఇంత పెద్ద వెండి కళ్ళతో నాలుగు చేతులతో నన్నే చూస్తూ ఉన్నట్టుండేది. ఏదో భయం "ఆ ఆ చూసేసా" అని దూకేసే వాడిని. ఇక మాగాట్లో ఉండే అంకమ్మ గుడి దగ్గర నీళ్ళ కొలను లో ఉండే తామర పూలు చూస్తే, అలా చూస్తూ ఉండే వాళ్ళం. పిల్లిపెసర కాయలు తింటూ ఆడుకునే వాళ్ళం. పెద్దోళ్ళు ఓ కథ చెప్పే వాళ్లు "పోద్దుబోయాక, పోలేరమ్మ తల్లి బంగారు చేట, చీపురు తీసుకొని, నెట్టి మీద నిప్పుల కుండతో గ్రామ రక్షణ కి బయల్దేరుతుంది" అని. అందుకే గుడి కి  దూర దూరంగా తిరిగేవాడిని. మగాట్లో కూర్చుని మేం ఆడుకునే ఆట, రోడ్డు మీద వచ్చే పోయే బళ్ళని లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అటు వెళ్ళేవి నీవి, ఇటు వచ్చేవి నావి అని "చూడు నా లారీ ఎంత బావుందో... రేయ్ నీకు కుక్కమూతి లారీ వస్తుంది" అని గోల గోల.

మా తాతయ్య, మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు. తెల్లటి రంగు, ఎప్పుడు తెల్లటి బట్టలు, పై పంచ, చేతిలో పొన్ను కర్ర. నా హీరో. అమ్మమ్మ లక్ష్మమ్మ. పెద్ద బొట్టు, ముక్కు పుడక, చెవులకి పెద్ద కమ్మలు, దేవుడంటే భక్తి, అమాయకత్వం. ఇంటికి వచ్చిన ఎవర్ని భోజనం పెట్టకుండా పంపని తత్త్వం. లచ్చుమ్మ మహాతల్లి రా అనిపించుకునేది. మా ఇంట్లో ఎప్పుడూ రెండు జతల ఎద్దులు ఉండేవి. వాటికోసం రంగు రంగుల చిక్కాలు, గంటలు, నల్ల తాళ్ళు, చెర్నాకోల లు ఉండేవి.

ఇంకా బాగా నచ్చేది పరవట పొలం అదే ఏటి కాడ చేను. ఆ చేను మా తాతయ్య కష్టం. చాలా కష్టపడి ఓ పదెకరాల ముక్క చేసాడు ఆయన. ఆ పొలం చుట్టూ తాటి కర్ర, వెదురు గూములు ఉండేవి. ఎప్పుడు వాటి నిండా కోతులు ఉండేవి, ఒకటి అరా కాదు గుంపులు గుంపులుగా. వాటిని తోలడానికి, భయపెట్టడానికి తాతయ్య దగ్గర వడిసేల ఉండేది. దాన్ని తిప్పుతుంటే అదో ఆశ్చర్యం. నేను కూడా ఓ చెయ్యి వేసే వాడిని, అది తిరిగి తిరిగి నాకే చుట్టుకునేది. ఏటి వడ్డున కూర్చుని చిన్న మావయ్య తో ముంజలు కొట్టించుకు తినడం ఓ మధురానుభూతి. ఇప్పటికి ఎండాకాలం నాకది గుర్తు చేస్తూ ఉంటుంది. తినడం అయ్యాక ఏటి లో స్నానాలు, చేపలు పట్టడం. కాళ్ళకి చెప్పుల్లేక పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు నీడకి చేరడం.

కొంచెం ఊహ తెల్సాక, మా ఊరికి వచ్చేసాను. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మా ఊరి నుంచి నడిచే వెళ్ళాలి. దాదాపు పది కిలోమీటర్లు. దాదాపు పదో తరగతి దాకా నడిచే వెళ్ళే వాళ్ళం. అలా వెళ్ళడం ఓ సాహస కార్యక్రమం. పొలాలన్నీ చవకలు, జామాయిల్ వేసి కారడవి లా ఉండేది. అందులో అడవి పందులు గుంపులు గుంపులు గా తిరుగుతుండేవి. ఓ సారి నాన్నతో ఎద్దుల బండి మీద వెళ్తుంటే, నాన్న తాటి చెట్టు మీద కూర్చున్న గ్రద్ద ని చూపించాడు. అదే మొదటి సారి నేను బయట గ్రద్ద ని చూడ్డం. పొలిమేర లో వెళ్తుంటే, ఏదైనా చచ్చిన బర్రేని పడేస్తే రాబందులు గుంపులు గుంపులు గా వచ్చి వాలేవి. ఎద్దుల బండి తాడు చేత్తో పట్టుకొని నేనే తోలుతున్నట్టు ఆనందపడేవాడిని. చెరువు మొదట్లో కి వెళ్లి పిలిస్తే పలికే చెలమయ్య తాత. ఊర్లో ఉండే మా అమ్మ స్నేహితురాళ్ళు, నాకు అత్తలు ఐన సుశీల అత్త, రాజ్యం అత్త,బుజ్జత్త... ఎప్పుడు వెళ్ళినా పలకరించే అనసూయమ్మ అమ్మమ్మ. ఇంకా బోలెడంత మంది చుట్టాలు.

ఆ ఊరికి ఉన్న మరో పెద్ద ఆకర్షణ చెరువు. కొన్ని వందల ఎకరాలు విస్తీర్ణంలో పరుచుకొని ఉంటుంది.ఎక్కువగా  మాగాణి పొలం ఉండడం వలన వరి చేలతో నిండి ఉండేది.

మా పెద్ద మావయ్య బాలయ్య అభిమాని, యధావిధిగా నేను కూడా. చిన్న మావయ్య చిరంజీవి అభిమాని, ఆ అభిమానంతోనే మా పిన్ని కొడుకు చిన్నోడికి చిరంజీవి అని పేరు పెట్టారు. మా మావయ్యల స్నేహితులు రాజుగారి శీను, పంతులు, పుల్లేక.

ఈ ఏడు అమ్మమ్మ చనిపోయింది, రెండవ సారి కాన్సర్ సోకి. ఏమో ఎందుకంటారో అమ్మమ్మ వాళ్ళ ఊరు అని, అమ్మమ్మ లేనప్పుడు ఏముంటుంది.


ముందు భాగం ..http://aakaasavaani.blogspot.in/2013/10/blog-post_6137.html


హోలీ రోజు ఉదయాన్నే నేను, రాజు గాడు రెడీ అయ్యి మా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం.. ఇంకా ఎవడు రాలా... సరే ముందు ప్రవీణ్ గాడి దగ్గర కి వెళ్దాం అని కిందకి వచ్చాం.... మా కన్నా పిల్లలు ముందే లేచి రంగులు గుడ్లు పట్టుకొని ఆడుతున్నారు.నేను ముందు దిగాను..... ఎదురుగా జాంబి "ఆ మన జోలికి ఎందుకు ఎందుకు వస్తుందిలే " అని లలలు లలలు అని నడుస్తూ ఉన్న నా మీద బాంబు దాడి జరిగింది. అతి దగ్గర నుంచి గుడ్డు తీసుకొని నా మూతి మీద కొట్టింది.... ఏం అర్ధం కాలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్లి ఓ పక్క  చతికిల పడ్డా... ఏం అర్ధం కావడం లేదు.... అదేంటి, నాకేంటి? నేనేంటి?

రాజు గాడు ముసి ముసి నవ్వులు నవ్వుతు వచ్చి లేపాడు..... "మామ అది, ఏంట్రా ఇది?" అంటూ ఉంటె... "అదట్నే, ఉంటది రా.. పద"... మెల్లగా లేచి పైకి వెళ్ళా,మా ఆంటీ వాళ్ళకి రంగు పూయడానికి. నేను పూసి బయట నిలుచున్నా, మా వాడు పూస్తున్నాడు. మళ్ళీ జాంబి వచ్చింది పైకి, నా వైపు నడుస్తూ వస్తుంది, చేతిలో గుడ్డు.... "ఇందాక ఎదో తెలియక కొట్టింది, ఈ సారి నో వే " అని భయాన్ని బిగబట్టి, చూడనట్టు నేను మా వాడి వైపు చూస్తున్నా... మళ్ళీ పడింది ఈ సారి తల మీద.... గుడ్డు ఓ వైపు కొడితే పగలడం చాలా కష్టం..సరిగ్గా ఆటే తగిలింది... ప్రాణం పోయింది... గోడని పట్టుకొని నిలబడాలని చూశా... నా వల్ల కాలా... కాసేపటికి ప్రాణం తెపరిల్లింది..ఎదురుగా రాజు గాడు. 

"బావుందా?" "అదేంటి మామా? నేనేం చేశా?" "నేనేం చేసానని రా? తప్పదు. అయినా ఇలాటప్పుడే అర్జునా, సారీ నరేషుగా గుండె బండ చేసుకోవాలి"...నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇక్కడే ఉంటె ఇంకెన్ని పడాలో అని ప్రవీణ్ గాడి ఇంటికి వెళ్లాం. మేం వెళ్ళిన కాసేపటికి నందు గాడు వచ్చాడు. "రేయ్ రాజుగా, మా చెల్లెమ్మ అందరిని ఇంటికి వచ్చేయమంది.".. "ఎవర్రా?".. "జాంబి".."మీ చెల్లి ఏంటి?" "నేను మీ కోసం మీ రూమ్ కి వెళ్తే, బలంగా రంగు కొట్టి అన్నయ్యా అందిరా" అని కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు. "బతికిపోయావురా, అన్నయ్య అంది"... ఇంతలో చిన్నా, కిరణ్, మల్లి గాడు, వాసు అందరు వచ్చారు. విషయమంతా ఎక్కువ చర్చించకుండా, "ఎలా ఐన సరే తాడో పేడో తేల్చాలి" అని నిర్ణయించుకుని రూమ్ కి వచ్చాం. పైన కారిడార్ లో లంకకి కాపలా ఉన్న లంకిణి లా తిరుగుతుంది.

... రేయ్ నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని తోసుకుంటూ అందరం వచ్చాం లోపలకి..చిన్నగా కిందకి దిగింది. ఎదురుగా నేను, నా వెనక రాజుగాడు. మీదకి వచ్చి, బలంగా తోసింది చేత్తో. నేను వంగడం, అది రాజు గాడికి తగిలి గోడ మీద పడ్డం.. ఈలోగా అందరం పైకి వెళ్ళిపోయాం, వెనకనే రాజుగాడు. అందరం పైనుంచి బకెట్ లో నీళ్ళు నింపి, మగ్గులతో కిందకి పోస్తున్నాం. "దమ్ముంటే, కిందకి రండి" "నువ్వేరా దమ్ముంటే" అన్నాడు ఎవడో. వాడెవడో వెతికే లోపే పైకి బయల్దేరింది... అందరు ఒక బకెట్ లో రంగు నీళ్ళు నింపి, నా చేతిలో పెట్టి "నువ్వు  పట్టుకోరా మేం పోస్తాం " అని ముందు నన్ను నిలబెట్టి నా పక్కన వరసగా నిలబడ్డారు... అందరు ఉన్నారుగా అని లెక్క చూసుకొని ఎదురుగా చూస్తే ఎదురుగా జాంబి... వచ్చేసిందిరో అని చూస్తే ఒక్కడు లేడు...

పోటీకోచ్చిన ఆంబోతులా బుసలు కొడుతూ.. చేతిలో ఉన్న బకెట్ అంతా ఒక్క సారిగా మీద కుమ్మరించేసా... అయినా సరే చూపు తిప్పకుండా చూస్తూ ఉంది...


 నేను వణుకుతూ , బకెట్ అక్కడ పడేసి పరిగెత్తి షెడ్ లోకి వెళ్ళిపోయా... ఆ షెడ్ డోర్ దాటాక పక్కకి తిరిగి  వెనక్కి వెళ్తే మా రూమ్. జాంబి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చివర జారి కుండీ మీద పడి దాన్ని పప్పు పప్పు చేసింది. "రేయ్ జాంబి పడిపోయింది రోయ్" అనగానే.. ఒక్కోడు ఆమె మీద నుంచి కూడా దూకి పారిపోయాం... మధ్యాహ్నం 2 దాకా ఇంటికి రాలా.. ఇంటికి రమ్మని పిల్లల చేత రాయబారాలు... మా శ్రీను అంకుల్ ని ముందు పెట్టుకొని, అందరి చేత  వార్నింగ్ ఇప్పించి ఇంట్లోకి వెళ్లాం... ఇది జరిగిన తరువాత అందరు ఆమె ని తిట్టడం... ఆమె వెళ్ళడానికి తయారయ్యి తరువాతి రోజు రాత్రి మా రూమ్ దగ్గరకి వచ్చింది... రాజు గాడు బెడ్ మీద కూర్చుని ఉన్నాడు.. పాప వచ్చి "నరేషన్నా జాంబి అక్క వచ్చింది, పిలుస్తుంది"... రాజు గాడు పడుకొని కళ్ళు మూసుకున్నాడు. నేను కూడా పడుకోబోతుంటే "నువ్వు ఉన్నవని చెప్పేసా".. "హ్మ్మ్ ".. బయటకి వచ్చా "ఎంటండి?" "రాజు?" "నిద్రపోతున్నాడు" "నేను ఊరికి వెళ్తున్నా, సారీ చెప్పండి".. అలాగే అండి... "హ్యాపీ జర్నీ".... లోపల దండం పెడుతూ మా వాడు.....

*******సమాప్తం******* 
ఇది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. వచ్చింది, మా గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది, మమ్మల్ని కూడా.....

అవి నేను, రాజు గాడు చదువుకుంటూ, ట్యూషన్ చెప్పుకుంటున్న కాలం... 100 రూపాయలు ఉంటె పండగ చేసుకుంటున్న కాలం... చేతిలో బాట్ బాల్ ఉంటె చాలు టైం అలా గడచిపోతున్న కాలం.... మాకు తెలియకుండానే, మా ప్రమేయం లేకుండానే మేం ఓ పెద్ద ఆపదలో ఇరుక్కుపోబోతున్నామని మాకు తెలీదు... ఆ విధంబెట్టిదన....

నేను మా ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన షెడ్ లో ట్యూషన్ చెప్పేవాడిని. ఓ 10 మంది పిల్లలు వచ్చే వాళ్ళు. రాజుగాడు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో చెప్పేవాడు. కొత్త సంవత్సరపు సంబరాలు చేసుకుందాం పిల్లలతో అని నిర్ణయించుకున్నాం. పిల్లలంతా సరే అన్నారు. కొందరు పాటలు, కొందరు డాన్స్ ఇలా. మా రాజు గాడు వీర శూర చిరు ఫ్యాన్. ఎంత పెద్ద ఫానో రాయాలంటే ఓ పోస్ట్ సరిపోదు.అది ఇంద్ర సినిమా వచ్చి వీణ స్టెప్ తో చిరంజీవి చెడుగుడు ఆడుకుంటున్న రోజులు. మా వాడు కొత్త సినిమా రావడం ఆలస్యం, ఆ స్టెప్ నేర్చుకోడానికి. ఇక వీణ స్టెప్ ని విరిచి,చించి ఆల్రెడీ కాలేజి లో జూ.చిరు స్టాంప్ పడిపోయి మంచి ఫాం లో ఉన్నాడు. ఏదో మా పిల్లల కోసం డాన్స్ వేయడానికి ఒప్పుకున్నాడు. అదే స్పెషల్ అట్రాక్షన్. 

అది డిసెంబర్ 31. సాయంత్రం నుంచి నేను, రాజు గాడు, పిల్లలు  అలంకరణ పని లో ఉన్నాం. మా ఆంటీ వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. నేను నిచ్చెన ఎక్కి రిబ్బన్స్ అతికిస్తున్నా రాజు గాడు అందిస్తున్నాడు. ఎవరో తెలీదు కానీ ఓ పెద్దావిడ (పెద్దావిడ అంటే, వయసైపోయిన ఆవిడ కదండీ... పెద్దగా ఉన్న ఆవిడ (ఎవరి మనోభావాలు కించపరచడానికి కాదు)) కూడా సాయం చేస్తున్నారు. ఆవిడ కూడా రిబ్బన్స్ అందిస్తున్నారు. మా రాజు గాడు "ఆంటీ ఆ పచ్చ రిబ్బన్ ఇవ్వరా?", ఆవిడ ఓ చూపు చూసి "ఆంటీ నా? నేను కూడా స్టూడెంట్ నే" అంటూ విస విసా వెళ్ళిపోయింది.

అంటే ఆ ఆ అది మేము అలా అనుకోలేదు....అని.... తరువాత తెల్సింది ఏంటంటే ఆమె 10 వ తరగతి అంట,
 పేరు జాంబవతి( పేరు మార్చడమైనది.చాల హైట్, లావు, కారు నలుపు, ఒకింత భయం గొలిపే ఆకారం.) మా ఆంటీ వాళ్ళ చుట్టాలు. కింద ఇంట్లో ఉంటుంది.
సరే సర్దుకొని, సాయంత్రం ప్రోగ్రాం చించేసాం (ఎదో అలా). మా రాజు గాడు అతిధి పాత్రలో వీణ విరగ్గొట్టాడు. ఆ స్టెప్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆవిడ కి అదే ఆ అమ్మాయికి సారీ లు విన్నవిన్చుకున్నాం.
ఇక రోజులు సాఫీగా  సాగిపోతున్న సమయంలో, మా రాజు గాడు వచ్చి  "రేయ్, ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది" అన్నాడు. అమ్మాయి అనగానే చుట్టు పక్కల ఉన్న అందరు ఓ సారి మైండ్ లో తిరిగారు. ఎవరబ్బా? "ఎవర్రా?" వాడు కొంచెం ఇబ్బంది గా " అదేరా, ఆ రోజు ఆంటీ అన్నాం కదా"...:"జాంబవతా?" అని షాక్ లో నేను... "ఊ".... "ఎహే ఊరుకో, అంతా నీ భ్రమ, అదేం ఉండదు.. పట్టించుకోకు" అని సర్ది చెప్పా. మళ్ళీ కొన్ని రోజులకి అదే మాట, ఈ సారి చెయ్యి ఊపిందని.నాక్కొంచెం భయం మొదలైంది. వీడు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ట్యూషన్ చెప్పి రాత్రి  8 ఆ ప్రాంతంలో వచ్చే వాడు. వచ్చాక ఇద్దరం కలిసి సైకిల్ మీద తినడానికి వెళ్ళే వాళ్ళం.
ఓ రోజు, ఇద్దరం రూమ్ లో ఉంటె రాత్రి 8 కి, మా చిన్నా గాడు (అప్పట్లో సన్నగా, అద్దాలు పెట్టుకొని ఉండేవాడు)వచ్చాడు. "రే,రాజుగా నిన్ను కింద ఆంటీ పిలుస్తుంది"  ఇద్దరం ఎగిరి పడ్డాం... రాజు గాడు సీరియస్ గా "ఎవర్ని రా?".. "నిన్నే".."జోక్ చేయకు?" "నిజం రా, నేను మెట్లు ఎక్కుతుంటే, ఏ బాబు అని పిలిచింది, నేను భయంగా వెళ్లాను. పైన రూమ్ లో రాజు ని పిలువు , అందిరా"... "ఎహే పోరా" అని వీడు తడబడే అడుగులతో కిందకి వెళ్ళాడు. నా సైకిల్ వాళ్ళ గుమ్మం పక్కనే పార్క్ చేసి ఉంటుంది. నేను కంప్యూటర్ లో ఏజ్ ఆఫ్మ్ ఎంపైర్ గేమ్   ఆడుతున్నా, చిన్న గాడు చూస్తూ ఉన్నాడు. ఇంతలో రాజుగాడు విసురుగా పైకి వచ్చాడు. వాడి చేతిలో ఓ పేపర్. "ఏంటి మామ, ఏమైంది?"..."రేయ్..()*#@()@#()... నాకు లెటర్ ఇచ్చిందిరా"...ఆ మాట వినగానే నేను, చిన్నాగాడు...
"నీ యబ్బ, ఆపండ్రా... ఏమనుకుంటుంది... ఆంటీ కి చెప్తా.." అని ఆవేశం తో ఊగిపోతున్నాడు... మేం కింద పడి ఇంకా నవ్వుతునే ఉన్నాం. ఇంకా నవ్వితే, వాడు ఏడుస్తాడని... వాడిని కూర్చోబెట్టి,"అర్జునా, సారీ రాజుగా ఆమె ఎదో చుట్టపు చూపుగా వచ్చింది, కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే, వాళ్ళ ఊరికి వెళ్ళి పోతుంది"..అని గీత ను బోధించాం. అప్పుడు అర్ధం కాలేదు మేము ఎంత పెద్ద తప్పు చేసామో,అది మా వాడికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేసిందో.ఇంతకీ ఏం జరిగిందో చెప్పా లేదు కదూ, వీడు కిందకి వెళ్ళే సరికి ఆమె మెట్ల మీద వీడి కోసం కాపు కాసి ఉంది. వీడు మెల్లిగా సైకిల్ దగ్గరకు అడుగులేసాడు... దగ్గరకు రాగానే ఆ ఆకారం కదిలింది.వీడు వెనక్కి తగ్గాడు. "ఇలా రా!" "ఏంటి?" "చెయ్యి చాపు" "దేనికి?" "చాపు చెప్తా" వీడు చెయ్యి చాపడం, ఆమె చేతిలో ఓ కాగితం పెట్టి, సిగ్గుతో ఇంట్లోకి దూసుకెళ్ళడం క్షణ కాలం లో జరిగిపోయాయి. భూమి క్షణ కాలం కంపించి ఆగిపోయింది, వీడి గుండె లాగా.

 లేఖ లో ఏముందో చెప్పలేదు కదా? ఓ రూళ్ళ కాగితం మీద, పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది"I LOVE YOU, నీకు నేనంటే ఇష్టం ఉంటె రేపు ఉదయం ఓ రోజా పువ్వు పట్టుకొని బయట నిలబడు".... మళ్ళీ మొదలు...



వాడు ఆ లెటర్ చించేసాడు. తరువాతి రోజు నుంచి రాజు గాడు జాగ్రత్త పడ్డాడు. రూమ్ దగ్గర వంచిన తల వాళ్ళ మామ వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తే వాడు. ఈ క్రమంలో మధ్య మధ్య లో చేతులు ఊపడం, సైగలు అన్ని అయిపోయాయి. ఎ రోజు కా రోజు, వాడికి భయం పట్టుకోసాగింది. కింద నుంచి మా రూమ్ కి వచ్చే మెట్ల మీద లైట్ ఉండదు. అంతా చీకటి. ఓ రోజు వాడు ట్యూషన్ అయ్యాక రాత్రి 8 తరువాత  పైకి వస్తూ ఉంటె, ఆమె ఆ మెట్ల మీద నిలుచుని ఉంది. రాజుగాడు తడబడి తట్టుకొని నిలబడ్డాడు.

"ఏయ్, అడ్డం లే"... "నా సంగతి ఏం చేసావ్?'.."నువ్వు వచ్చిన పని చూసుకు వెళ్ళు".... అని తప్పించుకు వచ్చేసాడు.. పైకి వచ్చి ఒకటే ఏడుపు.. "మామా, ఈ టైములో రూమ్ కి రావాలంటే భయంగా ఉందిరా"...ఇక ఆ రోజు నుంచి ముందు వెనకా చూసుకొని రావడం మొదలు పెట్టాడు...

ఇంకోసారి, వాడు షెడ్ లో వంటరిగా దొరికాడు. "ఏంటి, ఏం చెప్పకుండా అలా తప్పించుకు తిరిగితే ఎలా?" "నీకేమైనా పిచ్చా ? ఆంటీ కి చెప్తాను"... అని రూమ్ కి వచ్చి కోపంతో ఊగిపోయాడు "ఇక నా వల్ల కాదురా, చెప్పేస్తా ఆంటీ కి" "మామా కంట్రోల్"....

ట్యూషన్ కి కింది పిల్లలు కూడా వచ్చే వాళ్ళు. ఓ రోజు వాళ్ళు "ఆ నరేషన్నా, జాంబి అక్క ఏంటి, నీ గురించి తెగ పొగుడుతుంది".....ఆఆయ్ 
 "నన్నా?" "నిన్నే, నీ చేతిలో కొట్టించుకోవడం, మా అదృష్టం అంట".... నాకేదో తేడా కొట్టింది.పెద్దగా పట్టించుకోలేదు.. టాపిక్ మార్చా....


హోలీ ఆ రోజు.ఆ రోజే నాకు తల బొప్పి కట్టబోతుందని తెలీదు....

తరువాయి భాగం

http://aakaasavaani.blogspot.in/2013/10/blog-post_6137.html

విభజన దిశగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సహజంగానే సీమాంధ్ర ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత వినిపించింది. ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నా అసలేం పట్టనట్టు ఉన్న కేంద్రం, రాజకీయనాయకుల ను చూసి తమ గోడు ను ఎవరికీ చెప్పుకోవాలో తెలీక సతమతమైపోయారు. అయినా సరే విభజన జరగదు అని ఘంటాపథం గా చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు అదేదో కొత్త విషయం అన్నట్టు, అసలిప్పుడే విన్నట్టు అవాక్కయ్యారు, తమ శక్తి వంచన లేకుండా ఈ విషయాన్నీ తీవ్రంగా ఖండించారు. మేం అలిగాం, ఆశ్చర్యపోయాం, బాధపడ్డాం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని మైకులు విరగ్గోట్టేసారు. అదేమైనా కొత్త విషయమా? ప్రతి కాంగ్రెస్ నాయకుడికి తెలిసిన విషయం.

కాంగ్రెస్ ముందుగా విభజనకి అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా, ముందుగా ప్రాంతీయ పార్టీల  అభిప్రాయం అడిగారు. వారి వారి రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అందరు "మీ ఇష్టం " అనేసారు. అలా అనని వాళ్ళ మీద తెరాస పార్టీ ని ఉసిగొలిపి ద్రోహులుగా చిత్రీకంచారు. ఇక్కడ ఎక్కడా, తెరాస పార్టీ కాంగ్రెస్ ని నిందించలేదు, TDP ని తప్ప. యధావిదిగానే అందరు సరే అన్నారు, మేం నిర్ణయం తీసుకుంటున్నాం అని కాంగ్రెస్ అనగానే మెజారిటీ ప్రజలైన సీమంద్రుల నుంచి వ్యతిరేకత మొదలైంది. పార్టీలు చెప్పింది విని నిర్ణయం తీసుకుంటారా?మాకేం కావాలో వినరా? మేం ఒప్పుకోం అంటూ అందరు రోడ్డు మీదకి వచ్చారు. కనీసం ఏంటి అని అడిగిన పాపాన ప్రభుత్వం కానీ, మే తరపున మేం మాట్లాడతాం అన్న రాజకీయనాయకుడు కానీ లేకుండా పోయాడు.

ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న అభద్రత కి సమాధానం ఎవరు చెప్తారు? సరే విభజించారు, కొత్త రాజధానికి ఏం చేస్తారు అని అడిగిన చంద్రబాబు మీద కాంగ్రెస్ వాళ్ళే నీకసలు మనసు లేదా? ప్రజల మనోభావాలను గౌరవించకపోయావు సరే, ఇటివంటప్పుడు ఇలా మాట్లాడతావా? అంటూ విరుచుకు పడ్డారు. ఇచ్చింది కాంగ్రెస్ అన్న మాట వాళ్ళకు అవసరం లేదు. ఇపుడేం చేస్తారు? ఇంకా ప్రజలకి నిజాలు తెలియకుండా ఎన్ని రోజులు మభ్యపెడుతూ ఉంటారు?

ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా TDP దారుణంగా విఫలం ఐంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఏంటి ఇవ్వాలా? అని అడిగిన కాంగ్రెస్ ని వదిలేసి తెలుగుదేశం లెటర్ ఇస్తేనే విభజన జరుగుతుంది అని అటు టి కాంగ్రెస్, తెరాస TDP మీద మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. ఎటు తేల్చుకోలేక, బలంగా నిలబడలేక విభజనకి అనుకూలంగా లెటర్ ఇచ్చింది. అక్కడే సగం చచ్చిపోయింది.

ఇక YSRCP పార్టీ కి సిద్ధాంతం అంటూ లేకుండా ప్రయాణం మొదలు పెట్టి, ఎన్నోఅవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సందర్భానికి తగ్గట్టు నిర్ణయాలు మార్చుకుంటూ వచ్చింది. ఆ పార్టీ కూడా TDP నే తప్పు పట్టింది. విభజనకి ముందు లెటర్ ఇవ్వలేదని, తరువాత TDP లెటర్ ఇవ్వడం వలనే విభజన జరిగిందని విరుచుకుపడింది. ఒక్కసారైనా కాంగ్రెస్ ని కానీ తెరాస ని కానీ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోయింది.ఇదంతా చూస్తుంటే TDP పతనానికి అందరు కల్సి తీసుకున్న నిర్ణయం లా కనిపిస్తుంది. దాన్ని అడ్డుకోవడం లో తెలుగుదేశం దారుణంగా విఫలమై, తమ ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంది.

ప్రస్తుతానికి ఇంకా నాటకాలు ఆపని సీమంధ్ర కాంగ్రెస్ నాయకులు(అందరు కాదు చాలా మంది ఉండవల్లి లాటి వాళ్లకి మినహాయింపు ఇవ్వచ్చు నా అభిప్రాయంలో) ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నారు.

ప్రజలకి ఏం చేయాలో తోచడం లేదు. ఇప్పటి దాకా ప్రశాంతం గా సాగిన ఆందోళన ఇక హింసాయుతంగా మారుతుందేమో అనిపిస్తుంది. హింస చేయాలంటే ఎవరిని హింసించాలి? ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి  ఒక్కరూ అందులో భాగస్వాములే. ఎవరి మీద పోరాటం చేయాలి? తాము ఎన్నుకున్న నాయకులు పార్టీలకి కట్టుబడి వారి వారి రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారు. చేయాల్సింది ఇప్పుడున్న రాజకీయ నాయకుడు అనే వాడిని ఎన్నుకోకపోవడం. ప్రజల చేతిలో ఉన్నది ఓటు, దానితో ఏం చేయాలి? ఎవడిని ఉంచాలో, ఓడించాలో,నిలబెట్టాలో నిర్ణయించుకోగల అధికారం ప్రజల చేతిలో ఉంది. కులం,మతం,డబ్బు,మన, తన ఈ ఒక్కసారికి పక్కన పెట్టండి. సుప్రీం కోర్ట్ ఈ మధ్య తీసుకున్న నిర్ణయం ప్రకారం మనకు ఎన్నికల్లో నిలబడ్డ ఎ ఒక్కరూ నచ్చకపోయినా అందరినీ నిర్మోహమాటంగా తిరస్కరించవచ్చు.

విభజన జరిగింది. దానిలో మార్పు లేదు. దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఈ మాట చాల మందిని బాధ పెట్టొచ్చు.

ఆంధ్రప్రదేశ్ కి ఉన్న బలం పల్లెటూర్లు. ఒక స్నేహితుడు చెప్పినట్టు, ప్రతి ఊరు ఓ స్వయంప్రతిపత్తి కలిగి ఉండేది. వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి. తను అన్న మాటలని ఇక్కడ యధావిధిగా ఉంచుతున్నా"ఇప్పటికయినా తెలివి తెచ్చుకుని పరిశ్రమల కోసం పరిగెట్టడం, రియల్ ఎస్టేట్ మోజు వదిలించుకుంటే మంచిది. స్వయం ప్రతిపత్తిగల గ్రామాల రూపకల్పన వైపు అడుగేస్తే మంచిది. ప్యాకేజిలు మోసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్ని కలుషితం చెయ్యకండి బాబూ.

అన్నపూర్ణ అన్న పేరు తిరిగి సంపాదించుకోవటమే మేలు. ఏనాడో మనం గొయ్యితీసి పాతి పెట్టేసిన రైతుల అవశేషలున్నాయేమో వెతకండి. దొరికితే పల్లకీలకెత్తి సగౌరవంగా మోసుకురండి. గతమెంతో ఘనకీర్తి కలిగిన పల్లెలు మనవి. బాహ్యప్రపంచం మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనుగడ సాగించిన ఇండిపెండెంట్ యూనిట్స్ మన పల్లెలు. వాటిని చంపేసి పట్టణాలకొచ్చి మనం సాధించింది ఏమిటి? ఒక్క పట్టణం లేకుంటే బ్రతుకే అంధకారమయ్యే స్థితి." ఎంతో యదార్ధం.కాటికి కాళ్ళు చాచి ఉన్న పల్లెటూర్లని బతికిద్దాం. వ్యవసాయాన్ని బతికిద్దాం. చెరువులను తవ్వుకుందాం. నీటి నిల్వలు పెంచుకుందాం. మళ్ళీ కళ కళ లాడేలా చెయ్యడం మన చేతిలోనే ఉంది. ఎన్ని అనుకున్నా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉంటాయి. ఎవరికీ లేనంత సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మనది. బకింగ్హాం కెనాల్ ని మళ్ళీ పునరిద్ధరించవచ్చు. ఓడరేవుల అభివృద్ధి, సహజ నిక్షేపాల వెలికితీత, వ్యవసాయం,పర్యాటకం,విద్య అన్ని రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సిన సమయం. నిజమే మన దగ్గర ఏం లేదు. సాధించుకుందాం, దానిలో ఈ రాజకీయ నాయకులకి మాత్రం చోటు ఉండకూడదు. మాకేం కావాలో నిర్ణయించేది మేమే అని చెప్పడానికి, మన గొంతు వినిపించడానికి మన వాళ్ళంటూ ఉండాలి. వజ్రం తయారు కావాలంటే కోత తప్పదు. ఓ ఆకారం రావడానికి ఎన్నో ముక్కలు పోవాల్సిందే. అప్పుడే అది వజ్రం అవుతుంది.  
మా ఇంటి ముందు గుడిసెల బడిలో చదివేటప్పుడు, నాలుగో ఐదో గుర్తు లేదు కానీ. బడి ఐపోయాక(4 కే అయిపోద్ది గా ) ఊరికే ఉంచడం ఎందుకు రావయ్యపంతులు కాడికి పంపు పిల్లలని అని ఎవరో చెప్పారు మా నాన్నకి.

ఓ రోజు నన్ను,బుజ్జి ని తాయారు చేయించి పంతులు గారింటికి తీసుకెళ్ళాడు.పంతులుగారిల్లు బాగా పాతది. బయటనే కుడిపక్క చుట్టూ గోడ కట్టిన ఖాళీ స్థలం. కూరగాయల మడులు, వంట చేసుకోవడానికి కావాల్సిన కర్రలు అన్నీ అక్కడే ఉంచేవాళ్ళు. అందులో ఓ చెక్క కుర్చీ. మా తో పాటు అనవయ్య, శీనిగాడు ఇంకోరెవరో చేరారు. ఆయన మనవరాలు విజయలక్ష్మి తో కలిపి ఆరుగురం అయ్యాం. విజయలక్ష్మి మా క్లాసే.

రావయ్యపంతులు గారికి బాగా వయసైపోయింది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళంతా బాగా పైకి వచ్చారని చెప్పేవాడు మా నాన్న. నడుం వంగిపోయి,వంటి మీద చొక్కా లేకుండా, బక్క పలచని శరీరంతో, ఇంతలావు అద్దాలు పెట్టుకొని ఉండేవారు. కోపం బాగా ఎక్కువ. ఆ ఇంట్లో ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ మనవరాలు ఉండేవాళ్ళు.వాళ్ళ పిల్లలంతా ఎక్కడో స్థిరపడ్డారు.

మేము సాయంత్రం పూట వెళ్ళే వాళ్ళం, అంటే 6.30 ఆ ప్రాంతంలో. మాతో పాటు కింద వేసుకు కూర్చోడానికి గోతం పట్ట, కరెంటు పోతే ఓ లాంతరు. ముందు కిరసనాయిలు బుడ్లు తీసుకెళ్ళే వాళ్ళం. ఓ రోజు మా నాన్న లాంతరు కొనిచ్చాడు. అదో ఆనందం. దానికి చిమ్ని, దాన్ని తుడవడం. వత్తులు వెయ్యడం. చిమ్ని పగిలితే మా వీపులు అమ్మకి అప్పగించడం. అబ్భ ఆ అనుభూతే వేరు.

అక్కడకి వెళ్తే బడిలో చెప్పిందే చదువుకోవాలి. హోంవర్క్ ఉంటె చేసుకోవాలి. ఇక అంతా లోకాభిరామాయణమే. మాకు భారతం, రామాయణం లాటి కథలు, పంచతంత్రం కథలు, ఇంకా పొడుపు కథలు చెప్పేవారు.ఆయన సాయంత్రం పూట తపస్సు (మేం పెట్టిన పేరు) చేసుకునేవారు. కుర్చీలో కూర్చుని,చేతిలో తులసి మాల తిప్పుతూ కళ్ళు మూసుకొని ఉండేవాళ్ళు.మేం అప్పుడు గమ్మున ఉండే వాళ్ళం.

చదివేప్పుడు దగ్గర ఉంటె గట్టిగా మొట్టేవాడు. బాగా నొప్పి పుట్టేది.అప్పుడప్పుడు కొట్టే వాడు కూడా. మహా కోపిష్టి అని చెప్పా కదా, తెగ తిట్టేవాడు. ఆయనకి ముక్కుపొడి(నశిం ) పీల్చే అలవాటు ఉండేది. నాకేమో చిరాగ్గా ఉండేది.
తుమ్మితే మీద పడేది. దూరంగా కూర్చునే వాడిని. ఆయన అలా వచ్చి "ఏం చేస్తున్నారు" అని వెళ్ళేవాడు. ఆయన వెళ్ళగానే మళ్ళీ కబుర్లు. కరెంటు ఎప్పుడు పోద్దా అని చూసేవాళ్ళం, దీపాలు ముట్టించడానికి.

చిత్రలహరి పిచ్చి ఎక్కి, శుక్రవారం కోసం వారమంతా ఎదురు చూసే రోజుల్లో... వాళ్ళ మనవరాలి (విజయలక్ష్మి)ని మాత్రమే చిత్రలహరి చూడటానికి పంపేవాడు. మేమంతా నోటికాడ కూడు లాక్కున్న ఖైదీల్లా కిక్కురుమనకుండా లోలోపలే రగిలిపోయేవాళ్ళం. ఆ కోపంతో శీనిగాడు ఆయన చాల ముక్కుపొడి డబ్బాలు గోడవతల విసిరేశాడు, ఓ వెండి భరిణతో సహా. పంతులుగారు బాగా తలచుకున్నారు ఆ భరిణ ని. ఓ రోజు ఉదయం ఏదో ఐంది. మా బుజ్జి ని కొట్టాడు ఆయన.దీనికి కోపం వచ్చి ఆయన వెళ్ళగానే, ఆయన కళ్ళద్దాలు తీసి గోడవతల విసిరేసింది.నాకు ఒకటే వణుకు. ఆయన వచ్చి మమ్మల్ని ఏమి అడగకుండా వెతికి వెళ్ళిపోయాడు. విజయలక్ష్మి వచ్చి మా తాత అద్దాలు కనిపించాయా అంటే టామ్ అండ్ జెర్రీ లా అడ్డంగా తల ఊపాం. ట్యుషన్ అయిపోయి వెళ్ళబోయే ముందు అందరిని పిలిచి చెప్పాడు"నేను సాయంత్రం తపస్సు/ధ్యానం లో కూర్చుంటా, ఎవరు తీశారో తెల్సిపోద్ది." అని.మా బుజ్జి ఖంగారు పడింది. "రేయ్ అన్నాయ్ ఏం చేద్దాం?". "సాయంత్రం నేను వెతికి పెడతాలే" అని చెప్పా. ఇంటికి వెళ్లాం కానీ, వామ్మో తప్పస్సు లో ఆయనకి మా మొహాలు ఎలా కనిపిస్తాయో అని ఒకటే వణుకు.

అందరికన్నా ముందు వెళ్లి కూర్చున్నాం.కోపంలో బలంగా విసిరేసింది, అదెక్కడ పడిందో. సరే అని గోడ దూకా. అంతా వెతికితే తడికె మొగదాల కనపడింది. ప్రాణం లేచి వచ్చింది. ఏం పగలలేదు, గట్టిదే. అసలేం జరగనట్టు, తెచ్చి ఆ కర్రల మోపులో పెట్టి,విజయలక్ష్మికి  హింట్ ఇచ్చా. వచ్చి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. చిన్నప్పుడు కోపమే కానీ, ఇప్పుడు తలచుకుంటే బాధ గా ఉంటుంది. చాలా కష్టంగా గడిచేది వాళ్ళ ఇంట్లో. ఆయన ట్యూషన్ డబ్బులకోసం ఆ వయసులో అందరి ఇళ్ళకీ వెళ్ళే వారు. నేను 10వ తరగతి లో ఉండగా ఆయన చనిపోయాడు. ఆ ఇల్లు పాడుబడిపోయింది. ఇంటర్ లో ఉండగా బస్సు లో విజయలక్ష్మి కనిపించింది. చూసి నవ్వుకున్నాం.

ఈ మధ్యనే ఆ ఇల్లు పడగొట్టి ఎవరో కొత్త ఇల్లు కట్టుకున్నారు. మేము గుడికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి మీదుగానే వెళ్ళాలి. నా చూపు ఆ ప్రదేశాన్ని తడుముతూ ఉంటుంది. బోసి నోరుతో మా రావయ్యపంతులు గారు అక్కడే కూర్చుని ఉంటారు. నాలో ఏదో మూల, మన విలువ లకు మూలమైన దీపాన్ని వెలిగించింది మాత్రం ఆయనే......







వినోద్ ది మా పక్క ఊరే.నాకన్నా రెండేళ్ళు జూనియర్. మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. వేరే ప్రాజెక్ట్. కాఫీ మెషిన్ దగ్గర కాఫెటేరియా లో కనబడితే కబుర్లు చెప్పుకుంటాం. "ఏంటి భయ్యా, వీళ్ళ గోల. తోముతున్నారు మరీ. ఫ్లాట్ కొన్నావటగా . పార్టీ  ఎప్పుడు?". నేను నవ్వాను."నవ్వితే కుదరదు, పెళ్లి రోజు కూడా ఇలానే తప్పించుకున్నావ్. నిన్ను కాదులే వదినని అడుగుతా" అన్నాడు. "ఓ రోజు చూద్దాం. ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వగానే". "నువ్వు మర్చిపోయినా  నేను మర్చిపోను. ఉంటా భయ్యా, మళ్ళీ మా లీడ్ వెతుక్కుంటా వస్తాడు.బై" అని వెళ్ళిపోయాడు. కొత్త ఇల్లు, నిజమే. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను?  కాఫీ మెషిన్ లో పెట్టిన కప్ నిండింది. కప్ తీసుకొని, నా కేబిన్ వైపు కదిలా. చుట్టూ చూస్తే నాలా చాలా మంది, మెషిన్ కి అతుక్కుపోయి నిర్జీవమైన యంత్రాల్లా పని చేస్తున్నారు. ఓ నవ్వు నవ్వుకొని, నా కేబిన్ లోకి వెళ్లాను. టీం మీటింగ్ ఉంది. ఇక నా పనిలో దిగిపోయా.

సాయత్రం 6 కి బయల్దేరాల్సిన నేను 8.30 కి బయలుదేరా. ఇంటికి వచ్చేసరికి 10 ఐంది. మధు వచ్చేసరికి 12 అవుతుంది. తనది UK షిఫ్ట్. ఇంట్లో అంతా శుభ్రంగా, అన్నీ సర్ది పెట్టి ఉన్నాయి. ఎంత ఓపికా, మనసు నవ్వింది. అలానే కూలబడ్డాను.మగత గా ఉంది.అమ్మ, అమ్మ కి కాల్ చేయాలి. రింగ్ చేసాను, ఎత్తలేదు. నిద్రపోయి ఉంటారేమో. మళ్ళీ చేయలేదు. కాసేపటికి అమ్మ నుంచి ఫోన్ "ఏ నాన్నా లేట్ అయిందా, తిన్నావా. అమ్మాయి ఇంకా రాలేదా?". "మా, నేను బావున్నాను. మధు ఇంకా రాలేదు. షిఫ్ట్ మారింది కదా. లేట్ అవుద్ది. నాన్న ఏం చేస్తున్నాడు? నీకు ఎలా ఉంది?". "మేం బావున్నాం రా. ఏం ఆలోచనలు పెట్టుకోకు.ఊరికి రావడానికి వీలౌతుందా? చూడాలని ఉంది"."నాకూ రావాలనే ఉంది మా. తనకి కూడా లీవ్ దొరకాలి." "సరే రా. వీలు చూసుకొని వచ్చి వెళ్ళండి." "అలాగే అమ్మ". మనసు నిండా ఏవో మాటలు, గొంతు నొక్కేసినట్టుంది. ఫోన్ ఇంకా డిస్కనెక్ట్ కాలేదు."మా","వంశీ, ఆలస్యమైంది రా. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉండనా"."అలాగేనమ్మా". డిస్కనెక్ట్ అయింది. మనసంతా వెలితిగా ఐంది. ఎన్ని కబుర్లు చెప్పే వాడిని అమ్మకి. రోజు ఎదో ఎడ తెగని మాటలు.వంట మొదలు పెట్టి తినిందాకా అలా సాగుతూనే ఉండేవి. నాన్న  ఉడుక్కునే వాడు, "ఏరా? ఏం మాట్లాడుకుంటారు మీరు." అని. "నీకెందుకు అన్నీ" అని మా అమ్మ ఓ విసురు విసిరేది. నాన్న పెదాల మీద చిరునవ్వు.

మా ఇల్లు.పెద్ద పెంకుటిల్లు, ముందో పందిరి, వెనకాల కూరగాయలు పండించుకోడానికి అనువైన స్థలం. ఇంటిముందు చాలా ఖాళీ స్థలం.రక రకాల మొక్కలు. రెండు కొబ్బరి చెట్లు. నీళ్ళ తొట్టి. ఆ తలపే హాయిగా ఉంది. ఎలా జరిగింది నా చిన్నతనం? నేను చెల్లి, అమ్మా నాన్న. మా ఇల్లు. అమ్మ, నాన్న ఎంత గుట్టుగా నెట్టుకొచ్చారు కాపురాన్ని? ఫలానా శ్రీనివాసరావు, ప్రభావతమ్మ అంటే ఎంత మంచి పేరు. మనసు తెలికపడటం మొదలు పెట్టింది.

మా ఊరు, మేము ఆడుకున్న చోటు, మా పొలం, ఎద్దులు, అమ్మ వాళ్ళ ఊరు. నాన్న గుర్తొచ్చాడు. ఎంత బావుంటాడు నాన్న? ఎంత మంచి కబుర్లు చెప్తాడు? తీరిక దొరికితే ఇద్దరం ఎంత బాగా మాట్లాడుకుంటాం. ఆయన ఆడిన ఆటలు, చేసిన అల్లరి, పడ్డ ఇబ్బందులు, ప్రకృతి గురించి... నాన్నలా, నాన్న అలా ఉండటం నాకే దక్కిన అదృష్టం ఏమో. ఆయనకి వచ్చిన ప్రతి పని నాకు నేర్పే వారు. అమ్మ.. నేనే అమ్మ ప్రపంచం. నాకు ఊహ తెల్సినప్పటి నుంచి అమ్మ ఎక్కడకి వెళ్ళినా నేను తోడు వెళ్ళే వాడిని. అలా అమ్మతో నడిచేప్పుడు నాకు నేనే ఓ రక్షకుడిలా ఫీల్ అయ్యవాడిని. నాన్న తిట్టే వాడు, వీడిని వంట గదిలో కూడా నీకు తోడుగా ఉంచుకో, అమ్మాయిలా అవుతాడు అని. నీకు కుళ్ళు అనేది అమ్మ.ఎక్కడ మంచి చొక్కా కనపడ్డా ఇది మా వాడికి ఎంత బావుంటుందో అని మురిసిపోయేది, ఎలా అయినా దాన్ని తెచ్చేది. మంచి అమ్మాయి కనిపిస్తే ఇలాటి పిల్లని తీసుకురావాలి వాడికి అని ఆశపడేది. ఎన్ని చేసినా తిరిగి అడిగేది చిన్న కోరికలే. అమ్మకి నాతో పాటు బైక్ మీద రావడం చాల ఇష్టం, నా కబుర్లు. నా కొడుకు అని చెప్పడం లో ఎంతో ఆనందం.

ప్రపంచాలు ఏలకపోయినా, వాళ్ళ కి ఏ నాడు మాట తీసుకురాలేదు. ఇద్దరం ఉన్నంతలో జాగ్రత్తగానే చదివాం. స్థిరపడ్డాం. ఏరి కోరి మధు ని కోడలు గా తెచ్చుకుంది. మధు కూడా మాలాటి కుటుంబం వచ్చిన అమ్మాయే. తను కూడా ఓ MNC లో జాబు చేస్తుంది. ఉద్యోగం రాగానే పెళ్లి ఏంటి, సెటిల్ కాకుండా అని ఎవరైనా అంటే. సెటిల్ అవడం అంటే వయసైపోయాక ఓ పది లక్షలు చేతిలో పెట్టుకొని  పెళ్లి చేసుకోవడమా? ఎ వయసులో ముచ్చట ఆ వయసులోనే అన్న అమ్మా నాన్నలని చూసి "మా అమ్మ నాన్నలు కదా " అని మురిసిపోయా. నాకు జాబు వచ్చిన రెండేళ్ళకి పెళ్లైంది.పెళ్ళైన ఓ సంవత్సరం తరువాత ఇద్దరం కలసి ఓ ఫ్లాట్ కొన్నాం. చాలా సంతోష పడ్డాను. మా నాన్న లా నేను కూడా ఓ ఇల్లు కొనాలని నా కల. అప్పటి వాళ్ళలా ఇప్పుడు ఇల్లు కొనలేకపోయినా ఓ ఫ్లాట్ కొనగాలిగాను.

జీవితం అంతా సాఫీగానే సాగిపోతున్నా, ఎదో తెలియని వెలితి. మనుషులు ఏరి? ఎదో అబధ్రతా భావం, కొరత. కాలమనే ప్రవాహం లో పడి కొట్టుకుపోతున్నట్టు,  మనసుకి స్పందన కరువైనట్టు... గుండె నిండా దిగులు గూడు కట్టుకొని మొహమ్మీద చిరునవ్వుని అతికించుకు తిరుగుతున్నట్టు.. దేనికోసమీ పరుగు? ఒక నెల పాటు స్థిమితం గా ఉండగలమా? ఎదో హడావిడి? కమ్యూనికేషన్ పెరిగే కొద్ది మనుషులు, మనసుల మధ్య దూరం పెరిగిపోతుంది.

నేను పెరిగిన వాతావరణం నా ఆలోచనలకి కారణమా? స్వచ్చమైన గాలి లేదు, నీరు లేదు,పలకరింపు లేదు.ఇప్పుడు కష్టపడుతున్నాం, కానీ శారీరక కష్టం లేదు. విపరీతమైన పని వత్తిడి. ఆలోచనలు. ఏం కావాలి బ్రతకడానికి? ఎందుకీ పాకులాట? నెలంతా పరిగెత్తి సంపాదించింది నెలాఖరుకి ఖర్చు అవుతుంది. బురద తో నింపిన చీకటి గదిలో బంధించినట్టు ఊపిరి సలపడం లేదు.

నా చిన్నప్పుడు చాల కష్టపడ్డాం అయినా ఇష్టం గా ఉండేది. అమ్మ నాన్న పొలం వెళ్తే నేను గొడ్లకాడ పేడకళ్ళు ఎత్తి, శుభ్రం చేసి, గొడ్లను కడిగి, నీళ్ళు పెట్టి, మేత వేసి ఇంటికి వచ్చే సరికి ఇందు వంట చేసేది. చిన్న పిల్ల గా  ఉన్నపటి నుంచే పని చేసింది ఇందు. అంత అయ్యాక అమ్మ వచ్చి నా పిల్లలూ బంగారం అంటే తెగ మురిసి పోయేవాళ్ళం. మా నాన్న మాకోసం ఎదోటి తెచ్చే వాడు. జామకాయలో, తేగలో, ఈతకాయలు, పండు దోసకాయలు ఏదోటి. అదే మాకు సంతోషం. చీకటి వేళ ఆరు బయట వెన్నెల్లో నులక మంచాల మీద పడుకొని చుక్కలు లెక్కపెట్టిన రోజులు. తలచుకుంటే మనసు తేలిపోతుంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆదమరచి నిద్రపోయేరోజు ఎప్పుడు వస్తుంది?

నిజమే ఈ వయసులో కాకుండా ఇంకెప్పుడు కష్టపడతాం? కానీ ఆ ప్రయత్నం లో  నన్ను నేను కోల్పోకూడదు, కోల్పోతున్న భావన. నాలో ఉండే పసితనం చచ్చిపోతున్నట్టు ఉంది. మాటలే మరచిపోతున్నా.ఉదయం ఆఫీస్ కి  వెళ్ళడం,పని, రావడం, నిద్ర.వారంతం లో ఏదైనా పని ఉంటె చేసుకోవడం. ఒంట్లో ఎదో నిస్సత్తువ. నేనేనా చిన్నప్పుడు అన్ని పనులు చేసింది? శరీరం లో కొన్ని భాగాలు పని చెయ్యడం మరచిపోతున్న భావన....దేనికోసమో ఎదురుచూపు. నేను పెరిగిన వాతావరణం నన్ను రమ్మని పిలుస్తుంది. నిజమే బ్రతకాలంటే ఎలా అయినా బ్రతకచ్చు. కాకపోతే అది ఎలా అని నిర్ణయించుకోవాల్సింది నేనే. నాకు ఊర్లో బ్రతకాలని ఇష్టం. అమ్మా నాన్న తో,నేను,మధు, నా పిల్లలూ, అత్త మావయ్య, పిన్ని బాబాయ్, తమ్ముళ్ళు..... ఇవన్నీ రేపు నా పిల్లలకి ఇవ్వాలి.

ఓ రకంగా నేను అదృష్టవంతుడిని. మా అమ్మానాన్న అంటారు "అంతలా జీవితాన్ని వదిలి పాకులాడాల్సిన పని లేదు, ఉన్న దానిలో సంతోషంగా బ్రతకచ్చు" అని.ఇప్పుడు  చాల మందిని  చూస్తున్నా, పిల్లలని కన్నది సంపాదించడానికే అన్నట్టు, "ఏం చేసావ్ మాకు" అని అడుగుతున్నారు. ఇంకా ఇబ్బంది పడే అంశం ఎంటటే, ఆడపిల్లల్ని కూడా ఇలానే అడుగుతున్నారు.
 ఒకటి నిజం, మా అమ్మానాన్న నాకు ఇచ్చిన భరోసా రేపు నా పిల్లలకి కూడా ఇవ్వాలి....

తలుపు చప్పుడైంది, మధు. టైం చూస్తే 12.30."ఏంటి ఇంకా తినలేదా?", "లేదు మధు, ఏంటి ఇంత లేట్?". "కాబ్, లేట్ ఐంది". "ఫ్రెష్ అయి రా, తిందాం "....

మర్నాడు, అమ్మ ఫోన్ నా దగ్గరకి వస్తున్నా అని. ఏదో సంతోషం, ఇంకా ఎదో దిగులు, కొంత ఎదురుచూపు......




Without emotion, man would be nothing
but a biological computer. Love, joy,
sorrow, fear, apprehension, anger,
satisfaction, and discontent provide
the meaning of human existence.
Arnold M. Ludwig---1980



మొదటి భాగం http://aakaasavaani.blogspot.in/

"నీకేమ్మా? కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారుగా. నాలుగు చేతుల సంపాదన" అని పొరుగింటి ఆమె అంటుంటే, మనసులో కలుక్కు మంది ప్రభావతమ్మ కి. నిజమే సంపాదనకేం లోటు లేదు. మంచి ఇల్లు, ఓ పదెకరాల పొలం. మంచి ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు,అన్నిట్లో తోడూ ఉండే భర్త. ఏం కావాలి ఇక? కానీ సంతోషమే లేదు. ఒక్కొటిగా గుర్తుకు రావడం మొదలు పెట్టాయి అన్నీ.

తనను బావ కి ఇచ్చి పెళ్లి చేసారు. పెద్ద కలిగిన కుటుంబాలు కాకపోయినా, తానంటే బావ కి ఇష్టం.ఇద్దరు పిల్లలు(వంశీ, ఇందు) పుట్టారు. ఉన్న పొలం లోనే పనులు చేసుకుంటూ రోజులు గడచిపోతున్నప్పుడు, వేరు పోవాల్సివచ్చింది. ఏమి తోడూ రాలేదు. ఆయన, నేను, పిల్లలూ. ఓ పాత పెంకుటిల్లు, అందులో మాతో పాటు ఇంకా రెండు కుటుంబాలు.
పందికొక్కులు తొవ్విన బోరియలతో నిండిన ఇల్లు. చేతికి వచ్చిన  పోలంతోనే మళ్ళీ జీవితం మొదలైంది. నిరాశపడ్డా పిల్లల్ని చూసుకుంటే కడుపు  నిండేది. ఇద్దరం కలసి కష్టపడ్డాం. ముందు ఇల్లు కొనుక్కున్నాం. ఓ ఏడాది కొంచెం డబ్బులు చూశాం. దానితో పొలం కొన్నాం. పిల్లలు ఎదుగుతున్నారు. మా ఇద్దరి మనసులో ఒకటే ఆలోచన "పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి". రేయింబవళ్ళు పని. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. పిల్లలు కూడా బాగా చదువుకునే వాళ్ళు. కొన్ని ఒడి దుడుకులు ఎదురైనా ఓ స్థాయికి వచ్చాం. ముందు ఇందుకి పెళ్లి చేసాం. మా తాహతుకు తగ్గ సంబంధం.

ఇక అబ్బాయి కి చదువు ఐపోయి, ఉద్యోగం వచ్చింది. వాడికి మంచి పిల్లని చూడాలని మా ఉద్దేశ్యం. మంచి సంబంధం దొరికింది. అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది. ఓ మంచి ముహూర్తాన, ఘనంగా పెళ్లి జరిగింది.

నాకు వంశీ అంటే చాల ఇష్టం. ఒక్క రోజు వాడితో మాట్లాడకపోయినా ఎదో వెలితిగా ఉంటుంది. పెళ్ళికి ముందు రోజు ఫోన్ లో మాట్లాడే వాడు. కానీ పెళ్ళయ్యాక వాడి దగ్గర నుంచి ఫోన్ రావడం తగ్గిపోయింది. ఇప్పుడు పొలం పనులు లేవు. ఇంట్లో కూర్చోవడమే. మా వారేమో వ్యాపారం చూసుకునే వారు. ఎంత సేపు టీవీ చూడటం, నిద్ర పోవడం, వంట చేయడం ఇదే జీవితం ఐపోయింది. ఎదో ఖాళీ ఏర్పడింది. ఓ నిర్లిప్తత, స్తబ్దత. చూస్తుండగానే, మా ఊరిలో నా లాటి వాళ్ళు పెరగిపోయారు. అన్నీ డుప్లెక్స్ ఇళ్ళు.అందులో బిక్కు బిక్కు మంటూ ఇద్దరు ముసలివాళ్ళు. పల్లెటూరు మూగబోయింది. పెద్ద పండగ కూడా చిన్నబోయింది. పిల్లలే కనపడ్డం మానేసారు. స్మశానం లా అనిపిస్తుంది.

నాకు ఉన్న చిన్న ఆశ వంశీ ఫోన్. వాడి కల్మషం లేని మాటలు, మనసులో ఎంత బాధ ఉన్న ఇలా తీసేస్తాయి. నవ్విస్తాడు. కబుర్లు చెప్తాడు. వాడితో మాట్లాడిన ఆ పది నిముషాల్లోనే నా రోజు చూసుకునే దాన్ని. కానీ వాడీ మధ్య కాల్ చేయడం తగ్గించాడు. నా మనసులో దిగులు పెరుకుపోసాగింది. మా వారు సర్ది చెప్పేవారు. వంశీ కూడా ఫోన్ చేసి "సారీ అమ్మా, పనుల ఒత్తిడి. ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజి లో ఉంది. ప్రెజర్." ఎన్ని చెప్పినా వాడి మాటల్లో మెరుపు పోయింది. ఏదో దిగులు. అయ్యో నా బిడ్డ ఏమైందో వాడికి అని నా మనసులో బాధ. ఓ రోజు మా వారిని అడిగా, వాడి దగ్గరకి వెళ్దాం అని.... సరే అన్నారు. రేపే మా ప్రయాణం..... సంతోషం గా ఉంది.....

తరువాయి భాగం తరువాత .....
ఒకరికోసం ఒకరికి భగవంతుడి ఎంపిక.. ఒంటరి జీవితంలోకి వచ్చే తోడు.. కలల ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి జీవిత కాలపు భాగస్వామి.

కష్టసుఖాల మజిలీలో తోడు నీడా...
ఇద్దరుగా మొదలై, ఒకరుగా కలిసి జీవించే అద్భుతమైన మేళవింపే ఈ భార్యాభర్తలు...
ఆ నాటి వరకు కొత్తవారితో ఒక హద్దు ఏర్పరరుచుకు బ్రతికే మనిషికి ఓ అపరిచితుడితో జీవితకాలపు మజిలి. హద్దుల్లేని ఊసులు....
రెండు కుటుంబాల సంప్రదాయాలు, కట్టుబాట్లు కలిపి ఓ కుటుంబాన్ని, ఓ ప్రపంచాన్ని నిర్మించే సారధులు....
సంసార జీవితం మొదలయ్యాక కళ్ళతోనే మాటలడుకోగల మనసులు...
తాము నిర్మించుకున్న ప్రపంచంలో విచ్చలవిడితనానికి సాక్ష్యులు.....

నా కోసం ఎక్కడో ఎవరో పుట్టే ఉంటారని ఆశపడే మనసుకి, తనలో దాచుకోగల ఓ మనసు దొరికితే....



ఒకానొక కాలం లో, కనపడ్డ ప్రతి నోట్ బుక్ మీద నా డైరీ అని రాసి అందులో ఏది తోస్తే అది రాసే టైం లో.... ట్రియ్యుం ట్రియ్యుం ట్రియ్యుం ట్రియ్యుం  ఫ్లాష్ బ్యాక్ లోకి... అది 2001 సంవత్సరం.... హైదరాబాద్ లో అప్పుడే రూమ్ లో చేరిన కొత్తల్లో.. అంతకు ముందు 6 నెలల పాటు హాస్టల్ లో ఉండి, అప్పుడే రూమ్ లో చేరాం. 

నేను రాజు గాడు, సతీష్ అన్నఉండే వాళ్ళం. అప్పటికే నా డైరీ రాయడం మొదలై ఆరు నెలలు దాటింది. నా డైరీ అనబడే నోట్ బుక్ ని ఎక్కడా దాచి పెట్టను. అలా పుస్తకాల మధ్యలోనే పడి ఉంటుంది. 

 ఓ శుభముహార్తాన రాజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. తరువాతి రోజు ఉదయం నేను బాత్ రూమ్ కి వెళ్లి వచ్చేసరికి, వాళ్ళ నాన్న నా స్టడీ చైర్ లో కూర్చుని ఉన్నారు. వాళ్ళ అమ్మ కింద కూర్చుని ఉన్నారు. రాజు గాడేమో వాళ్ళ నాన్న ముందు చేతులు కట్టుకొని నిలుచుని ఉన్నాడు. నా వైపు చంపేసేటట్టు చూస్తునాడు. తేడా గా ఉంది ఏదో. ఓ సారి వాళ్ళ నాన్న చేతిలో చూశా, అక్కడ క్షణం నిలబడలా నా కాళ్ళు. ఆయన చేతిలో నా డైరీ అనబడే నోట్ బుక్.

 అప్పటికే చాలా పేజిలు చదివేసినట్టున్నారు."వామ్మో నరేషుగా, ఇంకా చూస్తావేంది, పరిగెత్తు"...అని ఇన్నర్ వాయిస్. జంప్, వెళ్లి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చున్నా. అక్కడే టిఫిన్. ఇది జరిగింది పొద్దున్న 6.30 కి. మా రాజు గాడు 9 దాటాక వచ్చాడు, ఏడుపు మొహం తో.



నేను నెమ్మదిగా అడిగా "ఏమైంది మామా". 
గయ్ మని లేచాడు. "రేయ్, అది డైరీ నా? ఎవడైనా డైరీ అంటే వాడి గురించి రాసుకుంటాడు. నువ్వేంట్రా, నా గురించి, మా అన్నాయ్ గురించి రాశావ్. మా నాన్న అమ్మ ఇద్దరు కల్సి బండ బూతులు తిట్టారు.మళ్ళీ నువ్వేమో మంచోడివా?" అని కాసేపు వాయించేసాడు.




అసలు సారంశం ఏంటయ్యా అంటే.

నా డైరీ లో ఏం రాసాను అంటే.. వినరా భారత వీర కుమారా విషయము చెబుతానూ... తందాన తాన. తరికిట ఝంతరి త.

రాజు గాడు, వాళ్ళన్న ఏమేం సినమాలు చూశారు. అందులో సెకండ్ షో లు ఎన్ని? వాళ్ళు పిలిచినా కూడా నేను వెళ్ళకుండా ఎలా ఉన్నాను? అప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి? 

రాజు గాడు 1800 పెట్టి టేప్ రికార్డర్ కొని ఇంట్లో 700 అని ఎలా చెప్పాడు? లాటి 

వాళ్ళ అన్న రోజు కి ఎన్ని సిగరెట్ పెట్టెలు కాల్చేవాడు...

రాజు గాడికి పక్కింట్లో ఉన్నమ్మాయి ఎలా బీట్ కొట్టేది... వీడు కిటికీ పట్టుకొని వేళ్ళాడుతూ ఆ అమ్మాయికి ఎలా రెస్పాన్స్ ఇచ్చేవాడు....

100 మిగల్చడానికి నేను దిలుసుఖనగర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కి సైకిల్ మీద ఎలా  వెళ్లాను లాటి అద్భుతమైన విషయాలు పొందు పరిచాను....




అది తెల్సి వాళ్ళ నాన్న వాడిని నానా బూతులు అంట.


నాకు ఏం రాయాలో తెలీక ఏదోటి రాసుకుంటూ పోయా, అది మా వాడి నెత్తి మీదకి వచ్చింది. అప్పటి నుంచి డైరీ అంటే మా రాజు గాడు గాల్లోకి ఎగిరే వాడు....

ఆ తరువాత రాయడం మానలేదు గానీ, దాచడం నేర్చుకున్నా... తలచుకుంటే ఇప్పటికీ పొట్ట పగిలిపోతుంది...