ఎక్కడ మొదలు పెట్టాలో తెలీడం లేదు కానీ, మన తెలుగు(తెలుగు అని ఎందుకు అన్నాను అంటే నాకు పర భాషా చిత్రాల మీద పట్టు తక్కువ) సినిమాలలో చమక్కులు ఈ పిట్ట మట్టి బుర్రకి అర్ధం కావు... 

ఈ మధ్య ఈ టీవీ లో వస్తున్న రాఘవెందర్రావు స్వర్ణోత్సవం లో ప్రోగ్రాం కి వచ్చిన పెద్ద మనుషులంతా సార్ అసలా ఆలోచన ఎట్టా వచ్చింది సార్, మీరు తోపు సర్, తురుము సర్ అంటా ఉంటె. అదేదో గొప్ప టెక్నిక్ కాబోలు అనుకున్నా.తీరా జూస్తే ఆయన పూలు, పళ్ళ తోనే కాకుండా వివిధ వస్తువులతో కూడా పాటలు ఎలా తీసాడో చెప్పి ఆనందంతో గుండెలు బాదుకుంటుంటే నా కళ్ళు చెమర్చాయి... పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ ని చూడ్డానికి మెట్ల మీద నుంచి కమెడియన్స్ అంత ఎలా దొర్లుకుంటూ వచ్చారో, అసలా సీన్ తీయడానికి ఆయన  పడ్డ తపన, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి టీవీ ముందు సాష్టాంగ పడ్డాను... 

నా బుర్ర కి అర్ధం కాని ఎన్నో గొప్ప గొప్ప చిక్కు ముడులు మన తెలుగు సినిమాల్లో కనిపిస్తాయి... 
నిన్ననే వచ్చిన పాడి పంటలు అనే సినిమాలో అంజలి దేవి కి కృష్ణ, చంద్రమోహన్ ఇద్దరు కొడుకులు.. ఆస్తులు తీసుకొని చంద్రమోహన్ రిచ్ అయి అమ్మని, అన్నని వదిలి చంద్రమోహన్ భార్య తో కలిసి తాగి దొర్లుతుంటే... ఓ ప్రమాదంలో ప్రాణాల మీదకి తెచ్చుకున్న అంజలీ దేవి  కృష్ణ ని పంపి కొడుకుని కడ సారి చూడాలి తీసుకు రమ్మంటుంది. కృష్ణ వెళ్లి కొన్ని బరువైన డైలాగులు చెప్పి రమ్మంటే వాడు రాడు. తిరిగొచ్చి "హమ్మా, రాలేదమ్మా, నేను దురదృష్ట వంతుడినమ్మా" అని ఇంకో నాలుగు డైలాగులు చెప్తాడు. అంజలీ దేవి ఇంకో రెండు డైలాగులు చెప్పి చచ్చిపోతుంది... ఇదంతా జరిగేలోగ హాస్పిటల్ కి తీసుకెళ్ళచ్చు కదా అనిపిస్తుంది... పిట్ట మెదడు... 

పాత సినిమాల్లో హీరోయిన్స్ నిండుగా ఉంటారు(బలంగా ఉంటారు(ఎవరి మనోభావాలు దెబ్బతిన కూడదని కోరుకుంటున్నా))... రేప్ సీన్స్ వస్తే ఊరంతా తిరిగి, డోర్ లు అన్ని తెరచుకొని బెడ్ రూమ్ కి వెళ్లి పడతారు.. సదరు రేపిస్ట్ వాళ్ళకంటే ఓ 10 కేజీ లు తక్కువ ఉండి , తాగి ఊగుతూ వీళ్ళు ఎలాగు బెడ్ రూమ్ కి వెళ్తారు కదా అన్నట్టు తాపీగా బెడ్ రూం కి వచ్చి రేప్ చేస్తాడు(రేప్ అనే పదాన్ని రికార్డ్స్ నుంచి తొలిగిస్తున్నాం అధ్యక్షా)... అదేదోవాళ్ళే వచ్చేప్పుడు తలుపులేసి రావచ్చు కదా.. సరే వాడో అర్భక ప్రాణి, గట్టిగా వకటేస్తే పడిపోతాడు.. పిట్ట మెదడు 

ఇపుడు ఫైటింగ్ కి వస్తే, వాడు ఒక్కడే ఉంటాడు, అదే వీరో. విలనీస్ ఓ 20 మంది ఉంటారు. అందరి కాడ తుపాకులు ఉంటాయి. అయన్ని కట్ట గట్టి ఆడ బెట్టి, ఒక్కొరుగా పోయి చెంప దెబ్బలు తిని సచ్చిపోతారు. చెంప దెబ్బకే గాల్లోకి ఎగిరి, రెండు పల్టీలు కొట్టి రగతం కక్కుకోని చస్తారు.ఇంకో చోట హీరో చేతిలో ఉన్న కర్రని కొట్టడానికి ట్రై చేస్తుంటారు.. బట్ వై వై వై అని పిట్ట మెదడు అరుస్తా ఉంటది. 

ఇక సొంత మేనమావ మోసానికి బలైన మేనల్లుడు వాళ్ళమ్మతో ఫారిన్ వచ్చినా కూడా ఆ మామ కూతురినే ప్రేమించి మారువేశాలేసుకొని (జస్ట్ ఓ మచ్చ) మామ ఆట కట్టిస్తాడు.. మళ్ళీ పిట్ట మెదడు. 

ఇక కవలల సినిమాల ఫార్ములా మార్చనే మార్చరు. ఒకడు అమాయకుడు, ఒకడు మాయగాడు. ప్లేసెస్ చేంజ్. ఎంటర్టైన్మెంట్, క్లైమాక్స్ ఫైట్.. మళ్ళీ పిట్ట మెదడు... 

ఒక రివెంజ్ తీసుకో దలచినఅమ్మాయి, ఎదురుగా అటు తిరిగి నిలుచున్నా ప్రతినాయకుడు, చేతిలో కత్తి.. ఒకటే వేటు తల తెగిపోడానికి... అలా ఎలా కుదురుద్ది... విలన్ ఓ అరా కిలోమీటర్ దూరం లో ఉండగా, దొంగల కోసం పోలీసులు సైరన్ వేసుకోచ్చినట్టు.. రేయ్ య్ య్ య్ య్ య్ య్ ... అని స్లో మోషన్ లో పరిగెత్తుకు వచ్చి వాడి చేతిలో సచ్చిపోతుంది... మళ్ళీ పిట్ట మెదడు... 

మొన్నెప్పుడో గిరి బాబు హీరో గా ఓ సినిమా దూరదర్శన్ లో వేసాడు... చూస్తున్నా చూస్తున్నా... దారినపోయే ముళ్ళకంపని వాటేసుకుంటారు. గిరిబాబు ఏదో నిధి కోసం వెళ్లి వాళ్ళ స్నేహితులతో పాటు నరమాంస భక్షకులకు చిక్కి వీరోచితంగా పోరాడి చచ్చిపోతాడు. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ తమ్ముడు మదాల రంగారావు అండ్ కో నిధి కోసం వెతికి ఓ పెద్ద నాగ విగ్రహంలో దాని జాడ కనుక్కొని , ఆ బొమ్మ పగలకొట్టి(పక్కన ఒకడు చెప్తూనే ఉంటాడు వద్దు సార్ , దేవుడు అని, పక్కన మెరుపులు.ఉరుములు) ఆ బొమ్మని రాయి అని తిట్టి ఆ వజ్రాలు తీసుకు పోతారు. పోతు పోతు అడవిలో దారి తప్పి ఓ నాగ దేవత గుడికి చేరుకుంటారు. ఆ రోజు నాగ దేవత కనిపిస్తుందని చెప్తేఉండి దాన్ని చూసి వెళ్దామని ఆగుతారు. చూసాక దాన్ని చంపాలనుకుంటారు. (నా పిట్ట మెదడు అరుస్తూ ఉంది, ఎందుకొచ్చిన గోల రా అని) అందరు చచ్చిపోతారు... నాకర్ధం కాలా అంత ఖర్చు పెట్టి ఎం తీద్దామనుకున్నారు  అని. 
ఇక పోలీస్ కథల కొస్తే నా సామీ రంగా పూనకం వచ్చేస్తుంది... పెళ్ళాం పిల్లలు చచిపోయినా సరే చట్టం రా , న్యాయం రా , ధర్మం రా, నాలుగో సింహం రా ... (ఈ మధ్య పోలీస్ పోలీస్ అని సినిమా చూసా బావుంది) 

ఇంకా నయం అప్పటి సినిమాల్లో ఏదో ఒక కథ ఉండేది, ఇప్పుడు హీరో ఉంటాడు. హీరో అని ఎలా తెలుసుద్ది అంటే పక్కన ఓ హీరోయిన్, మనోడు కొడితే విరిగిపోయే సుమోలు, పడిపోయే జనాలు... మద్ద్య మధ్యలో పాటలు... ఓ కమెడియన్ ... ఐపోయింది... 

ఎం తోచక ఇది రాసా... మనోభావాలు దెబ్బ తింటే నేను ఇక్కడ లేనోచ్.... 



ఎండాకాలం లో ఎండల కన్నా అపుడోచ్చే సెలవలు, ఆడే ఆటలు, తాటి ముంజలు, చల్లటి సాయంత్రాలు, ముఖ్యంగా మామిడి పళ్ళు, చింత కాయలు... 
చింతకాయల గురించి చెప్పాలి... 
మా ఇంటి ముందు బడి దగ్గర (ఇవి మొన్ననే కొట్టేసారు) ఓ ఐదు చింత చెట్లు. వీటి మీద ఓ సీజన్లో  రకరకాల పక్షులు వచ్చి వాలేవి. అక్కడే గూడు కట్టుకొని,పిల్లలు పెట్టేవి. ఎంత సందడి ఉండేదంటే. వాటితో పోటి పడి నిద్ర లేచినా అవి ఆ పాటికే లేచి తిండి కోసం వెళ్లిపోయేవి. చీకటి వేళకి గుంపులు గుంపులుగా బారులు తీరి ఆ ఎర్రటి ఆకాశంలో ఎగురుతూ ఉంటే  ఎంత అందంగా ఉండేదో.. అవి వరుస భలే మారేవి. 


ఇంకో ఐదు చింత చెట్లు మా కొట్టానికి పోయే దారిలో ఉండేవి.ఆ ఐదు చెట్లలో ఓకే చిన్న చెట్టు. అదొక్కటే ఎక్కగలిగే వాళ్ళం. పక్కనే నేల బావి, పొగాకు బ్యారన్లు. అదే మా ఆటస్థలం. 
ఎండాకాలం మొదలు కాకుండానే చింత చిగురు వచ్చేది. అదో రుచి.ఎక్కువ తింటే గొంతు పట్టేసేది.  మేము చెట్టు ఎక్కితే మేము తినేదానికన్నా ఊళ్ళో వాళ్ళకి కోసివ్వడం ఎక్కువ. ఆ చింత చిగురుని మేకల్లా మేసే వాళ్ళం. కొన్ని రోజులకి ఓపెన్ కాయలు వచ్చేవి, అంటే చిన్న చింతకాయలు. అవి భలే రుచిగా ఉండేవి. అవి ఇంకొచెం పెరిగినా తియ్యగానే ఉండేవి. 
కొన్ని రోజులకి పక్వానికి వచ్చేవి. వీటికి గిరాకీ ఎక్కువ, పచ్చళ్ళు పెట్టుకోవాలి కదా. మధ్యాన్నం దాకా గాడిదల్లా ఎండలో పడి ఆడి ఆకలేస్తే ఇంటికి వెళ్ళకుండా చింతకాయలు కోసి వాటిని రోట్లో వేసి ఉప్పేసి, కారం వేసి తొక్కుతూ ఉంటె నోట్లోంచి లాలాజలం కాలవలు కట్టి కారిపోతుండేది. 
చింతకాయలు ఇంకొంచెం పెరిగాక వాటిలో బల్లేలు (అంటే బాగా పెద్దవి) కొట్టుకొని (కోసే ఛాన్స్ ఎక్కడుంది, పూత దగ్గరనుంచి ఓపెన్ కాయలు ఇలా అందినవన్నీ కోసేసాం కదా), కొట్టడం అంటే అదో ఆర్టు. 
స్పెషలిస్ట్ లు ఉండే వాళ్ళు. రాళ్ళతో కొట్టేవాళ్ళు, కర్రలు విసిరే వాళ్ళు. అప్పుడపుడు అవి నెత్తిన పడి రక్త తర్పణాలు, అవి ఇంట్లో తెలీకుండా మేం మేనేజ్ చేయడాలు. కొట్టాక వాటిని పొగాకు బారన్లకు ఉండే పోయిలమీద కాల్చే వాళ్ళం. అవి బాగా ఉడికి బుస బుస మని పొంగాక అలా కాలే కాలే వాటిని తిండం ఓ రుచి. 
ఇది అయ్యాక దోర కాయలు... దొరకాయలు పైన ఉండే తొక్క అలా పట్టుకోగానే ఊడి  వస్తుంది. అవి అపుడే పులుపు నుంచి తీపికి మారుతాయి. ఇవి చాల బావుంటాయి. 
ఇక ఇప్పుడు క్లైమాక్స్. గుల్ల కాయలు. ఇవి ఉంటాయి యి యి యి యి ... ఇలా పట్టుకోగానే పలపల  లాడిపోతూ, లోపల బాగా మగ్గి,తియ్యగా.. తిని తీరాల్సిందే తప్ప చెప్పనలవి కాదు. 
ఇక కొసరు. లాలిపోప్ లు లేని రోజుల్లో. ఓ పుల్లకి చింతపండు గుచ్చి దాన్ని నోట్లో వేసి నానుస్తూ ఎర్రటి ఎండలో చెమటలు కక్కుతూ దొంగ పోలీసు ఆట అడతంటే ఉంటది నా సామీ రంగా... తిరుగులేదంతే... 


అది 2002  సంవత్సరం, చదువుకుంటూ ఇంటి వెనకే ఉన్న CD షాప్ లో అప్పుడప్పుడు సినిమా చూసే రోజుల్లో, అక్కడ ఉన్న రాక్ లో పైన ఓ మూలన దుమ్ముగోట్టుకుపోయి ఒక cd పెట్టి ఉంది. దాని మీద రాజులు కత్తులు పట్టుకొని నిలుచున్న మనుషులు చూసి ఇదేదో రాజుల సినిమా ల ఉందే అని తీసుకెళ్ళి చూసా.అందరూ ఏంట్రా బోరింగ్ గా ఉంది అన్నారు, నాకైతే ఇంకో ప్రపంచాన్ని చూసినట్టుంది. అప్పటికి ఇంకా ఇంగ్లీష్ తలకి ఎక్కలేదు. అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసాను, బావున్నాయనిపించింది.
మొదటి సారి “LORD OF THE RINGS” లో మొదటి భాగం “the fellowship of the ring” చూశాక ఓ అధ్బుతం అనిపించింది. ఓ పుస్తకం చదివాక అది మన అంచనాకి తగ్గట్టు ఉండదు, ఎందుకంటే మన ఊహా గొప్పగా ఉంటుంది. మొదటి సారి ఆ సినిమా నా ఊహా ని తృప్తి పరిచింది. ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూసాను, ప్రతి సారి ఎదో కొత్త విషయం తెల్సేది. అసలు ఇలా తీయోచ్చా ? ఆ లొకేషన్స్ ఏంటి? కాస్ట్యూమ్స్, ఒక కొత్త భాష, ఎన్నో పాత్రలు, అద్భుతమైన కట్టడాలు,ఆకాశాన్నంటే భవనాలు,విగ్రహాలు. బాగా నచ్చినది కథ. ఎక్కడో చిన్న ఊర్లో మొదలైన కథ ఎంతో మంది కలుపుకుంటూ ఎన్నో మలుపులు తిరుగుతూ అద్భుతాలను పరిచయం చేస్తు వెళ్తుంటే ఆ లోకంలో విహరించడం తప్ప ఎం చేయలకేపోయా.
అప్పటికి హాలీవుడ్ గురించి పెద్దగా తెలీదు. రింగ్ అని కనపడిన ప్రతి సినిమా వదలకుండా చూసే వాడిని. ఎన్ని CD షాప్ లు తిరిగానో.  కొన్ని రోజులకే మా షాప్ వాడే LOTR లో రెండవ భాగం “the two towers” తీసుకువచ్చాడు. అందులో పడి కొట్టుకుపోయాను. ఇంకో సంవత్సరానికి (నాకైతే ఆ ఒక సంవత్సరం రెండేళ్ళలా తోచింది. ) మూడవ భాగం “The return of the King” వచ్చింది. అది చూసి సంతోషంతో పాటు బాధ కూడా అనిపించింది. LOTR ఐపోయినందుకు. అందులో రాజులు , కోటలు, మాయలు , మంత్రాలు, రాక్షసులు, మాట్లాడే డ్రాగన్ లు , ఎన్నో జాతుల మనుషులు ప్రతిదీ అద్భుతం. చిన్నగా నడిచే కథ. ఓపిగ్గా చూస్తే నచ్చుతుది.
అప్పటి నుంచి పీటర్ జాక్సన్ మేనియా పట్టుకుంది. ఆయన తీసిన “కింగ్ కాంగ్” కూడా అలానే అద్భుతం లా చూసా.
మళ్ళీ పీటర్ జాక్సన్ “ది హాబిట్” అనే సినిమా మొదలు పెట్టాడని. మళ్ళీ మబ్బుల్లో తేలా. పదేళ్ళ తరువాత అంటే 2012 లో హాబిట్ సిరీస్ మొదలైంది. లార్డ్ అఫ్ ది రింగ్స్ కి ముందు ఎం జరిగిందో చెప్పడం కథ. మళ్ళీ ౩ భాగాలు.(  An Unexpected Journey (2012), The Desolation of Smaug (2013), and The Battle of the Five Armies (2014))...
ఈ రోజుతో మూడవ భాగం కూడా ఐపోయింది. ఈ రోజే చివరి భాగం చూసా. IMAX వాడిని అడుక్కొని అయినా మళ్ళీ మొత్తం ఆరుభాగాలు ఒకే రోజు అదే స్క్రీన్ మీద చూడాలని ఆశ.
ఇది రివ్యూ కాదు. స్వోత్కర్ష. ఇలా ఉంది అని చెప్పడానికి అది ఒక రోజులో తీసిన సినిమా నే కాదు. దాదాపు 12 ఏళ్ళ పాటు తీసిన సినిమా.
బలమైన చెడు మీద బలహీనమైన మంచి, ఆ మంచి చేయాలన్న కొందరి ప్రయత్నం ఎలా గెలిచింది అన్నదే కథ.
ప్రతి పాత్రకి ఒక కథ ఉంటుంది, ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ రోజు చాల బాధ అనిపించింది సినిమా ఐపోయినందుకు.

ప్రయాణం లో మొదటి భాగం,

http://aakaasavaani.blogspot.in/2014/06/blog-post.html


ఓ ప్రయాణం -2 


వంశీ ఉదయాన్నే ఆఫీసు కి  వెళ్ళే సరికి  చాలా మంది ఇంకా ఆఫీసు కే రాలేదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ ఏరియా లకి వెళ్ళిపోయారు. ఎవరో కొందరు  ఉన్నారు.  తనకి ఇచ్చిన రూం కి వెళ్లి కూర్చున్నాడు. ఎసి శబ్దం మెల్లగా వినిపిస్తుంది. సీట్లో వెనక్కి వాలి ఆలోచనల్లోకి జారుకున్నాడు.


వంశీ ఊరికి వచ్చాక చాలా మంది మొహాన్నే నవ్వారు. కొందరు మాత్రం మొహమాటానికి తన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. అన్నింటికీ తన నవ్వే సమాధానం ఐంది. మధు బాధగా ఉన్నా, వంశీ ఆలోచన సరైనదే అన్న భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. రోజు పరిగెట్టడం లేదు. ఒక ప్రశాంతత. ఉదయాన్నే నాన్నతో కలిసి పొలం వెళ్ళడం, ఏవైనా చిన్న చిన్న పనులుంటే చూసుకోవడం. ఆఫీసు కి తయారై నాన్న ని నర్సరీ దగ్గర వదిలి వెళ్ళిపోయేవాడు .


ఎలాగైనా నిలబడాలి. దేనికోసమైతే ఉద్యోగాన్ని వదిలి వచ్చాడో దాన్ని సాధించాలి. ముందు ఉద్యోగం లో స్థిరపడాలి. తన కింద పని చేసే వాళ్ళందరిని పిలిచి మాట్లాడడం మొదలు పెట్టాడు. చాల మందిలో పని చేయాలన్న ఆసక్తి లేదు. వచ్చి వెళ్తున్నారు అనిపించింది. మొత్తం మీద చూసుకుంటే ఈ జిల్లా నుంచే ఆశించిన ఫలితాలు రావడం లేదు. అందరి మాటల్లో తెల్సింది ఏవిటంటే రైతులు కూడా ఆసక్తి గా లేరని. పని ఏమిటంటే,రిలయన్సు వాళ్ళు రైతుల నుంచి కాయగూరలు కొంటారు. దాని కోసం లోన్,విత్తనాలు,ఎరువులు ఇస్తారు.వాళ్ళకి కావాల్సిన రీతిలో పండించాలి .పండించిన పంటలో నాణ్యత లేకపోతే తీసుకోరు. ఇది ప్రజల్లోకి వెళ్ళలేదు. కారణాలు, చాల మంది కౌలు రైతులు కావడం, కౌలు చాల ఎక్కువగా ఉండటం. వ్యవసాయం చేయాలన్న ఆసక్తి లేకపోవడం (ఆదాయం లేక). ప్రకృతి వైపరిత్యాలు, రియల్ ఎస్టేట్ ప్రభావంతో పొలాలు అమ్ముకోవడం, వ్యవసాయం చేసే వాళ్ళ నుంచి ఆ అనుభవాన్ని అందుకోవడానికి తరువాతి తరం సిద్ధంగా లేకపోవడం.  ఇలాటి చాలా కారణాలు.
 ఎక్కడ మొదలు పెట్టాలో అర్ధం కాలేదు వంశీ కి. వ్యవసాయం నామమాత్రంగానే జరుగుతుందని గ్రహించాడు. 10-20 ఏళ్ళలో ఎంత మార్పు అనిపించింది.
ముందు రైతులతో మాట్లాడాలి అనుకున్నాడు. కొన్ని ఊర్లు ఎంచుకొని వెళ్ళడం మొదలు పెట్టాడు. కొందరితో మాట్లాడాక తెల్సింది ఏంటంటే, ఇలా వచ్చి మాట్లాడుతుంటే "సూక్ష్మ రుణాలు" ఇచ్చే వాళ్ళు అనుకుంటున్నారు. కొందరేమో ఎంత లోన్ ఇస్తారు అంటున్నారు. రైతుల్లో సానుకూలత కనపడలేదు. ముందుగా తన స్నేహితుడిఆచారి వాళ్ళ ఊరిని ఎంచుకున్నాడు. అక్కడ దాదాపుగా వెయ్యి గడపలు ఉన్నాయి. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళే. అందరు మధ్య తరగతి వాళ్ళు. అందరికి నాలుగు లేదు ఐదు ఎకరాల కన్నా మించి లేదు పొలం.అందరువాణిజ్య పంటల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు. పొగాకు, మిర్చి,శెనగలు లాటివి. ఆచారి సాయంతో ఇరవై మంది రైతులని పిలిచి మాట్లాడాడు. కూరగాయల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదని, దిగుబడి బాగా ఉంటె ఆదాయం గొప్పగా లేకున్నా నష్టం రాదనీ, అందరు సాంప్రదాయ వ్యసాయాన్ని పాటించాలని సూచించాడు. కొందరు ముభావంగా తల ఊపారు. వాళ్ళకి కూడా పెట్టుబడి లేకపోవడం, అప్పుల్లో ఉండటం లాటివి ఆ పనిని ఒప్పుకునేలా చేసాయి. మొత్తం ఎనభై ఎకరాలు. దాని కోసం అయ్యే పెట్టుబడి ని అంచనా వేసి మేనేజిమెంట్ కి వివరాలు పంపాడు. మానేజిమెంట్ నుంచి వచ్చిన సమాధానం చూసి ఆశ్చర్యపోయాడు వంశీ. ఆ జిల్లా నుంచి ఆశించిన ఫలితం రావడం లేదనీ, అక్కడ నుంచి తీసివెయ్యాలని అనుకుంటున్నామని, చివరి ప్రయత్నంగా చూస్తామని సమాధానమిచ్చారు. ఆశ్చర్యపడటం తన వంతైంది. మునిగిపోయే ఓడ లో ఉన్నానని అర్ధమైంది. ప్రయత్నలోపం ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.
నాన్నతో మాట్లాడి సాంప్రదాయ వ్యవసాయం గురించి వివరాలు తెల్సుకున్నాడు. ఆ ఊర్లో వాళ్ళ నాన్నకి తెల్సిన వాళ్ళు కూడా ఉండటం కూడా తన పని ముందుకు సాగడానికి దోహదపడింది. అక్కడ ఉన్న నీటి వసతిని అంటే బోర్లు,చెరువులు,కుంటలను పరీక్షించాడు.రైతులతో రోజు మాట్లాడడం, తనే జవాబుదారిగా ఉండటం, ఏదైనా సమస్య ఉంటె తనతో మాట్లాడమనడం, పెట్టుబడి అంటూ  ఇవ్వకుండా అవసరానికి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం  లాంటి పనులు రైతుల్లో నమ్మకాన్ని పెంచాయి. ఉన్న కొద్ది పెట్టుబడి లో ఈ పనిలో గెలవాలని తపన పడుతున్నాడు వంశీ.
ఆఫీసు లో  వీకెండ్ ఇంటి దగ్గర ఉండే అవకాశం ఉండేది, ఇపుడు శని, ఆది వారాలు కూడా అక్కడే గడుపుతునాడు.
ఓ రోజు ఇంటికి వచ్చే సరికి బాగా చీకటి పడింది. ఇంట్లో అందరు ఎదురు చూస్తున్నారు. తిన్నాక కూడా అదే ఆలోచన, ఇంకా ఎలా బాగా చేయోచో ఫోన్ లో సమాలోచనలు. కాసేపటికి అలికిడి కావడం తో తల తిప్పి చూసాడు వంశీ. తననే చూస్తు నిలబడి ఉంది మధు. తన కళ్ళలో వేయి ప్రశ్నలు. మధు ని కళ్ళతో పిలిచాడు వంశీ. ఆరుబయట నులక మంచం, కొబ్బరాకుల గలగలలు, దూరాన శివాలయం లో భజన పాటలు.దగ్గర గా కూర్చుంది మధు. "కోపంగా ఉందా" అడిగాడు వంశీ. తన కళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి," నువ్వు దూరంగా జరుగుతున్నట్టుంది" అంది.మధు భుజం చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకున్నాడు. "మనది కాని ప్రపంచానికి, నిన్ను అతిధి గా తీసుకు వచ్చి వదిలేసా కదా" మధు భుజం చుట్టూ ఉన్న చేయి తన ఇష్టాన్ని తెలుపుతూ ఉంది.  మధు కళ్ళు వర్షిస్తున్నాయి."నన్నిలా వదిలేసి వెళ్ళకు వంశీ" అంది మధు, "మరి నాతో పాటు వస్తావా?". మధు మొహం మీద చిరునవ్వు "నిజంగానా,తీసుకు వెళతావా?", "ఊ" అన్నాడు వంశీ. తన చేతుల్లో ఒదిగిపోయింది మధు.
మరుసటి రోజు తెల్లవారేసరికి వంటిట్లో పద్మావతమ్మ గారెలు చేస్తూ ఉంది. ఆ వాసన కి ఆకలి ఆవురావురుమంది వంశీ కి. "మా ఆకలి", "మొహం కడుక్కొని రారా" అంది పద్మావతమ్మ. "నాన్న ఏడి ?" "పొలం దాక పోయి వస్తా అన్నాడు". తొందరగా మొహం కడుక్కొని, నాన్న కోసం చూస్తున్నాడు వంశీ. "వస్తాడులేరా,నువ్వు తిను" , "రానీమ్మా ". మాటల్లోనే వచ్చాడు శ్రీనివాసరావు. అలా వంటింట్లోనే కూర్చుని గారెలు తింటూ ఉంటె "ఇంత తాపీగా తినగలమా" అనిపించింది వంశీ కి.
పొలం పనులు చక చకా సాగుతున్నాయి. ఎరువులు వేయడం,దున్నడం,విత్తడం జరిగిపోయాయి.వంగ మొక్కలు,బెండ,టమాటో,కాబేజీ,దోస కాయలు వేసారు. మధ్య మధ్యలో బంతి నార్లు.  పని మీద ఇష్టం ఉంది. తన చేతుల్లో దిద్దుకుంటున్న పని, మంచి గాలి. ఒళ్ళు అలసిపోయి ఇంటికి చేరి, తిని పడుకుంటే మంచి నిద్ర. మొక్కలు వచ్చేసాయి. పురుగు మందు కొట్టడం, కలుపు తీయడం. ఇదంతా కూలి వాళ్లతో సంబంధం లేకుండా అక్కడ ఉన్న 20 కుటుంబాలే చేసుకుంటున్నాయి. ఓ సందడి వాతావరణం. ముద్ద బంతి పూలు పండగ వాతావరణాన్ని తీసుకు వచ్చాయి. మధు అది చూసి మురిసిపోయింది.
మొదటి పంట వచ్చింది, కానీ అనుకున్నంత నాణ్యత లేదు. అందరు దిగాలు పడిపోయారు. వంశీ కి ఓ ఆలోచన వచ్చింది. కూరగాయలు తీసుకువెళ్ళడానికి లారీ ఉదయాన్నే వస్తుంది. ఈ లోగ కోసి వాటిలో మంచి వాటిని ఏరి బస్తాల్లోకి ఎక్కించారు. మిగతా వాటిని దగ్గర ఉన్న టౌన్ లో మార్కెట్ కి పంపాలని నిర్ణయించారు. మొదటి పంట నష్టాన్ని మిగల్చలేదు. కాని ప్రజల్లో ఓ అవగాహన  వచ్చింది. వాణిజ్య పంటలతో నష్టపోయి విసిగిపోయిన ప్రజలు ఇటు వైపు మొగ్గు చూపసాగారు.
వంశీ ఆఫీసు లో ఉండగా ఓ మెయిల్ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే "ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన కొన్ని రోజుల్లో కూరగాయలు కొనడంఆపేస్తాము. బహుశా 3 నెలల తరువాత" అని. ఆఫీసు లో ఉన్న వాళ్ళలో చాలామంది ఇంత ఆలస్యంగానా  అన్నట్టు చూసారు. కొందరు వంశీ వైపు చూస్తున్నారు. వంశీ కి ఏం తోచలేదు. మేనేజర్ కి ఫోన్ చేసాడు. "సర్ ఇలా మెయిల్ వచ్చింది. అందరు ఇపుడిపుడే ఇటు వైపు ఆలోచిస్తున్నారు. ఈ లోగా ఇలాటి నిర్ణయం ఏంటి?". "చాల రోజుల నుంచి అక్కడ ప్రొడక్టివిటీ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు" అని సమాధానం అవతల నుంచి."నాకో అవకాశం ఇవ్వలేరా", " నేను మాట్లాడి చెప్తాను" ఫోన్ డిస్కనెక్ట్ ఐంది. ఇంతలో మొబైల్ రింగ్ ఐంది."వంశీ సార్, మా పక్క ఊరి వాళ్ళు కూడా కలుస్తా అంటన్నారు. మిమల్ని అడిగి చెప్తా అన్నాను" అని ఫోన్. "నేను కనుక్కొని చెప్తాలే అని ఫోన్ పెట్టసాడు వంశీ. మనసంతా గజిబిజిగా ఉంది. ఆఫీసు నుంచి తొందరగానే ఇంటికి వెళ్ళాడు. 

అన్నం తినబుద్ధి కాలేదు వంశీ కి. పద్మావతమ్మ గమనిస్తూనే ఉంది."ఎరా  అలా ఉన్నావు? వంట్లో బావుంది కదా?". కొడుకు ఎండలో కష్టపడుతున్నాడని బాధ ఆమెకి. "ఎం లేదమ్మా" అని పడుకోడానికి వెళ్ళాడు వంశీ. నిద్ర పట్టడం లేదు. "నన్ను నమ్మిన రైతుల పరిస్థితి ఏంటి? నేను అనుకున్న దాన్ని సాధించగలనా?" ఇవే ఆలోచనలు కుదురుగా ఉండనియ్యడం లేదు. అలా  ఎప్పటికో నిద్ర పట్టింది. రాత్రంతా ఏవో కలలు, పాతాళానికి జారిపోతున్నట్టు, అందిన ప్రతి దాన్ని పట్టుకుంటున్నా అన్ని  చేజారి పోతున్నట్టు. ఎక్కడో ఆకాశంలో అమ్మానాన్న,మధు పిలుస్తున్నట్టు, ఊపిరి అందడం లేదు వంశీ కి.ఉలిక్కి పడి లేచాడు. వళ్ళంతా చెమటలు. "ఏమైంది వంశీ?" అంది మధు. "ఏదో పీడకల" అని కూర్చుండి పోయాడు. వంశీ భుజం మీద చేయి వేసి అంది మధు " నీ కష్టం ఊరికే పోదు,తప్పకుండా గెలుస్తావు". నవ్వు బలవంతంగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ బయటకి వెళ్ళిపోయాడు. 

ఉదయాన్నే పొలం వెళ్తుంటే బుట్టలో కూరలు అమ్ముతున్న ఆమె కనిపించింది." నిజమే కదా, అదే సిటీలో ఇవే కూరగాయలు పాక్ చేసి ఎక్కువ ధర కి అమ్ముతారు. అదే కొనే వాళ్ళ దగ్గరకే తీసుకు వెళ్లి అమ్మితే ఎలా ఉంటుంది?" అని మనసులో అనుకున్నాడు వంశీ. త్వరగా ఆఫీసు కి చేరుకున్నాడు. పైవాళ్ళకి కాల్ చేసాడు, అనాసక్తి గా సమాధానం "చూద్దాం లే" అంటూ. 

ఇంతలో మురళి  నుంచి కాల్. మురళి వంశీ తో పాటు పని చేసేవాడు.  మంచి మిత్రుడు కూడా . "ఏంటి వంశీ, ఎలా ఉన్నావు?", "బావున్నా మురళి, కాని ఫలితాలు ఆశించినట్టు రావడం లేదు" అన్నాడు వంశీ. "పర్లేదు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు వంశీ" అన్నాడు మురళి. "సర్లే వదిలేయ్, ఏవిటి కబుర్లు, హైక్ ఏమైనా ఇచ్చారా?", "లేదు, ఏదైనా సైడ్ బిజినెస్ చేద్దాం అని ఉంది" అన్నాడు మురళి. 

వంశీ మనసులో ఓ ఆలోచన మెదిలింది. 
వంశీ అన్నాడు "నా దగ్గర ఓ ఆలోచన ఉంది", 
"ఏంటి?", 
"మనం కూరగాయలు నేరుగా రైతుల నుంచే కొనుక్కుంటే ఎలా ఉంటుంది అంటావ్?",
"అంటే"
"రైతు బజార్ కి వెళ్ళకుండా, సూపర్ బజార్, సూపర్ మార్కెట్ లో కొనకుండా, మన ఏరియా లోనే తాజా కూరగాయలు దొరికితే అది చవకగా" అన్నాడు వంశీ. 
"అది ఎలా" 
"మనం ఒక కాలనీ ఎంచుకుందాం. అక్కడ కొన్ని చోట్ల ఖాళీ ప్రదేశాలను అద్దెకు తీసుకుందాం.  రైతుల నుంచి మనం కూరగాయలు కొని, పొలం లో నే గ్రేడ్ చేయించి, రాత్రి కి పంపితే అవి మనం అనుకున్న చోటికి ఉదయానికల్లా చేరుకుంటాయి. అక్కడ నుంచి మళ్ళీ గ్రేడ్ చేయించి మనం అద్దెకు తీసుకున్న చోట పెట్టి అమ్మితే అటు రైతు, ఇటు కొనే వాళ్ళు లాభ పడతారు కదా?" అని ముగించాడు వంశీ. 
"ఆలోచన బాగానే ఉంది. కానీ అసలు అందులో లాభం వస్తుందంటావా?" అన్నాడు మురళి. 
"ముందు ఈ ఆలోచన విజయవంతం అయితే బావుంటుంది. ఉదాహరణకి, అన్ని సార్లు కూరగాయలు ఒకే రకంగా ధర ఉండవు. బెండకాయ ఊర్లో 10 కేజీలు 100 రూపాయలకి అమ్ముతున్నారు. అదే మనం ఒక కేజీ 40 రూపాయలకి కొంటున్నాం. ఈ తేడా ని తగ్గించగలిగితే మనం విజయం సాధించినట్టే. రవాణా ఖర్చు తగ్గించడానికి ప్రతి పట్టణానికి దగ్గరలో ఉన్న పల్లెల్ని సంప్రదించి కొరగాయలు కొనుగోలు చేస్తే బావుంటుంది. ఏమంటావ్?" ఆపాడు వంశీ. 

"సరే, నేను ఆలోచించుకొని చెప్తాను.ఉంటా వంశీ" అని పెట్టేసాడు. 
వంశీ ఆలోచిస్తున్నాడు,తనకి ఉన్న సమయం 3 నెలలు, ఈ లోగా ఏదైనా చేయాలి... 

It is Lack of faith that makes people afraid of meeting challenges, and I believed in myself.







ముందు భాగాలు 
1.http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_6126.html
2.http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_30.html
3.http://aakaasavaani.blogspot.in/2014/01/blog-post_15.html


ఓ మూడు నెలలు ఆన్సైట్ పని మీద వంశీ ని వాళ్ళ కంపెనీ ఇంగ్లాండ్ పంపించింది. పనులన్నీ అలా జరిగిపోతూ ఉన్నా, మనసంతా ఒకటే ఆలోచన "ఇది ఎంత వరకు సమంజసం, నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా". ఇంగ్లాండ్ రాక మునుపు తన భార్య తో ఈ విషయం మీద చర్చించాడు. తను అంత సుముఖంగా లేదు అని తెల్సింది మాటల్లో. ఎవరికైనా ముందుకు వెళ్ళడం కావాలి కానీ,వెనక్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారు. మధు చెప్పింది ఒకటే, పల్లెటూరికి వెళితే పుట్టే పిల్లలకి చదువు, మంచి సౌకర్యాలు ఎలా అని? మ్మ్, నిజమే.


జన్మనిచ్చిన తల్లితండ్రులకన్నా, జన్మించబోయే పిల్లల కోసమే అందరు ఆలోచిస్తారు. రెక్కలు రాని పక్షులకి, రెక్కలుడిగిన పక్షులకి వేటికి ఆసరా కావాలి?


వంశీ తీసుకున్న ఈ నిర్ణయానికి అప్పుడే ఆటంకాలు మొదలయ్యాయి. మధు వాళ్ళ బంధువుల్లో, వంశీ వాళ్ళ బంధువుల్లో అప్పుడే సలహాలు, సూచనలు మొదలయ్యాయి. కొందరు పరోక్షంగా అంటూ ఉంటే, కొందరు మధుతో, వంశీ తో అనసాగారు. "ఏమయ్యింది, బంగారం లాంటి ఉద్యోగం వదిలి ఏమి ఉద్ధరించడానికి ఇక్కడకి రావడం", ఇంకా చాలా. సమాధానం, సంజాయిషీ చెప్పుకుంటే వెళ్తే  ప్రతి వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అన్నింటికీ సమాధానం నవ్వు, మౌనమే అయింది.

రోజులు దగ్గరకి వస్తున్నాయి. మధు ఖంగారు గా ఉంది. "తప్పదా,వెళ్ళాలా?" అంది వంశీ తో. మధుని దగ్గరకి తీసుకొని అన్నాడు వంశీ " మధు, భయపడుతున్నావా? ఇలాటి సౌకర్యాలు , ఇపుడున్న జీతం ఉండవంతే. మిగతావన్నీ ఇస్తానన్న నమ్మకం నాకుంది. నీకు ఏ లోటు రానివ్వను మధు". "నాకు ఇష్టమేనండి, ఎదో భయం" అంటూ హత్తుకుపోయింది. 

 ఓ రోజు మధు గారి నుంచి ఫోన్, హైదరబాద్ లో ఉన్న హెడ్ఆఫీసు దగ్గరకి వచ్చి కలవమని. శనివారం వెళ్లి కలిసాడు. మధు గారితో కాసేపు మాట్లాడాక, మాటల్లో ఆయనే అన్నారు " వంశీ, ఓ సారి ఆలోచించుకో. ఇలా చెప్పి నీ నిర్ణయం మార్చుకోమనో లేక నిన్ను నిరుత్సాహ పరుద్దామనో కాదు. చల్లగా బ్రతికే వాళ్ళు ఇక్కడకి వచ్చి ఇబ్బంది పడతారేమో అని. నువెంతో అలోచించి కానీ ఈ నిర్ణయం తీసుకోని ఉండవు. ఎందుకో చెప్పాలనిపించింది" అని వంశీ వంక చూసి " వెళదాం పద" అంటూ ఆఫీస్ లోకి దారితీశాడు.

లోపల ఒక టీం కూర్చుని ఉంది. మధు గారు వాళ్ళకి పరిచయం చేసి వెళ్ళిపోయారు. కొందరు వింతగా చూడటం,వంశీ ద్రుష్టిపథంలోంచి తప్పి పోలేదు. తన పని గురించి, అక్కడ ఉన్న సమస్యల గురించి వివరించారు. జీతం గురించి కూడా మాట్లాడారు. ఓ నెల తరువాత చేరతానని చెప్పి వచాడు వంశీ.

ఆన్సైట్ లో మిగిల్చిన డబ్బులతో ఫ్లాట్ లోన్ కట్టేసి, మంచి రేట్ వస్తే అమ్మమని , అప్పటి దాకా ఎవరికైనా అద్దెకు ఇవ్వమని స్నేహితులకి చెప్పాడు వంశీ. మధు ముందుగానే రెసిగ్నేషన్( బాధ్యతల నుంచి తప్పుకుంటునట్టు తెలియజేయడం) కి అప్లై చేసింది.  ముందు మధుని సామాన్లతో సహా ఇంటికి పంపాడు వంశీ. రిలీవ్ ఆయె రోజు వచ్చింది. వినోద్ కలిసాడు. "అన్నా, మన ఉద్యోగం నిజంగానే ఓ పద్మ వ్యూహం. చేరిన దగ్గర నుంచి అన్ని లింకులే. జీవితం రుచి పచి లేకుండా అలా గడిచిపోతుంది. సాటి వాడిగా మన బాధ తెల్సు. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను." అన్నాడు. "థాంక్స్ వినోద్" అన్నాడు వంశీ. ఫ్లాట్ కీస్ స్నేహితులకి ఇచ్చి ఊరికి ప్రయాణం అయ్యాడు.......


"ఎవరు కొనమన్నారు? అవసరమా ఇప్పుడు? ఒక్కమాటైనా చెప్పరా నాకసలు?ఉన్నవి తీర్చుకోకుండా... ", "ఏమని చెప్పాల్రా?"
"లేకపోతే ఏంటి మా?"
"ఇదిగో నాన్నకిస్తున్నా "
"ఏరా?"
"కాదు నాన్నా"
"చూడరా, అవసరం ఉంది.కొడుకువని ఓ మాట చెప్పాను. నువంత ఇబ్బంది పడి డబ్బులు పంపాల్సిన అవసరం  లేదు. ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిది." ఆయన అహం దెబ్బ తినింది. 
"నాన్నా, డబ్బు గురించి కాదు, అక్కడ కాకుండా ఇంకెక్కడైనా కొనచ్చు కదా."
సమాధానం లేదు... 
"సరేరా ఉంటా" అమ్మ గొంతు... 

మళ్ళీ రింగ్ చేశా.... ఎత్తలేదు... 

మనసంతా చిందరవందరగా ఉంది. ఏంటిది? ఎక్కడ తప్పు జరిగింది? నా ఉద్దేశ్యం మంచిదేగా.. ఎందుకు అర్ధం చేసుకోవడంలేదు. విసుగు, కోపం. ఫోన్ తీసి నేలకేసి కొట్టాలనిపించింది. ఎవరి మీద కోపం? అమ్మా నాన్న ల మీదా? కదిలిస్తే గొడవ పడదామని ఉంది. అసలు నా తప్పు లేనప్పుడు, నేను ఎందుకు ఫోన్ చేయాలి? అవసరం లేదు. 

 ఒక రెండు నిముషాలకి నాలో విజ్ఞత మేలుకొంది. ఎందుకు రావాలి నాకు కోపం?నేనేం కష్టపడ్డానని, నాకింత అసహనం? అమ్మానానే కదా? వాళ్ళు పడ్డ కష్టానికి, ఎదుర్కొన్న సమస్యలకి, వయసుకి కోపం వస్తుంది. ఓ మాట అంటారు, పడాలి. మళ్ళీ డయల్  చెసా.. అమ్మ ఫోన్ ఎత్తింది... 

"మా..,నా  ఉద్దేశ్యం అది కాదు "... 
"అవసరంలో ఉన్నామని నిన్ను అడిగాం రా, నీకు వీలైతేనే చూడు. లేకపోయినా పర్లేదు. మేం ఎలాగోలా సర్డుకుంటాం."
"నాన్నున్నాడా?"
"ఆయనకీ మాటాడ్డం ఇష్టం లేదురా,సరే ఉంటా" ఫోన్ డిస్కనెక్ట్ అయింది.. మనసంతా బాధ. గుండె గోడలని లోపల ఎవరో పట్టుకొని రక్కుతున్నట్టుంది.  

వీర్రాజు, చిన్నమ్మ ల  కొడుకు  శంకరం. ఒకడే కొడుకు. చదువుకొని పట్నం లో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం లో అనుబంధం ఎక్కువ. వీర్రాజు, చిన్నమ్మ లు ఊర్లోనే ఓ చోటు కొన్నారు. కొంటున్నామని శంకరానికి ఓ మాట చెప్పారు. కొనాలా వద్దా అని అడగలేదు. ఉన్న డబ్బే కాకుండా, కొంత బయట తెచ్చి ఆ చోటు కి కట్టారు. శంకరానికి మనసులో ఎక్కడైనా టౌన్ లో కొంటె బాగుంటుంది కదా అని ఆలోచన. ఉత్తరోత్తరా ధర పెరుగుతుంది కదా! పల్లెటూర్లో ఏముంటుంది అనిపించింది. సరే అమ్మానాన్నల ఆలోచన కాదనలేకపోయాడు. ఇప్పుడు బ్యాంకు లో ఎప్పుడో తీసుకున్న లోన్ తాలుకు బాకీ కట్టమని బ్యాంకు వాళ్ళు నెత్తిన కూర్చున్నారు. వీర్రాజు కి ఎం చేయాలో పాలు పోలేదు. తన దగ్గర ఉన్నది,తెల్సిన వాళ్ళ దగ్గర తీసుకొని ఆ చోటు కి కట్టాడు. ఇప్పుడు తన దగ్గర లేవు. బ్యాంకు వాళ్ళు ఇంటికి వస్తే పరువు పోతుంది. ఎప్పుడు కొడుకుని నోరు తెరిచి అడగని వాడు, డబ్బు ఏమైనా ఉందేమో చూడమని అడిగాడు. శంకరం దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ తనకి చెప్పకుండా ఇలాటి నిర్ణయం తీసుకున్నారే  అన్న ఉక్రోషం. ఆపుకోలేక అనేసాడు. ఈ మాటలు వీర్రాజు ని బాధపెట్టాయి. నిజమే కదా, ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటె బాగుంటుంది అనిపించింది వీర్రాజు కి. వాడితో మాట్లాడాలంటేనే ఏదోలా ఉంది. మనసు రాలేదు. నా కొడుకు అందరి లాంటి వాడు కాదు అన్న నమ్మకానికి బీటలు వారాయి. కష్టం లో ఉన్నప్పుడు చిన్న మాట కూడా కఠినం గా ఉంటుంది. ఏదైతే అది అవుతుందని వదిలేసాడు. బాధ మిగిలిపోయింది, దిగులు పెరిగిపోయింది. 

ఓ రెండు రోజుల తరువాత వాడు వస్తున్నా అని ఫోన్ చేసాడు. ఎప్పుడు వెళ్లి నేనే తీసుకు వచ్చే వాడిని, కాని మనసు రాలేదు. వాడిని తీసుకురమ్మని బుజ్జోడికి చెప్పాను. చీకటి పడే వేళ కి వచ్చాడు. పసి వాడిలా కనపడే నా కొడుకు పరాయి వాడిలా కనిపించాడు. వాడి నవ్వు వెనక ఏదో స్వార్ధం దాగుందని అనిపించింది. మనఃస్పూర్తిగా మాట్లాడలేకపోయా. చిన్నమ్మ మాత్రం మాట్లాడుతూనే ఉంది. దానికి లోపల బాధ ఉన్న బిడ్డని చూసిన ఆనందం. 
పొద్దున్నే వాడు ఏదో మాట్లాడాలని చూస్తున్నాడు కానీ నేనే ముభావంగా ఉన్నా. ఎంత మాట్లాడలనిపించినా, నా మనసు వెనక్కే లాగుతుంది. ఈ మధ్యన ఏదో సుస్తీ చేసి వాళ్ళంతా ఒకటే నెప్పులు. పడుకొని ఉంటె వాడొచ్చి కాళ్ళు నొక్కాడు. వద్దన్నా వినలేదు. వాడెప్పుడూ చేసే పనే ఇపుడు ఇష్టంగా లేదు. 

నాన్న ముభావంగా ఉండటం అర్ధం అవుతూనే ఉంది.అమ్మ మాత్రం మాట్లాడుతూ ఉంది. అటు నాకు నాన్నకి సర్దిచెప్పడానికి చూస్తుంది.  తప్పు నాదే. నాకు నేనే స్వార్ధపరుడిలా అగుపిస్తున్నా. అక్కడ  ఉన్నప్పటి కోపం కరిగిపోయింది. అమ్మా నాన్నల్ని చూసాక, నేను కాకపోతే ఇంకెవరు తీరుస్తారు. ఇదే కదా బాధ్యత తీసుకోవడం అంటే. అలా తీసుకోనపుడు నేను ఉంటె ఎంత లేకపోతే ఎంత. ఎలా అయినా అమ్మా నాన్నలని మాములుగా చేయాలి. శనగ వేసాం ఈ యేడు. ఎలా మొలిచిందో చూడ్డానికి నాన్నతో పాటు వెళ్ళా. నేనే బండి నడుపుతూ ఉన్నా, నా వెనక నాన్న. "నాన్న, బ్యాంకు వాళ్లతో మాట్లాడావా?". సమాధానం లేదు. "ఈ రోజు వెళ్లి మాట్లాడి వద్దాం". ఎం మాట్లాడలేదు. పొలం వెళ్లి వచ్చాం. ఆ మధ్యలో పొడి పొడి గా నలుగు మాట్లాడాడు నాన్న. అమ్మ కూర్చోబెట్టి సర్దిచెప్పింది నాన్నకి. పిల్లోడు అన్న మాటలు పట్టించుకోవద్దు అని. నాన్న ని తీసుకొని బ్యాంకు కి వెళ్లాను. ఆఫీసర్ తో మాట్లాడి ఎంత కట్టాలో కట్టి వచ్చా. ఏదైనా బ్యాంకు విషయాలు ఉంటె, నాకే ఫోన్ చేయమని వచ్చా . నాన్న తేలికపడ్డాడు. మరుసటి రోజు పొగ చేను దున్నటం. కలుపు పోవడానికి. నేను కూడా వస్తా అని చెప్పా. ఎద్దులు తోలుకొని, రెండు అడ్డ లు వేసుకొని వెళ్లాం. దాదాపు 7 ఎకరాలు, రెండు రోజులు పట్టింది. నాన్న మామూలు ఐపోయాడు. ఎప్పటిలా మాట్లాడుతున్నాడు.తన బాల్యం, ఆయన పడ్డ కష్టం, ఆడిన ఆటలు చెప్తున్నాడు. అవన్నీ నాకు తెల్సినవే.కానీ మా నాన్న చెప్తున్నట్టు లేదు, నా కొడుకు చెప్తున్నట్టుంది. మనసు పొరల్లో నిండిన పొగ మంచు విడిపోయింది. అలవాటు తప్పి చేతులుపోటు పుడుతున్నా నాన్నతో కలిసి పని చేయడం సంతోషమనిపించింది . నాన్న కూడా బాధ పడ్డాడు, నా చేత పని చేయిస్తున్నందుకు. ఆ నొప్పులు, కష్టం ఆయన ప్రశాంతత ముందు ఓడిపోయాయి. నాకు సంతృప్తి ని మిగిలిచాయి.  

 చిన్నమ్మ కొడుకుని చూసుకొని సంబరపడిపోయింది. నా మనసులో కూడా గర్వం. తొందరపడి వాడిని అపార్ధం చేసుకున్నానేమో అనిపించింది. కాని ఈ సంఘటన మమ్మల్ని ఇంకా దగ్గర చేసింది. శంకరం సంతోషంగా ఊరికి వెళ్ళిపోయాడు. 




" ఏది కావాలో తెల్సినపుడు, ఏది వదిలేయాలో తెల్సి వస్తుంది"

మొదటి రెండు భాగాల కోసం.... 
1http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_6126.html
2. http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_30.html

రాత్రి బస్సు ఎక్కగానే అమ్మ ఫోన్ చేసింది, ఉదయం 5 ఆ ప్రాంతం లో దిగుతారని. పడుకునే సరికి ఆలస్యమైంది. ఓ గంట నిద్ర పోయి ఉంటా, ఇక నిద్ర పట్టలేదు. పది నిముషాలకి ఓ సారి మెలుకువ వస్తుంది. అమ్మ వచ్చినట్టు, నేను లేచి వెళ్తున్నట్టు... ఇలా. 3 నుంచి 5 అవడానికి పది గంటలు పట్టింది.  ఇక నిద్రపట్టక బస్టాండ్ కి వెళ్లాను. ఓ అరగంట తరువాత వచ్చింది బస్సు. అమ్మ, నాన్న  డోర్ దగ్గరే నిలుచుని ఉన్నారు. అమ్మ అక్కడ నుంచే చేయి ఊపుతూ. దిగగానే చెంపలు నిమిరి నీళ్ళు నిండిన కళ్ళతో చూసుకుంది. తెలీకుండానే నా కళ్ళలో నీళ్ళు. సామాన్లు దింపుతున్నా నాన్న మమ్మల్ని చూస్తూ ఉన్నారు. నాకు నాన్నకి సాయం చేయాలనీ ఉంది, కాని అమ్మని చూస్తు అలానే నిలుచుని ఉన్నా. "ఆటో పిలవరా" నాన్న. అప్పటికే చుట్టూ చేరిన ఆటో వాళ్లలోంచి ఒకరిని పిలిచి ఇంటికి వచ్చేసాము.నాన్న ఆటో లో వస్తే అమ్మనాతో బైక్ మీద. నా భుజం మీద చేయి వేసిన అమ్మ స్పర్శ లో ఏదో తెలియని భరోసా. 

అమ్మ, మధు తినడానికి తెచ్చినవి సర్దుకుంటూ ఉంటే నాన్న, నేను కలిసి షటిల్ ఆడటానికి వెళ్లాం. నాన్న ఊర్లో విషయాలు, మారుతున్న పద్ధతులు, మనుషుల ఆలోచనలు చెప్తున్నాడు. మార్పు సహజం , కానీ ఆ మార్పు మనుషుల మధ్య సంబంధాలని విచ్చినం చేస్తూ ఉంది. ఒకప్పుడు వ్యవసాయ కోసం తవ్వుకున్న కుంటల్లో ఉన్న నీళ్ళను తెచ్చుకుని తాగే వాళ్ళం . అవి చాల బాగుండేవి. నీళ్ళు అంటే అవే అనే అనిపించేది. "ముత్యాల గుంట లో నీళ్ళు వాడుతున్నారా నాన్నా?", "ఇపుడెవర్రా? అందులో వెంకటస్వామి పడి చచ్చిపోయాడు." ఆశ్చర్యం, ఓ రకంగా మాకు చుట్టాలు కూడా అవుతారు. "దేనికి?" "ఏముంది రా, వయసొచ్చిన కొడుక్కి ఆస్తి పంచకపోవడం ఆయన తప్పయితే, సంపాదించుకున్నది ఉన్నా కూడా ఆస్తి పంచలేదని వయసైపోయిన తండ్రిని చూడని కొడుకు. ఎవర్నీ తప్పు పట్టలేం". ఓ నిట్టూర్పు. ఎం జరుగుతుంది. 


ఆ రోజు అందరం కలిసి బయటకి వెళ్లాం. అమ్మ,మధు చీరలు కొన్నారు. నాన్నకో చలికోటు. అమ్మ నాకు గాగుల్స్ కొనిచ్చింది . అక్కడ నుంచి రెస్టారెంట్ కి వెళ్లాం. ఏదో తెలియని నిండుతనం, సంతృప్తి. ఇంటి మీదకి వెళ్లి కూర్చున్నాం. అపుడే ఎండాకాలం మొదలౌతుంది. పౌర్ణమి నిన్ననే ఐపోయింది, చంద్రుడు మెల్లగావెన్నెల జల్లుతూ వస్తున్నాడు. పక్కన ఉన్న లేక్ మీద నుంచి చల్లని గాలి.   "ఉద్యోగం ఎలా ఉంది రా?", "బావుంది నాన్నా!". "ఇష్టంగానే చేస్తున్నావా?","ఇష్టం తో సంబంధం లేదు నాన్నా, మా చదువుకి, మేము చేయగల ఉద్యోగం ఇదే. ఇది తప్ప ఏం చేయలేం, వేరే పని చేత కాదు.". "నీలో ఏదో నిరాసక్తి రా. ఇంతకు ముందెన్నడూ చూడలేదు ". మౌనం నా సమాధానం ఐంది. నాన్నే కొనసాగించాడు "ఉద్యోగం చేయడం తప్పు కాదు రా, కాని దారిలో నిన్ను నువ్వు కోల్పో కూడదు. నిజమే, మేము నిన్ను పెంచినపుడు నువ్వు మాతో ఉంటావని, ఉండాలని పెంచలేదు.ఎక్కడ  ఉన్నా బాగుండాలని అనుకున్నాం. కానీ సంపాదన మనుషుల్ని , మనసులని చంపేస్తుంది ఏమో రా. సంపాదన అవసరం కానీ, దానికోసం జీవితంలో నిర్లిప్తిత, నిస్పృహ నిండిపోకూడదు. ఏదోలా బ్రతకడం వేరు, ఆ జీవితాన్ని ఆస్వాదిస్తూ బ్రతకడం వేరు. ఇలానే ఉంటె రేపు నీ పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వగలవేమో కానీ వాళ్ళకోసం సమయం పెట్టలేవు. వాళ్లతో గడపలేవు. నాన్నని చూస్తూ పిల్లలు పెరగాలి కానీ నాన్న చేస్తుంటే తిని పెరగకూడదు . ఇక్కడ ఉండి అమ్మాయి,నువ్వు కల్సి సంపాదిస్తున్నది మీరు కొన్న ఫ్లాట్ కి, మీ ఖర్చులకి సరిపోతుంది. రేపు మీ పిల్లలు వస్తే మీరు ఇంకా సంపాదించాలి. ఇపుడు ఖర్చులు అలానే ఉన్నాయి. ఆ ఒత్తిడి ని తట్టుకొని నిలబడి గెలవాల్రా . ఎందుకు ఆ ఒత్తిడి ని అనుభవిస్తున్నవో, ఓ సారి ఆలోచించు. మేం చేసిందే మీరూ  చేస్తున్నారు. మేము సంపాదిచేప్పుడు ఇబ్బందులు పడ్డాం రా, అది కుటుంబం తరువాతే. నాకు తెల్సు , నీకు చెప్పాల్సిన అవసరం లేదు. " ఒక్క నిముషం ఆపాడు. చంద్రుడు పైకి వచ్చాడు. చల్లని వెన్నెల. లేక్  అవతల లైట్లు, లేక్  మీద మెరుస్తూ ఉన్నాయి. 

నాన్నచెప్పడం మొదలు పెట్టాడు. "మధు గారు తెల్సు కదా? అదే మన రిలయన్సు లో పని చేస్తారు. మొన్న మాటల్లో అన్నారు, మన జిల్లా లో ఆ ఏరియా సేల్స్ మేనేజర్ కావాలంట. ఏం  చేయాలంటే, రైతులతో మాట్లాడి వాళ్ళ చేత కూరగయలు లేదా ఏదో పంట, వీళ్ళ పద్ధతుల్లో పండిస్తే ఆ పంట ని వీళ్ళే కొంటారు. నీతో పాటు ఇంకొందరు ఉంటారు. మన జిల్లలో రైతులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి,  అది అంతా  నువ్వు చూసుకోవాలి. అది ఈ మధ్యనే మొదలు పెట్టారు. అన్నీ కలిపి ఓ ముప్పై వేల దాక రావచ్చు. నీకు ఇష్టం ఉంటె నేను మాట్లాడతాను . వచ్చేస్తావా ?" నాన్న నా కళ్ళలోకి చూడడం  లేదు. నాకు అర్ధం అవుతుంది, ఈ మాట చెప్పడానికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో.   ఆ మాట విన్నప్పుడు నాకు అంతా స్తంభించినట్టుంది. నేను చదివిన చదువు, చేసే ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని తలచుకుంటే  నేనా? అనిపించింది. మరి మధు? ఆలోచనలతో పాటు నా గుండె వేగం పెరిగింది. వెనక చిన్న అలికిడి. మమ్మల్నే చూస్తూ నిలుచుని ఉన్న అమ్మ. దగ్గరకి వచ్చి నా భుజం మీద చేయి వేసింది. ఏదో తెలియని నెమ్మది. చిన్నప్పుడు బాగా జ్వరం వచ్చినప్పుడు అమ్మని చుట్టుకొని పడుకున్నప్పుడు కలిగిన స్వాంతన. అది అమ్మ వల్లే అవుతుంది. "ఏ  నాన్నా? నీకు ఇష్టమేనా ." . "అమ్మానిర్ణయం నాది ఒక్కడిదే కాదు, మధు ని కూడా అడగాలి కదా ? ". "అమ్మా, మధూ ?". మెట్ల పక్కన నిలుచి ఉన్న మధు. "అమ్మాయికి నేను చెప్పాను రా. మీ ఇద్దరూ  మాట్లాడుకోండి. తరువాతే మీ నిర్ణయం చెప్పండి."  నాన్న అన్నాడు "అమ్మా, మా ఉదేశ్యం నీకు అర్ధం ఐంది అనుకుంటున్నాను, సరే పద ఆలస్యం ఐంది , పడుకుందాం. " 

నా ఇంకో జీవితానికి నాంది పడింది. ఇద్దరం మాట్లాడుకొని, నా 3 నెలల ఆన్సైట్ తరువాత ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం.

  

*** ఇది నా ఆలోచన మాత్రమే. నిజం కావడం కష్టం కాదు, నిజం చేసుకోవడం కష్టం *****






ఓ రోజు కళ్ళు తెరిచిన ప్రపంచం ఉలిక్కిపడింది.

ఇంటి ముందు ఉండాల్సిన ఒక్క చెట్టు లేదు. వేళ్ళతో సహా పెకిలించినట్టు ఓ పెద్ద గుంత. అందరి ఇళ్ళ ముందు అదే పరిస్థితి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అడవులు కూడా మాయం అయ్యాయి. పచ్చదనం మచ్చుకు కనిపించడం లేదు.  ప్రపంచం మొత్తం ఇంతే జరిగింది.


అదొక్కటే కాదు ఒక్క జంతువు లేదు. ఒక పక్షి లేదు. చెరువుల్లో,కుంటల్లో నీళ్ళు లేవు. సముద్రాలలో నీరు కూడా మాయం అయి అందులోని లోయలు, పర్వతాలు బయట పడ్డాయి. నీళ్ళలో ఉండే చేపలు కూడా కనిపించకుండా వెళ్ళిపోయాయి.  ఎవరెస్ట్ శిఖరం కన్నా పెద్ద దైన పర్వతం బయటపడింది ఓ చోట.




మనుషులు, యంత్రాలు మాత్రమే మిగిలిపోయాయి. అంతా  నిశ్శబ్దం, కాదు శూన్యం . ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. మనుషులు చచ్చిపోతూ ఉన్నారు ఒక్కొక్కరిగా.

ఎప్పుడు పెద్దగా పట్టించుకోని, ఇష్టానికి కలుషితం చేసే గాలి ఇప్పుడు కావాలినిపించింది. ఆ గాలిని ఇచ్చే పచ్చటి చెట్లు కావాలనిపించింది. పక్షుల కిల కిలలుకరువయ్యాయి. అంతా శూన్యం. సూర్యుడు వేడిగా నిప్పులు చెరుగుతున్నాడు. పెద్ద పెద్ద భవంతులు, వందల మీటర్లు ఎత్తున్న అపార్ట్ మెంట్ లు, కోట్ల విలువచేసే కార్లు,నగలు, డబ్బు, కంప్యూటర్ లు,సెల్ ఫోన్లు, అంతా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు వెక్కిరిస్తూ ఉన్నాయి.

దాహంతో నోరుఎండి పోతూ  ఉంది. తినడానికి కళ్ళ ముందు ఎన్ని ఉన్నా, తిరగడానికి పెద్ద పెద్ద కార్లు ఉన్నా, ఇంటి నిండా  బ్లాక్  మనీ, వేల కోట్ల ఆస్తులు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. ఇపుడు అందరు ఒకటే, అందరి ఆశా ఒకటే. ప్రకృతి మళ్ళీ వెనక్కి రావాలి. పచ్చని చెట్లు కావాలి, స్వచ్చమైన గాలి కావాలి, నీళ్ళు కావాలి ఇంకేం వద్దు.

పెద్దన్న గా చెప్పుకునే దేశంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేరే దేశాల్లోను పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మనిషి ఎంతో విలువైనవి గా భావించే వన్నీ అల్పంగా కనపడుతున్నాయి. కళ్ళ ముందే కుటుంబసభ్యులు, ఆప్తులు, స్నేహితులు చచ్చిపోతున్నారు. చావు దగ్గరకి చేరిన కళ్ళలో తప్పు చేశామన్న భావన నీడలా కదులుతూ ఉంది. అంత స్మశానం, యుగాంతం.

తల్లి లాటి ప్రకృతిని తార్చిన బిడ్డలని వదిలి ఆ తల్లి తన దారి తను చూసుకుంది.. అవును ఆమె వెళ్ళిపోయింది.






ఉఫ్, అమ్మా. రొప్పొస్తంది. ఆడ దాకా పోతానో లేదో. పెతి సారీ ఇట్నే అనుకుంటా, మొత్తానికి పోతా. ఈసారెందుకో వల్ల కావడం లా అంటూ పైకి చూసాడు తిరపస్సోమి. దూరాన గాలిగోపురానికి ఉన్న నామాలు నవ్వుతూ కనిపించాయి. తెల్సిన మనుషులు పలకరించినట్టుంది. మళ్ళీ ఓపిక తెచ్చుకొని అడుగు వేస్తూ ఉన్నాడు. ఉహు,  వల్ల కాడంలా. వయసైపోయింది కదా. ఉరామారిగ్గా 60 ఉండవూ, ఎల్లవ వచ్చినపుడు పుట్టానని అంటుండేది మా ముసల్ది. ఏడుకొండల వాడా వెంకరమణ గోవిందా గోవింద అప్రయత్నం గా నోట్లోంచి వచ్చేసింది. ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా   గోవిందా .
మజ్జాన్నం వచ్చా అలిపిరి కాడ్నుంచి ఇంకా ఈడ్నే ఉన్నా. కాసేపు కూసుంటే కానీ కదల్లేను అనుకుంటూ ఓ రాయి కి జరిగిలపడ్డాడు. పోతా ఉన్నారు పైకి జనాలందరూ. ముసిలోళ్ళు, కుర్ర పిలకాయలు, పసి బిడ్డలు. ఒక్కోర్ది ఒక్కో మొక్కు. కొత్తగా పెళ్లైనట్టుంది, పెళ్లి బట్టల్లో పోతన్నారు ఓ జంట. ఇంకో మొగుడు పెళ్ళాలు, బిడ్డని మెడ మీద కూసోబెట్టుకొని గోవింద నామాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకో కుర్ర పిల్లలు ముగ్గురు ఒకరు పసుపు, ఇంకొరు కుంకుమ, సివర పిల్ల కర్పూరం బెట్టి ఎలిగిస్తా ఉంది. అందరు వెళ్ళేది ఆయన కాడికే. నేనెప్పుడు వచ్చా మొదటి సారి?
ఎప్పుడ్నుంచో జుట్టు పెంచిన మా నాయన ఓ పాలి మొక్కు తీర్చుకోడానికి తిరపతి పోదామని గొడ్లని ఈరాసోమి కి అప్పజెప్పి మర్నాడు ఇంట్లో పూజ చేసి, మేళం పెట్టుకోని ఊరంతా తిరుగుతావుంటే అందరు వారు పోసి, దండం పెట్టి డబ్బులేసారు. అదేదో బలే ఉన్నింది అప్పుడు. ఆడ్నుంచి టేసన్ కాడికి వచ్చి రైలు రాక సానా సేపు ఎదురుచూశాం. మా అమ్మ చేసిన పులిహోర తింటా కూసున్నం.  రైలు వస్తాంటే ఎదో పెద్ద సంబడం. అదే ఫస్టు సారి రైలెక్కడం. అందరు గుంపులు గుంపులుగా తోసుకుంటా ఎక్కేరు. యాడ్నో కాస్త సోటు దొరికితే పిల్లోడ్ని అని కూసోబెట్టారు నన్ను. అదేదో ముసిల్దానిలా సిన్నగా పోతా ఉంది. యాడ బడితే ఆడ ఆగుతా. అయినా బాగున్నింది. దూరంగా కొండలు ఎవరో పడుకోని ఉన్నట్టు. అదే తిరపతని దింపినారు. గుడి యాడుందో ఎతుకుతా ఉంటె, సాన దూరం అని జెప్పినాడు మా నాయన. ఆడ నుంచి నడవాలంట. నేను మా నాయన, అమ్మ, మా సిన్నయ్య వచ్చాము. ఆడో పెద్ద గోపురం, ఇంకేంది గుడొచ్చేసింది అనుకున్నా. కాదంట అదే మొగదాల అన్నారు . పోతా ఉన్నాం. అడివి ఉన్నట్టుంది. అట్టా నడుసుకుంటా గుంపులు గుంపులుగా జనాలు. గోవింద నామాలతో హోరెత్తిపోయింది.గుండు చేయించుకున్నాం అందరం .  మొత్తానికి నల్లోడి దర్సనం ఐన్ది. అదో గొప్పఅనుభూతి . దేవుడంటే దేవుడే. నల్లటి మొహాన తెల్లటి నామాలు, చిన్నగా నవ్వుతు ఉండే మొహం. 

ఎప్పున్నా ఎవురన్న తిరపతి పోతంటే ఆళ్ళ కూడా పంపే ఓళ్ళు నన్ను . పెళ్లై నా కూతురు పుట్టినాక, మొక్కుకున్నా వస్తానని .  ఆడ్నించి పట్టుకుంది నాకీయావ. పెతేడు రావాల, ఆయన్ని సూడాల అని.  అప్పట్నుంచి పెతేడు నడిచే వత్తన్నా. కూతురుకి పెళ్లై  పొయిన్ది. మా ఆడది జబ్బు చేసి సచ్చిపోయింది . ఒక్కడనే, గొడ్డు కాయడం. ఉన్న కాత్తె పొలం సూసుకోడం . నాకు తొందరగానే ముసిల్తనం వచ్చేసినట్టుంది . నడవలేకపోతున్నా. 
"గోవిందా ఆ ఆ  గోవిందా " ఎవరో నన్ను లేపారు.. మళ్ళీ నడుస్తూ ఉన్నా... చీకటి పడుతుంది.జనాలు పల్చబడతన్నారు . నాకు ఎగసోస గా ఉంది. మొండికేసి నడుస్తానే ఉన్నా. మొక్కు తీర్చుకుంటానా ? ఏదో దిగులు. కాసేపటికి గుండెలో మంట, దడ. ఆగుదామని కూర్చున్నా . ఊపిరి అందడం లా. గొంతు పట్టేసినట్టుంది.ఎక్కిళ్ళు వచ్చాయి. దూరంగా నామాలు నవ్వుతూ ఉన్నాయి. మొక్కు తీరలేదు, అదే గమనం లో ఉంది. నల్లవాడి నవ్వు పిలుస్తూ ఉంది.  

ముందు వెళ్తున్న పెద్దాయన హఠత్తుగా కూలబడ్డాడు. దగ్గరకెళ్ళి కదిపి చూస్తే,తల వల్చేసాడు. ఖంగారు పుట్టింది. లేదు, అప్పటికే ప్రాణం పోయింది. ఎం చేయాలో తోచలేదు. అందరూ  గుమిగూడారు. పైన చాయ్ అమ్ముతున్న ఓ కుర్రాడిని  అడిగితే పోలీసులు ఉంటారు కొంచెం ముందుకు వెళితే చెప్పమన్నాడు . ప్రాణం ఉసూరుమంది . ముందుకు వెళ్లి పోలీసులకి చెప్పాను . వాళ్ళు నిట్టూర్చి కదిలారు. 



అమ్మమ్మ వాళ్ళ ఊరంటే నాకు గుర్తొచ్చేది ఏటి(పాలేరు) దగ్గర చేను, అక్కడ తాటి కర్ర, తేగలు, రోడ్డు పక్కనే ఉన్న మాగాణి, అక్కడ కూర్చుని లెక్కబెట్టిన బస్సులు, లారీలు. పక్కనే ఉన్న అమ్మ వారి గుడి. దూరంగా పొదల్లో కనిపించి భయపెట్టే వీరభద్రుడి గుడి. ఇంకా రైల్వే ట్రాక్ పక్కన పొలాన కూర్చుని లెక్కబెట్టిన గూడ్స్ రైలు పెట్టెలు, రైల్లో వెళ్ళే వాళ్ళకి చెప్పిన టాటాలు. ఊరికి అవతల దూరంగా ఉండే పెద్ద బడి, ఊర్లో ఉన్న అంగన్వాడి.. ఊరి నిండా ఉన్న గుడులు. ఇవన్నీ ఒక ఎత్తైతే, తాతయ్య దగ్గర పడుకొని విన్న కథలు, పొద్దున్నే ఆయన వడిలో దుప్పటి చుట్టుకొని కూర్చున్న రోజులు. అమ్మమ్మ వండే మెత్తాళ్ళ కూర, రొయ్యల పొడుం,ఎర్రగా కాచి తోడు వేసిన గడ్డ పెరుగు. పెద్ద మావయ్య డ్రామాలు వేసినప్పుడు కింద నేను వేసిన డాన్సులు. శీను మావయ్యతో ఏటి పక్కన చెట్ల కింద కూర్చొని తిన్న తాటి ముంజలు, తేగలు, బురి గింజలు, మావయ్యతో సైకిల్ మీద ముందు కూర్చుని స్పేడ్ గా ఫాస్ట్ గా అని అరిచిన రోజులు..... దాచుకోడానికి గుండె నిండా జ్ఞాపకాలు.

నేను పుట్టింది అక్కడే. నన్ను చంకన వేసుకొని తిప్పని వాళ్ళు లేరు అంట. ముందుగా అమ్మ కన్నా పిన్నే నన్ను పెంచింది.నన్ను సాయంత్రం వేళకి తయారు చేసి తల నిండా పూలు పెట్టి, దిష్టి చుక్క తో సహా గుడి దగ్గరకి తీసుకు వెళ్తే అందరు ఎత్తుకునేవాళ్ళు అంట. "బాగా బరువుగా ఉండే వాడివి రా, చేతులు మార్చుకుంటూ తిప్పల్సి వచ్చేది" అనేది పిన్ని.  ఓ రోజు అంకమ్మ గుడి దగ్గరకి వెళ్తుంటే ఎవరో లాటరీ అని చెప్తే 75 పైసలు కడితే నా పేరు మీద ఓ పెద్ద ఆంజనేయ స్వామి పటం వచ్చిందంట. దాన్ని ఇప్పటికీ ఇంట్లో  పెట్టారు. వెళ్ళినప్పుడు ఆయనకి కనపడకుండా రాను. ఏమో నాది అని గట్టి నమ్మకం. ఆ ఇంటికి,  మా ఇంటికి మొదటి బిడ్డ ని కావడంతో అందరు ముద్దుగానే చూసుకున్నారు. పిన్ని, పెద్ద మావయ్య, చిన్న మావయ్య, అమ్మమ్మ, తాతయ్య ఇలా అందరూ. అమ్మమ్మ అయితే "తిరిపిగాడు" (తిరుపతి స్వామి అంట, ఇలా అయితే అందరు నన్ను స్వామీ స్వామీ అని పిలుస్తారంట)అని పిలుచుకునేది. అందరూ అలానే పిలిచేవాళ్ళు.

మా ఇంటి ముందు రెండు పెద్ద కొబ్బరి చెట్లు, ఓ పెద్ద నీళ్ళ తొట్టి ఉండేది. ఇంటి ముందు బర్రెలు కట్టేసే వాళ్ళు. ఆ కొబ్బరి చెట్ల మీద కాకులు తెచ్చి పడేసిన బాదాం కాయలు ఏరుకొని పగలకొట్టుకొని తినడం ఓ జ్ఞాపకం. రాజ్యం కొట్టు, వీరయ్య కొట్టు, హుస్సేన్ కోట్లో తిన్న చిరు తిళ్ళు. ఆ రాజ్యం ఇంకా ఉంది "ఏందయ్యా బాగా పెద్దయ్యావుగా, మమ్మల్ని గుర్తు పెట్టుకున్నావా " అంటూ ఉంటుంది. ఆమె మా అమ్మమ్మ స్నేహితురాలు. ఆ ఊర్లో చాలా గుడులు ఉన్నాయి. శివాలయం, చేన్నకేశవుడి గుడి ఇవి ఊర్లో ముఖ్యమైనవి. ఊరవతల అయితే ముత్యాల గుంట దగ్గర ఉండే గంగమ్మ గుడి, పక్కనే కొత్తగా కట్టిన పోలేరమ్మ గుడి, మగాట్లో ఉండే అంకమ్మ గుడి, దూరంగా ఉండే వీరభద్రుడి గుడి.




చెన్నకేశ స్వామి గుడిలో ధ్వజస్తంభం చిరు గంటల శబ్దం గమ్మత్తుగా ఉండేది. సెంటర్లో ఉండే రచ్చబండ మధ్యలో పెద్ద రావి చెట్టు గల గలలు, ఆ చెట్టు మీద వాలే పిట్టల శబ్దాలతో సందడి గా ఉండేది. చెన్నకేశవుడి గుడిలో ఉండే వాహనాలు పెట్టే గది పాడుబడి ఉండేది. అందులో ఏముందో అని తెగ ఆలోచించే వాడిని. ఇక ముత్యాలగుంట నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ గంగమ్మ గుడి కి వెళ్ళడం ఓ ఆనందం. అక్కడకి వెళ్ళాక మాత్రం గంగమ్మ ని చూడ్డానికి భయం. ఎప్పుడూ తలుపులు మూసి ఉండేవి. ఎవరైనా ఎత్తుకుంటే, పాకులాడుతూ చూస్తే ఇంత పెద్ద వెండి కళ్ళతో నాలుగు చేతులతో నన్నే చూస్తూ ఉన్నట్టుండేది. ఏదో భయం "ఆ ఆ చూసేసా" అని దూకేసే వాడిని. ఇక మాగాట్లో ఉండే అంకమ్మ గుడి దగ్గర నీళ్ళ కొలను లో ఉండే తామర పూలు చూస్తే, అలా చూస్తూ ఉండే వాళ్ళం. పిల్లిపెసర కాయలు తింటూ ఆడుకునే వాళ్ళం. పెద్దోళ్ళు ఓ కథ చెప్పే వాళ్లు "పోద్దుబోయాక, పోలేరమ్మ తల్లి బంగారు చేట, చీపురు తీసుకొని, నెట్టి మీద నిప్పుల కుండతో గ్రామ రక్షణ కి బయల్దేరుతుంది" అని. అందుకే గుడి కి  దూర దూరంగా తిరిగేవాడిని. మగాట్లో కూర్చుని మేం ఆడుకునే ఆట, రోడ్డు మీద వచ్చే పోయే బళ్ళని లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అటు వెళ్ళేవి నీవి, ఇటు వచ్చేవి నావి అని "చూడు నా లారీ ఎంత బావుందో... రేయ్ నీకు కుక్కమూతి లారీ వస్తుంది" అని గోల గోల.

మా తాతయ్య, మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు. తెల్లటి రంగు, ఎప్పుడు తెల్లటి బట్టలు, పై పంచ, చేతిలో పొన్ను కర్ర. నా హీరో. అమ్మమ్మ లక్ష్మమ్మ. పెద్ద బొట్టు, ముక్కు పుడక, చెవులకి పెద్ద కమ్మలు, దేవుడంటే భక్తి, అమాయకత్వం. ఇంటికి వచ్చిన ఎవర్ని భోజనం పెట్టకుండా పంపని తత్త్వం. లచ్చుమ్మ మహాతల్లి రా అనిపించుకునేది. మా ఇంట్లో ఎప్పుడూ రెండు జతల ఎద్దులు ఉండేవి. వాటికోసం రంగు రంగుల చిక్కాలు, గంటలు, నల్ల తాళ్ళు, చెర్నాకోల లు ఉండేవి.

ఇంకా బాగా నచ్చేది పరవట పొలం అదే ఏటి కాడ చేను. ఆ చేను మా తాతయ్య కష్టం. చాలా కష్టపడి ఓ పదెకరాల ముక్క చేసాడు ఆయన. ఆ పొలం చుట్టూ తాటి కర్ర, వెదురు గూములు ఉండేవి. ఎప్పుడు వాటి నిండా కోతులు ఉండేవి, ఒకటి అరా కాదు గుంపులు గుంపులుగా. వాటిని తోలడానికి, భయపెట్టడానికి తాతయ్య దగ్గర వడిసేల ఉండేది. దాన్ని తిప్పుతుంటే అదో ఆశ్చర్యం. నేను కూడా ఓ చెయ్యి వేసే వాడిని, అది తిరిగి తిరిగి నాకే చుట్టుకునేది. ఏటి వడ్డున కూర్చుని చిన్న మావయ్య తో ముంజలు కొట్టించుకు తినడం ఓ మధురానుభూతి. ఇప్పటికి ఎండాకాలం నాకది గుర్తు చేస్తూ ఉంటుంది. తినడం అయ్యాక ఏటి లో స్నానాలు, చేపలు పట్టడం. కాళ్ళకి చెప్పుల్లేక పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు నీడకి చేరడం.

కొంచెం ఊహ తెల్సాక, మా ఊరికి వచ్చేసాను. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మా ఊరి నుంచి నడిచే వెళ్ళాలి. దాదాపు పది కిలోమీటర్లు. దాదాపు పదో తరగతి దాకా నడిచే వెళ్ళే వాళ్ళం. అలా వెళ్ళడం ఓ సాహస కార్యక్రమం. పొలాలన్నీ చవకలు, జామాయిల్ వేసి కారడవి లా ఉండేది. అందులో అడవి పందులు గుంపులు గుంపులు గా తిరుగుతుండేవి. ఓ సారి నాన్నతో ఎద్దుల బండి మీద వెళ్తుంటే, నాన్న తాటి చెట్టు మీద కూర్చున్న గ్రద్ద ని చూపించాడు. అదే మొదటి సారి నేను బయట గ్రద్ద ని చూడ్డం. పొలిమేర లో వెళ్తుంటే, ఏదైనా చచ్చిన బర్రేని పడేస్తే రాబందులు గుంపులు గుంపులు గా వచ్చి వాలేవి. ఎద్దుల బండి తాడు చేత్తో పట్టుకొని నేనే తోలుతున్నట్టు ఆనందపడేవాడిని. చెరువు మొదట్లో కి వెళ్లి పిలిస్తే పలికే చెలమయ్య తాత. ఊర్లో ఉండే మా అమ్మ స్నేహితురాళ్ళు, నాకు అత్తలు ఐన సుశీల అత్త, రాజ్యం అత్త,బుజ్జత్త... ఎప్పుడు వెళ్ళినా పలకరించే అనసూయమ్మ అమ్మమ్మ. ఇంకా బోలెడంత మంది చుట్టాలు.

ఆ ఊరికి ఉన్న మరో పెద్ద ఆకర్షణ చెరువు. కొన్ని వందల ఎకరాలు విస్తీర్ణంలో పరుచుకొని ఉంటుంది.ఎక్కువగా  మాగాణి పొలం ఉండడం వలన వరి చేలతో నిండి ఉండేది.

మా పెద్ద మావయ్య బాలయ్య అభిమాని, యధావిధిగా నేను కూడా. చిన్న మావయ్య చిరంజీవి అభిమాని, ఆ అభిమానంతోనే మా పిన్ని కొడుకు చిన్నోడికి చిరంజీవి అని పేరు పెట్టారు. మా మావయ్యల స్నేహితులు రాజుగారి శీను, పంతులు, పుల్లేక.

ఈ ఏడు అమ్మమ్మ చనిపోయింది, రెండవ సారి కాన్సర్ సోకి. ఏమో ఎందుకంటారో అమ్మమ్మ వాళ్ళ ఊరు అని, అమ్మమ్మ లేనప్పుడు ఏముంటుంది.