ముందు భాగాలు 
1.http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_6126.html
2.http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_30.html
3.http://aakaasavaani.blogspot.in/2014/01/blog-post_15.html


ఓ మూడు నెలలు ఆన్సైట్ పని మీద వంశీ ని వాళ్ళ కంపెనీ ఇంగ్లాండ్ పంపించింది. పనులన్నీ అలా జరిగిపోతూ ఉన్నా, మనసంతా ఒకటే ఆలోచన "ఇది ఎంత వరకు సమంజసం, నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా". ఇంగ్లాండ్ రాక మునుపు తన భార్య తో ఈ విషయం మీద చర్చించాడు. తను అంత సుముఖంగా లేదు అని తెల్సింది మాటల్లో. ఎవరికైనా ముందుకు వెళ్ళడం కావాలి కానీ,వెనక్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడతారు. మధు చెప్పింది ఒకటే, పల్లెటూరికి వెళితే పుట్టే పిల్లలకి చదువు, మంచి సౌకర్యాలు ఎలా అని? మ్మ్, నిజమే.


జన్మనిచ్చిన తల్లితండ్రులకన్నా, జన్మించబోయే పిల్లల కోసమే అందరు ఆలోచిస్తారు. రెక్కలు రాని పక్షులకి, రెక్కలుడిగిన పక్షులకి వేటికి ఆసరా కావాలి?


వంశీ తీసుకున్న ఈ నిర్ణయానికి అప్పుడే ఆటంకాలు మొదలయ్యాయి. మధు వాళ్ళ బంధువుల్లో, వంశీ వాళ్ళ బంధువుల్లో అప్పుడే సలహాలు, సూచనలు మొదలయ్యాయి. కొందరు పరోక్షంగా అంటూ ఉంటే, కొందరు మధుతో, వంశీ తో అనసాగారు. "ఏమయ్యింది, బంగారం లాంటి ఉద్యోగం వదిలి ఏమి ఉద్ధరించడానికి ఇక్కడకి రావడం", ఇంకా చాలా. సమాధానం, సంజాయిషీ చెప్పుకుంటే వెళ్తే  ప్రతి వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అన్నింటికీ సమాధానం నవ్వు, మౌనమే అయింది.

రోజులు దగ్గరకి వస్తున్నాయి. మధు ఖంగారు గా ఉంది. "తప్పదా,వెళ్ళాలా?" అంది వంశీ తో. మధుని దగ్గరకి తీసుకొని అన్నాడు వంశీ " మధు, భయపడుతున్నావా? ఇలాటి సౌకర్యాలు , ఇపుడున్న జీతం ఉండవంతే. మిగతావన్నీ ఇస్తానన్న నమ్మకం నాకుంది. నీకు ఏ లోటు రానివ్వను మధు". "నాకు ఇష్టమేనండి, ఎదో భయం" అంటూ హత్తుకుపోయింది. 

 ఓ రోజు మధు గారి నుంచి ఫోన్, హైదరబాద్ లో ఉన్న హెడ్ఆఫీసు దగ్గరకి వచ్చి కలవమని. శనివారం వెళ్లి కలిసాడు. మధు గారితో కాసేపు మాట్లాడాక, మాటల్లో ఆయనే అన్నారు " వంశీ, ఓ సారి ఆలోచించుకో. ఇలా చెప్పి నీ నిర్ణయం మార్చుకోమనో లేక నిన్ను నిరుత్సాహ పరుద్దామనో కాదు. చల్లగా బ్రతికే వాళ్ళు ఇక్కడకి వచ్చి ఇబ్బంది పడతారేమో అని. నువెంతో అలోచించి కానీ ఈ నిర్ణయం తీసుకోని ఉండవు. ఎందుకో చెప్పాలనిపించింది" అని వంశీ వంక చూసి " వెళదాం పద" అంటూ ఆఫీస్ లోకి దారితీశాడు.

లోపల ఒక టీం కూర్చుని ఉంది. మధు గారు వాళ్ళకి పరిచయం చేసి వెళ్ళిపోయారు. కొందరు వింతగా చూడటం,వంశీ ద్రుష్టిపథంలోంచి తప్పి పోలేదు. తన పని గురించి, అక్కడ ఉన్న సమస్యల గురించి వివరించారు. జీతం గురించి కూడా మాట్లాడారు. ఓ నెల తరువాత చేరతానని చెప్పి వచాడు వంశీ.

ఆన్సైట్ లో మిగిల్చిన డబ్బులతో ఫ్లాట్ లోన్ కట్టేసి, మంచి రేట్ వస్తే అమ్మమని , అప్పటి దాకా ఎవరికైనా అద్దెకు ఇవ్వమని స్నేహితులకి చెప్పాడు వంశీ. మధు ముందుగానే రెసిగ్నేషన్( బాధ్యతల నుంచి తప్పుకుంటునట్టు తెలియజేయడం) కి అప్లై చేసింది.  ముందు మధుని సామాన్లతో సహా ఇంటికి పంపాడు వంశీ. రిలీవ్ ఆయె రోజు వచ్చింది. వినోద్ కలిసాడు. "అన్నా, మన ఉద్యోగం నిజంగానే ఓ పద్మ వ్యూహం. చేరిన దగ్గర నుంచి అన్ని లింకులే. జీవితం రుచి పచి లేకుండా అలా గడిచిపోతుంది. సాటి వాడిగా మన బాధ తెల్సు. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను." అన్నాడు. "థాంక్స్ వినోద్" అన్నాడు వంశీ. ఫ్లాట్ కీస్ స్నేహితులకి ఇచ్చి ఊరికి ప్రయాణం అయ్యాడు.......


"ఎవరు కొనమన్నారు? అవసరమా ఇప్పుడు? ఒక్కమాటైనా చెప్పరా నాకసలు?ఉన్నవి తీర్చుకోకుండా... ", "ఏమని చెప్పాల్రా?"
"లేకపోతే ఏంటి మా?"
"ఇదిగో నాన్నకిస్తున్నా "
"ఏరా?"
"కాదు నాన్నా"
"చూడరా, అవసరం ఉంది.కొడుకువని ఓ మాట చెప్పాను. నువంత ఇబ్బంది పడి డబ్బులు పంపాల్సిన అవసరం  లేదు. ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిది." ఆయన అహం దెబ్బ తినింది. 
"నాన్నా, డబ్బు గురించి కాదు, అక్కడ కాకుండా ఇంకెక్కడైనా కొనచ్చు కదా."
సమాధానం లేదు... 
"సరేరా ఉంటా" అమ్మ గొంతు... 

మళ్ళీ రింగ్ చేశా.... ఎత్తలేదు... 

మనసంతా చిందరవందరగా ఉంది. ఏంటిది? ఎక్కడ తప్పు జరిగింది? నా ఉద్దేశ్యం మంచిదేగా.. ఎందుకు అర్ధం చేసుకోవడంలేదు. విసుగు, కోపం. ఫోన్ తీసి నేలకేసి కొట్టాలనిపించింది. ఎవరి మీద కోపం? అమ్మా నాన్న ల మీదా? కదిలిస్తే గొడవ పడదామని ఉంది. అసలు నా తప్పు లేనప్పుడు, నేను ఎందుకు ఫోన్ చేయాలి? అవసరం లేదు. 

 ఒక రెండు నిముషాలకి నాలో విజ్ఞత మేలుకొంది. ఎందుకు రావాలి నాకు కోపం?నేనేం కష్టపడ్డానని, నాకింత అసహనం? అమ్మానానే కదా? వాళ్ళు పడ్డ కష్టానికి, ఎదుర్కొన్న సమస్యలకి, వయసుకి కోపం వస్తుంది. ఓ మాట అంటారు, పడాలి. మళ్ళీ డయల్  చెసా.. అమ్మ ఫోన్ ఎత్తింది... 

"మా..,నా  ఉద్దేశ్యం అది కాదు "... 
"అవసరంలో ఉన్నామని నిన్ను అడిగాం రా, నీకు వీలైతేనే చూడు. లేకపోయినా పర్లేదు. మేం ఎలాగోలా సర్డుకుంటాం."
"నాన్నున్నాడా?"
"ఆయనకీ మాటాడ్డం ఇష్టం లేదురా,సరే ఉంటా" ఫోన్ డిస్కనెక్ట్ అయింది.. మనసంతా బాధ. గుండె గోడలని లోపల ఎవరో పట్టుకొని రక్కుతున్నట్టుంది.  

వీర్రాజు, చిన్నమ్మ ల  కొడుకు  శంకరం. ఒకడే కొడుకు. చదువుకొని పట్నం లో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం లో అనుబంధం ఎక్కువ. వీర్రాజు, చిన్నమ్మ లు ఊర్లోనే ఓ చోటు కొన్నారు. కొంటున్నామని శంకరానికి ఓ మాట చెప్పారు. కొనాలా వద్దా అని అడగలేదు. ఉన్న డబ్బే కాకుండా, కొంత బయట తెచ్చి ఆ చోటు కి కట్టారు. శంకరానికి మనసులో ఎక్కడైనా టౌన్ లో కొంటె బాగుంటుంది కదా అని ఆలోచన. ఉత్తరోత్తరా ధర పెరుగుతుంది కదా! పల్లెటూర్లో ఏముంటుంది అనిపించింది. సరే అమ్మానాన్నల ఆలోచన కాదనలేకపోయాడు. ఇప్పుడు బ్యాంకు లో ఎప్పుడో తీసుకున్న లోన్ తాలుకు బాకీ కట్టమని బ్యాంకు వాళ్ళు నెత్తిన కూర్చున్నారు. వీర్రాజు కి ఎం చేయాలో పాలు పోలేదు. తన దగ్గర ఉన్నది,తెల్సిన వాళ్ళ దగ్గర తీసుకొని ఆ చోటు కి కట్టాడు. ఇప్పుడు తన దగ్గర లేవు. బ్యాంకు వాళ్ళు ఇంటికి వస్తే పరువు పోతుంది. ఎప్పుడు కొడుకుని నోరు తెరిచి అడగని వాడు, డబ్బు ఏమైనా ఉందేమో చూడమని అడిగాడు. శంకరం దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ తనకి చెప్పకుండా ఇలాటి నిర్ణయం తీసుకున్నారే  అన్న ఉక్రోషం. ఆపుకోలేక అనేసాడు. ఈ మాటలు వీర్రాజు ని బాధపెట్టాయి. నిజమే కదా, ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటె బాగుంటుంది అనిపించింది వీర్రాజు కి. వాడితో మాట్లాడాలంటేనే ఏదోలా ఉంది. మనసు రాలేదు. నా కొడుకు అందరి లాంటి వాడు కాదు అన్న నమ్మకానికి బీటలు వారాయి. కష్టం లో ఉన్నప్పుడు చిన్న మాట కూడా కఠినం గా ఉంటుంది. ఏదైతే అది అవుతుందని వదిలేసాడు. బాధ మిగిలిపోయింది, దిగులు పెరిగిపోయింది. 

ఓ రెండు రోజుల తరువాత వాడు వస్తున్నా అని ఫోన్ చేసాడు. ఎప్పుడు వెళ్లి నేనే తీసుకు వచ్చే వాడిని, కాని మనసు రాలేదు. వాడిని తీసుకురమ్మని బుజ్జోడికి చెప్పాను. చీకటి పడే వేళ కి వచ్చాడు. పసి వాడిలా కనపడే నా కొడుకు పరాయి వాడిలా కనిపించాడు. వాడి నవ్వు వెనక ఏదో స్వార్ధం దాగుందని అనిపించింది. మనఃస్పూర్తిగా మాట్లాడలేకపోయా. చిన్నమ్మ మాత్రం మాట్లాడుతూనే ఉంది. దానికి లోపల బాధ ఉన్న బిడ్డని చూసిన ఆనందం. 
పొద్దున్నే వాడు ఏదో మాట్లాడాలని చూస్తున్నాడు కానీ నేనే ముభావంగా ఉన్నా. ఎంత మాట్లాడలనిపించినా, నా మనసు వెనక్కే లాగుతుంది. ఈ మధ్యన ఏదో సుస్తీ చేసి వాళ్ళంతా ఒకటే నెప్పులు. పడుకొని ఉంటె వాడొచ్చి కాళ్ళు నొక్కాడు. వద్దన్నా వినలేదు. వాడెప్పుడూ చేసే పనే ఇపుడు ఇష్టంగా లేదు. 

నాన్న ముభావంగా ఉండటం అర్ధం అవుతూనే ఉంది.అమ్మ మాత్రం మాట్లాడుతూ ఉంది. అటు నాకు నాన్నకి సర్దిచెప్పడానికి చూస్తుంది.  తప్పు నాదే. నాకు నేనే స్వార్ధపరుడిలా అగుపిస్తున్నా. అక్కడ  ఉన్నప్పటి కోపం కరిగిపోయింది. అమ్మా నాన్నల్ని చూసాక, నేను కాకపోతే ఇంకెవరు తీరుస్తారు. ఇదే కదా బాధ్యత తీసుకోవడం అంటే. అలా తీసుకోనపుడు నేను ఉంటె ఎంత లేకపోతే ఎంత. ఎలా అయినా అమ్మా నాన్నలని మాములుగా చేయాలి. శనగ వేసాం ఈ యేడు. ఎలా మొలిచిందో చూడ్డానికి నాన్నతో పాటు వెళ్ళా. నేనే బండి నడుపుతూ ఉన్నా, నా వెనక నాన్న. "నాన్న, బ్యాంకు వాళ్లతో మాట్లాడావా?". సమాధానం లేదు. "ఈ రోజు వెళ్లి మాట్లాడి వద్దాం". ఎం మాట్లాడలేదు. పొలం వెళ్లి వచ్చాం. ఆ మధ్యలో పొడి పొడి గా నలుగు మాట్లాడాడు నాన్న. అమ్మ కూర్చోబెట్టి సర్దిచెప్పింది నాన్నకి. పిల్లోడు అన్న మాటలు పట్టించుకోవద్దు అని. నాన్న ని తీసుకొని బ్యాంకు కి వెళ్లాను. ఆఫీసర్ తో మాట్లాడి ఎంత కట్టాలో కట్టి వచ్చా. ఏదైనా బ్యాంకు విషయాలు ఉంటె, నాకే ఫోన్ చేయమని వచ్చా . నాన్న తేలికపడ్డాడు. మరుసటి రోజు పొగ చేను దున్నటం. కలుపు పోవడానికి. నేను కూడా వస్తా అని చెప్పా. ఎద్దులు తోలుకొని, రెండు అడ్డ లు వేసుకొని వెళ్లాం. దాదాపు 7 ఎకరాలు, రెండు రోజులు పట్టింది. నాన్న మామూలు ఐపోయాడు. ఎప్పటిలా మాట్లాడుతున్నాడు.తన బాల్యం, ఆయన పడ్డ కష్టం, ఆడిన ఆటలు చెప్తున్నాడు. అవన్నీ నాకు తెల్సినవే.కానీ మా నాన్న చెప్తున్నట్టు లేదు, నా కొడుకు చెప్తున్నట్టుంది. మనసు పొరల్లో నిండిన పొగ మంచు విడిపోయింది. అలవాటు తప్పి చేతులుపోటు పుడుతున్నా నాన్నతో కలిసి పని చేయడం సంతోషమనిపించింది . నాన్న కూడా బాధ పడ్డాడు, నా చేత పని చేయిస్తున్నందుకు. ఆ నొప్పులు, కష్టం ఆయన ప్రశాంతత ముందు ఓడిపోయాయి. నాకు సంతృప్తి ని మిగిలిచాయి.  

 చిన్నమ్మ కొడుకుని చూసుకొని సంబరపడిపోయింది. నా మనసులో కూడా గర్వం. తొందరపడి వాడిని అపార్ధం చేసుకున్నానేమో అనిపించింది. కాని ఈ సంఘటన మమ్మల్ని ఇంకా దగ్గర చేసింది. శంకరం సంతోషంగా ఊరికి వెళ్ళిపోయాడు. 




" ఏది కావాలో తెల్సినపుడు, ఏది వదిలేయాలో తెల్సి వస్తుంది"

మొదటి రెండు భాగాల కోసం.... 
1http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_6126.html
2. http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_30.html

రాత్రి బస్సు ఎక్కగానే అమ్మ ఫోన్ చేసింది, ఉదయం 5 ఆ ప్రాంతం లో దిగుతారని. పడుకునే సరికి ఆలస్యమైంది. ఓ గంట నిద్ర పోయి ఉంటా, ఇక నిద్ర పట్టలేదు. పది నిముషాలకి ఓ సారి మెలుకువ వస్తుంది. అమ్మ వచ్చినట్టు, నేను లేచి వెళ్తున్నట్టు... ఇలా. 3 నుంచి 5 అవడానికి పది గంటలు పట్టింది.  ఇక నిద్రపట్టక బస్టాండ్ కి వెళ్లాను. ఓ అరగంట తరువాత వచ్చింది బస్సు. అమ్మ, నాన్న  డోర్ దగ్గరే నిలుచుని ఉన్నారు. అమ్మ అక్కడ నుంచే చేయి ఊపుతూ. దిగగానే చెంపలు నిమిరి నీళ్ళు నిండిన కళ్ళతో చూసుకుంది. తెలీకుండానే నా కళ్ళలో నీళ్ళు. సామాన్లు దింపుతున్నా నాన్న మమ్మల్ని చూస్తూ ఉన్నారు. నాకు నాన్నకి సాయం చేయాలనీ ఉంది, కాని అమ్మని చూస్తు అలానే నిలుచుని ఉన్నా. "ఆటో పిలవరా" నాన్న. అప్పటికే చుట్టూ చేరిన ఆటో వాళ్లలోంచి ఒకరిని పిలిచి ఇంటికి వచ్చేసాము.నాన్న ఆటో లో వస్తే అమ్మనాతో బైక్ మీద. నా భుజం మీద చేయి వేసిన అమ్మ స్పర్శ లో ఏదో తెలియని భరోసా. 

అమ్మ, మధు తినడానికి తెచ్చినవి సర్దుకుంటూ ఉంటే నాన్న, నేను కలిసి షటిల్ ఆడటానికి వెళ్లాం. నాన్న ఊర్లో విషయాలు, మారుతున్న పద్ధతులు, మనుషుల ఆలోచనలు చెప్తున్నాడు. మార్పు సహజం , కానీ ఆ మార్పు మనుషుల మధ్య సంబంధాలని విచ్చినం చేస్తూ ఉంది. ఒకప్పుడు వ్యవసాయ కోసం తవ్వుకున్న కుంటల్లో ఉన్న నీళ్ళను తెచ్చుకుని తాగే వాళ్ళం . అవి చాల బాగుండేవి. నీళ్ళు అంటే అవే అనే అనిపించేది. "ముత్యాల గుంట లో నీళ్ళు వాడుతున్నారా నాన్నా?", "ఇపుడెవర్రా? అందులో వెంకటస్వామి పడి చచ్చిపోయాడు." ఆశ్చర్యం, ఓ రకంగా మాకు చుట్టాలు కూడా అవుతారు. "దేనికి?" "ఏముంది రా, వయసొచ్చిన కొడుక్కి ఆస్తి పంచకపోవడం ఆయన తప్పయితే, సంపాదించుకున్నది ఉన్నా కూడా ఆస్తి పంచలేదని వయసైపోయిన తండ్రిని చూడని కొడుకు. ఎవర్నీ తప్పు పట్టలేం". ఓ నిట్టూర్పు. ఎం జరుగుతుంది. 


ఆ రోజు అందరం కలిసి బయటకి వెళ్లాం. అమ్మ,మధు చీరలు కొన్నారు. నాన్నకో చలికోటు. అమ్మ నాకు గాగుల్స్ కొనిచ్చింది . అక్కడ నుంచి రెస్టారెంట్ కి వెళ్లాం. ఏదో తెలియని నిండుతనం, సంతృప్తి. ఇంటి మీదకి వెళ్లి కూర్చున్నాం. అపుడే ఎండాకాలం మొదలౌతుంది. పౌర్ణమి నిన్ననే ఐపోయింది, చంద్రుడు మెల్లగావెన్నెల జల్లుతూ వస్తున్నాడు. పక్కన ఉన్న లేక్ మీద నుంచి చల్లని గాలి.   "ఉద్యోగం ఎలా ఉంది రా?", "బావుంది నాన్నా!". "ఇష్టంగానే చేస్తున్నావా?","ఇష్టం తో సంబంధం లేదు నాన్నా, మా చదువుకి, మేము చేయగల ఉద్యోగం ఇదే. ఇది తప్ప ఏం చేయలేం, వేరే పని చేత కాదు.". "నీలో ఏదో నిరాసక్తి రా. ఇంతకు ముందెన్నడూ చూడలేదు ". మౌనం నా సమాధానం ఐంది. నాన్నే కొనసాగించాడు "ఉద్యోగం చేయడం తప్పు కాదు రా, కాని దారిలో నిన్ను నువ్వు కోల్పో కూడదు. నిజమే, మేము నిన్ను పెంచినపుడు నువ్వు మాతో ఉంటావని, ఉండాలని పెంచలేదు.ఎక్కడ  ఉన్నా బాగుండాలని అనుకున్నాం. కానీ సంపాదన మనుషుల్ని , మనసులని చంపేస్తుంది ఏమో రా. సంపాదన అవసరం కానీ, దానికోసం జీవితంలో నిర్లిప్తిత, నిస్పృహ నిండిపోకూడదు. ఏదోలా బ్రతకడం వేరు, ఆ జీవితాన్ని ఆస్వాదిస్తూ బ్రతకడం వేరు. ఇలానే ఉంటె రేపు నీ పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వగలవేమో కానీ వాళ్ళకోసం సమయం పెట్టలేవు. వాళ్లతో గడపలేవు. నాన్నని చూస్తూ పిల్లలు పెరగాలి కానీ నాన్న చేస్తుంటే తిని పెరగకూడదు . ఇక్కడ ఉండి అమ్మాయి,నువ్వు కల్సి సంపాదిస్తున్నది మీరు కొన్న ఫ్లాట్ కి, మీ ఖర్చులకి సరిపోతుంది. రేపు మీ పిల్లలు వస్తే మీరు ఇంకా సంపాదించాలి. ఇపుడు ఖర్చులు అలానే ఉన్నాయి. ఆ ఒత్తిడి ని తట్టుకొని నిలబడి గెలవాల్రా . ఎందుకు ఆ ఒత్తిడి ని అనుభవిస్తున్నవో, ఓ సారి ఆలోచించు. మేం చేసిందే మీరూ  చేస్తున్నారు. మేము సంపాదిచేప్పుడు ఇబ్బందులు పడ్డాం రా, అది కుటుంబం తరువాతే. నాకు తెల్సు , నీకు చెప్పాల్సిన అవసరం లేదు. " ఒక్క నిముషం ఆపాడు. చంద్రుడు పైకి వచ్చాడు. చల్లని వెన్నెల. లేక్  అవతల లైట్లు, లేక్  మీద మెరుస్తూ ఉన్నాయి. 

నాన్నచెప్పడం మొదలు పెట్టాడు. "మధు గారు తెల్సు కదా? అదే మన రిలయన్సు లో పని చేస్తారు. మొన్న మాటల్లో అన్నారు, మన జిల్లా లో ఆ ఏరియా సేల్స్ మేనేజర్ కావాలంట. ఏం  చేయాలంటే, రైతులతో మాట్లాడి వాళ్ళ చేత కూరగయలు లేదా ఏదో పంట, వీళ్ళ పద్ధతుల్లో పండిస్తే ఆ పంట ని వీళ్ళే కొంటారు. నీతో పాటు ఇంకొందరు ఉంటారు. మన జిల్లలో రైతులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి,  అది అంతా  నువ్వు చూసుకోవాలి. అది ఈ మధ్యనే మొదలు పెట్టారు. అన్నీ కలిపి ఓ ముప్పై వేల దాక రావచ్చు. నీకు ఇష్టం ఉంటె నేను మాట్లాడతాను . వచ్చేస్తావా ?" నాన్న నా కళ్ళలోకి చూడడం  లేదు. నాకు అర్ధం అవుతుంది, ఈ మాట చెప్పడానికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో.   ఆ మాట విన్నప్పుడు నాకు అంతా స్తంభించినట్టుంది. నేను చదివిన చదువు, చేసే ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని తలచుకుంటే  నేనా? అనిపించింది. మరి మధు? ఆలోచనలతో పాటు నా గుండె వేగం పెరిగింది. వెనక చిన్న అలికిడి. మమ్మల్నే చూస్తూ నిలుచుని ఉన్న అమ్మ. దగ్గరకి వచ్చి నా భుజం మీద చేయి వేసింది. ఏదో తెలియని నెమ్మది. చిన్నప్పుడు బాగా జ్వరం వచ్చినప్పుడు అమ్మని చుట్టుకొని పడుకున్నప్పుడు కలిగిన స్వాంతన. అది అమ్మ వల్లే అవుతుంది. "ఏ  నాన్నా? నీకు ఇష్టమేనా ." . "అమ్మానిర్ణయం నాది ఒక్కడిదే కాదు, మధు ని కూడా అడగాలి కదా ? ". "అమ్మా, మధూ ?". మెట్ల పక్కన నిలుచి ఉన్న మధు. "అమ్మాయికి నేను చెప్పాను రా. మీ ఇద్దరూ  మాట్లాడుకోండి. తరువాతే మీ నిర్ణయం చెప్పండి."  నాన్న అన్నాడు "అమ్మా, మా ఉదేశ్యం నీకు అర్ధం ఐంది అనుకుంటున్నాను, సరే పద ఆలస్యం ఐంది , పడుకుందాం. " 

నా ఇంకో జీవితానికి నాంది పడింది. ఇద్దరం మాట్లాడుకొని, నా 3 నెలల ఆన్సైట్ తరువాత ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం.

  

*** ఇది నా ఆలోచన మాత్రమే. నిజం కావడం కష్టం కాదు, నిజం చేసుకోవడం కష్టం *****






ఓ రోజు కళ్ళు తెరిచిన ప్రపంచం ఉలిక్కిపడింది.

ఇంటి ముందు ఉండాల్సిన ఒక్క చెట్టు లేదు. వేళ్ళతో సహా పెకిలించినట్టు ఓ పెద్ద గుంత. అందరి ఇళ్ళ ముందు అదే పరిస్థితి. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అడవులు కూడా మాయం అయ్యాయి. పచ్చదనం మచ్చుకు కనిపించడం లేదు.  ప్రపంచం మొత్తం ఇంతే జరిగింది.


అదొక్కటే కాదు ఒక్క జంతువు లేదు. ఒక పక్షి లేదు. చెరువుల్లో,కుంటల్లో నీళ్ళు లేవు. సముద్రాలలో నీరు కూడా మాయం అయి అందులోని లోయలు, పర్వతాలు బయట పడ్డాయి. నీళ్ళలో ఉండే చేపలు కూడా కనిపించకుండా వెళ్ళిపోయాయి.  ఎవరెస్ట్ శిఖరం కన్నా పెద్ద దైన పర్వతం బయటపడింది ఓ చోట.




మనుషులు, యంత్రాలు మాత్రమే మిగిలిపోయాయి. అంతా  నిశ్శబ్దం, కాదు శూన్యం . ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. మనుషులు చచ్చిపోతూ ఉన్నారు ఒక్కొక్కరిగా.

ఎప్పుడు పెద్దగా పట్టించుకోని, ఇష్టానికి కలుషితం చేసే గాలి ఇప్పుడు కావాలినిపించింది. ఆ గాలిని ఇచ్చే పచ్చటి చెట్లు కావాలనిపించింది. పక్షుల కిల కిలలుకరువయ్యాయి. అంతా శూన్యం. సూర్యుడు వేడిగా నిప్పులు చెరుగుతున్నాడు. పెద్ద పెద్ద భవంతులు, వందల మీటర్లు ఎత్తున్న అపార్ట్ మెంట్ లు, కోట్ల విలువచేసే కార్లు,నగలు, డబ్బు, కంప్యూటర్ లు,సెల్ ఫోన్లు, అంతా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు వెక్కిరిస్తూ ఉన్నాయి.

దాహంతో నోరుఎండి పోతూ  ఉంది. తినడానికి కళ్ళ ముందు ఎన్ని ఉన్నా, తిరగడానికి పెద్ద పెద్ద కార్లు ఉన్నా, ఇంటి నిండా  బ్లాక్  మనీ, వేల కోట్ల ఆస్తులు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. ఇపుడు అందరు ఒకటే, అందరి ఆశా ఒకటే. ప్రకృతి మళ్ళీ వెనక్కి రావాలి. పచ్చని చెట్లు కావాలి, స్వచ్చమైన గాలి కావాలి, నీళ్ళు కావాలి ఇంకేం వద్దు.

పెద్దన్న గా చెప్పుకునే దేశంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేరే దేశాల్లోను పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మనిషి ఎంతో విలువైనవి గా భావించే వన్నీ అల్పంగా కనపడుతున్నాయి. కళ్ళ ముందే కుటుంబసభ్యులు, ఆప్తులు, స్నేహితులు చచ్చిపోతున్నారు. చావు దగ్గరకి చేరిన కళ్ళలో తప్పు చేశామన్న భావన నీడలా కదులుతూ ఉంది. అంత స్మశానం, యుగాంతం.

తల్లి లాటి ప్రకృతిని తార్చిన బిడ్డలని వదిలి ఆ తల్లి తన దారి తను చూసుకుంది.. అవును ఆమె వెళ్ళిపోయింది.






ఉఫ్, అమ్మా. రొప్పొస్తంది. ఆడ దాకా పోతానో లేదో. పెతి సారీ ఇట్నే అనుకుంటా, మొత్తానికి పోతా. ఈసారెందుకో వల్ల కావడం లా అంటూ పైకి చూసాడు తిరపస్సోమి. దూరాన గాలిగోపురానికి ఉన్న నామాలు నవ్వుతూ కనిపించాయి. తెల్సిన మనుషులు పలకరించినట్టుంది. మళ్ళీ ఓపిక తెచ్చుకొని అడుగు వేస్తూ ఉన్నాడు. ఉహు,  వల్ల కాడంలా. వయసైపోయింది కదా. ఉరామారిగ్గా 60 ఉండవూ, ఎల్లవ వచ్చినపుడు పుట్టానని అంటుండేది మా ముసల్ది. ఏడుకొండల వాడా వెంకరమణ గోవిందా గోవింద అప్రయత్నం గా నోట్లోంచి వచ్చేసింది. ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా   గోవిందా .
మజ్జాన్నం వచ్చా అలిపిరి కాడ్నుంచి ఇంకా ఈడ్నే ఉన్నా. కాసేపు కూసుంటే కానీ కదల్లేను అనుకుంటూ ఓ రాయి కి జరిగిలపడ్డాడు. పోతా ఉన్నారు పైకి జనాలందరూ. ముసిలోళ్ళు, కుర్ర పిలకాయలు, పసి బిడ్డలు. ఒక్కోర్ది ఒక్కో మొక్కు. కొత్తగా పెళ్లైనట్టుంది, పెళ్లి బట్టల్లో పోతన్నారు ఓ జంట. ఇంకో మొగుడు పెళ్ళాలు, బిడ్డని మెడ మీద కూసోబెట్టుకొని గోవింద నామాలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకో కుర్ర పిల్లలు ముగ్గురు ఒకరు పసుపు, ఇంకొరు కుంకుమ, సివర పిల్ల కర్పూరం బెట్టి ఎలిగిస్తా ఉంది. అందరు వెళ్ళేది ఆయన కాడికే. నేనెప్పుడు వచ్చా మొదటి సారి?
ఎప్పుడ్నుంచో జుట్టు పెంచిన మా నాయన ఓ పాలి మొక్కు తీర్చుకోడానికి తిరపతి పోదామని గొడ్లని ఈరాసోమి కి అప్పజెప్పి మర్నాడు ఇంట్లో పూజ చేసి, మేళం పెట్టుకోని ఊరంతా తిరుగుతావుంటే అందరు వారు పోసి, దండం పెట్టి డబ్బులేసారు. అదేదో బలే ఉన్నింది అప్పుడు. ఆడ్నుంచి టేసన్ కాడికి వచ్చి రైలు రాక సానా సేపు ఎదురుచూశాం. మా అమ్మ చేసిన పులిహోర తింటా కూసున్నం.  రైలు వస్తాంటే ఎదో పెద్ద సంబడం. అదే ఫస్టు సారి రైలెక్కడం. అందరు గుంపులు గుంపులుగా తోసుకుంటా ఎక్కేరు. యాడ్నో కాస్త సోటు దొరికితే పిల్లోడ్ని అని కూసోబెట్టారు నన్ను. అదేదో ముసిల్దానిలా సిన్నగా పోతా ఉంది. యాడ బడితే ఆడ ఆగుతా. అయినా బాగున్నింది. దూరంగా కొండలు ఎవరో పడుకోని ఉన్నట్టు. అదే తిరపతని దింపినారు. గుడి యాడుందో ఎతుకుతా ఉంటె, సాన దూరం అని జెప్పినాడు మా నాయన. ఆడ నుంచి నడవాలంట. నేను మా నాయన, అమ్మ, మా సిన్నయ్య వచ్చాము. ఆడో పెద్ద గోపురం, ఇంకేంది గుడొచ్చేసింది అనుకున్నా. కాదంట అదే మొగదాల అన్నారు . పోతా ఉన్నాం. అడివి ఉన్నట్టుంది. అట్టా నడుసుకుంటా గుంపులు గుంపులుగా జనాలు. గోవింద నామాలతో హోరెత్తిపోయింది.గుండు చేయించుకున్నాం అందరం .  మొత్తానికి నల్లోడి దర్సనం ఐన్ది. అదో గొప్పఅనుభూతి . దేవుడంటే దేవుడే. నల్లటి మొహాన తెల్లటి నామాలు, చిన్నగా నవ్వుతు ఉండే మొహం. 

ఎప్పున్నా ఎవురన్న తిరపతి పోతంటే ఆళ్ళ కూడా పంపే ఓళ్ళు నన్ను . పెళ్లై నా కూతురు పుట్టినాక, మొక్కుకున్నా వస్తానని .  ఆడ్నించి పట్టుకుంది నాకీయావ. పెతేడు రావాల, ఆయన్ని సూడాల అని.  అప్పట్నుంచి పెతేడు నడిచే వత్తన్నా. కూతురుకి పెళ్లై  పొయిన్ది. మా ఆడది జబ్బు చేసి సచ్చిపోయింది . ఒక్కడనే, గొడ్డు కాయడం. ఉన్న కాత్తె పొలం సూసుకోడం . నాకు తొందరగానే ముసిల్తనం వచ్చేసినట్టుంది . నడవలేకపోతున్నా. 
"గోవిందా ఆ ఆ  గోవిందా " ఎవరో నన్ను లేపారు.. మళ్ళీ నడుస్తూ ఉన్నా... చీకటి పడుతుంది.జనాలు పల్చబడతన్నారు . నాకు ఎగసోస గా ఉంది. మొండికేసి నడుస్తానే ఉన్నా. మొక్కు తీర్చుకుంటానా ? ఏదో దిగులు. కాసేపటికి గుండెలో మంట, దడ. ఆగుదామని కూర్చున్నా . ఊపిరి అందడం లా. గొంతు పట్టేసినట్టుంది.ఎక్కిళ్ళు వచ్చాయి. దూరంగా నామాలు నవ్వుతూ ఉన్నాయి. మొక్కు తీరలేదు, అదే గమనం లో ఉంది. నల్లవాడి నవ్వు పిలుస్తూ ఉంది.  

ముందు వెళ్తున్న పెద్దాయన హఠత్తుగా కూలబడ్డాడు. దగ్గరకెళ్ళి కదిపి చూస్తే,తల వల్చేసాడు. ఖంగారు పుట్టింది. లేదు, అప్పటికే ప్రాణం పోయింది. ఎం చేయాలో తోచలేదు. అందరూ  గుమిగూడారు. పైన చాయ్ అమ్ముతున్న ఓ కుర్రాడిని  అడిగితే పోలీసులు ఉంటారు కొంచెం ముందుకు వెళితే చెప్పమన్నాడు . ప్రాణం ఉసూరుమంది . ముందుకు వెళ్లి పోలీసులకి చెప్పాను . వాళ్ళు నిట్టూర్చి కదిలారు. 



అమ్మమ్మ వాళ్ళ ఊరంటే నాకు గుర్తొచ్చేది ఏటి(పాలేరు) దగ్గర చేను, అక్కడ తాటి కర్ర, తేగలు, రోడ్డు పక్కనే ఉన్న మాగాణి, అక్కడ కూర్చుని లెక్కబెట్టిన బస్సులు, లారీలు. పక్కనే ఉన్న అమ్మ వారి గుడి. దూరంగా పొదల్లో కనిపించి భయపెట్టే వీరభద్రుడి గుడి. ఇంకా రైల్వే ట్రాక్ పక్కన పొలాన కూర్చుని లెక్కబెట్టిన గూడ్స్ రైలు పెట్టెలు, రైల్లో వెళ్ళే వాళ్ళకి చెప్పిన టాటాలు. ఊరికి అవతల దూరంగా ఉండే పెద్ద బడి, ఊర్లో ఉన్న అంగన్వాడి.. ఊరి నిండా ఉన్న గుడులు. ఇవన్నీ ఒక ఎత్తైతే, తాతయ్య దగ్గర పడుకొని విన్న కథలు, పొద్దున్నే ఆయన వడిలో దుప్పటి చుట్టుకొని కూర్చున్న రోజులు. అమ్మమ్మ వండే మెత్తాళ్ళ కూర, రొయ్యల పొడుం,ఎర్రగా కాచి తోడు వేసిన గడ్డ పెరుగు. పెద్ద మావయ్య డ్రామాలు వేసినప్పుడు కింద నేను వేసిన డాన్సులు. శీను మావయ్యతో ఏటి పక్కన చెట్ల కింద కూర్చొని తిన్న తాటి ముంజలు, తేగలు, బురి గింజలు, మావయ్యతో సైకిల్ మీద ముందు కూర్చుని స్పేడ్ గా ఫాస్ట్ గా అని అరిచిన రోజులు..... దాచుకోడానికి గుండె నిండా జ్ఞాపకాలు.

నేను పుట్టింది అక్కడే. నన్ను చంకన వేసుకొని తిప్పని వాళ్ళు లేరు అంట. ముందుగా అమ్మ కన్నా పిన్నే నన్ను పెంచింది.నన్ను సాయంత్రం వేళకి తయారు చేసి తల నిండా పూలు పెట్టి, దిష్టి చుక్క తో సహా గుడి దగ్గరకి తీసుకు వెళ్తే అందరు ఎత్తుకునేవాళ్ళు అంట. "బాగా బరువుగా ఉండే వాడివి రా, చేతులు మార్చుకుంటూ తిప్పల్సి వచ్చేది" అనేది పిన్ని.  ఓ రోజు అంకమ్మ గుడి దగ్గరకి వెళ్తుంటే ఎవరో లాటరీ అని చెప్తే 75 పైసలు కడితే నా పేరు మీద ఓ పెద్ద ఆంజనేయ స్వామి పటం వచ్చిందంట. దాన్ని ఇప్పటికీ ఇంట్లో  పెట్టారు. వెళ్ళినప్పుడు ఆయనకి కనపడకుండా రాను. ఏమో నాది అని గట్టి నమ్మకం. ఆ ఇంటికి,  మా ఇంటికి మొదటి బిడ్డ ని కావడంతో అందరు ముద్దుగానే చూసుకున్నారు. పిన్ని, పెద్ద మావయ్య, చిన్న మావయ్య, అమ్మమ్మ, తాతయ్య ఇలా అందరూ. అమ్మమ్మ అయితే "తిరిపిగాడు" (తిరుపతి స్వామి అంట, ఇలా అయితే అందరు నన్ను స్వామీ స్వామీ అని పిలుస్తారంట)అని పిలుచుకునేది. అందరూ అలానే పిలిచేవాళ్ళు.

మా ఇంటి ముందు రెండు పెద్ద కొబ్బరి చెట్లు, ఓ పెద్ద నీళ్ళ తొట్టి ఉండేది. ఇంటి ముందు బర్రెలు కట్టేసే వాళ్ళు. ఆ కొబ్బరి చెట్ల మీద కాకులు తెచ్చి పడేసిన బాదాం కాయలు ఏరుకొని పగలకొట్టుకొని తినడం ఓ జ్ఞాపకం. రాజ్యం కొట్టు, వీరయ్య కొట్టు, హుస్సేన్ కోట్లో తిన్న చిరు తిళ్ళు. ఆ రాజ్యం ఇంకా ఉంది "ఏందయ్యా బాగా పెద్దయ్యావుగా, మమ్మల్ని గుర్తు పెట్టుకున్నావా " అంటూ ఉంటుంది. ఆమె మా అమ్మమ్మ స్నేహితురాలు. ఆ ఊర్లో చాలా గుడులు ఉన్నాయి. శివాలయం, చేన్నకేశవుడి గుడి ఇవి ఊర్లో ముఖ్యమైనవి. ఊరవతల అయితే ముత్యాల గుంట దగ్గర ఉండే గంగమ్మ గుడి, పక్కనే కొత్తగా కట్టిన పోలేరమ్మ గుడి, మగాట్లో ఉండే అంకమ్మ గుడి, దూరంగా ఉండే వీరభద్రుడి గుడి.




చెన్నకేశ స్వామి గుడిలో ధ్వజస్తంభం చిరు గంటల శబ్దం గమ్మత్తుగా ఉండేది. సెంటర్లో ఉండే రచ్చబండ మధ్యలో పెద్ద రావి చెట్టు గల గలలు, ఆ చెట్టు మీద వాలే పిట్టల శబ్దాలతో సందడి గా ఉండేది. చెన్నకేశవుడి గుడిలో ఉండే వాహనాలు పెట్టే గది పాడుబడి ఉండేది. అందులో ఏముందో అని తెగ ఆలోచించే వాడిని. ఇక ముత్యాలగుంట నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ గంగమ్మ గుడి కి వెళ్ళడం ఓ ఆనందం. అక్కడకి వెళ్ళాక మాత్రం గంగమ్మ ని చూడ్డానికి భయం. ఎప్పుడూ తలుపులు మూసి ఉండేవి. ఎవరైనా ఎత్తుకుంటే, పాకులాడుతూ చూస్తే ఇంత పెద్ద వెండి కళ్ళతో నాలుగు చేతులతో నన్నే చూస్తూ ఉన్నట్టుండేది. ఏదో భయం "ఆ ఆ చూసేసా" అని దూకేసే వాడిని. ఇక మాగాట్లో ఉండే అంకమ్మ గుడి దగ్గర నీళ్ళ కొలను లో ఉండే తామర పూలు చూస్తే, అలా చూస్తూ ఉండే వాళ్ళం. పిల్లిపెసర కాయలు తింటూ ఆడుకునే వాళ్ళం. పెద్దోళ్ళు ఓ కథ చెప్పే వాళ్లు "పోద్దుబోయాక, పోలేరమ్మ తల్లి బంగారు చేట, చీపురు తీసుకొని, నెట్టి మీద నిప్పుల కుండతో గ్రామ రక్షణ కి బయల్దేరుతుంది" అని. అందుకే గుడి కి  దూర దూరంగా తిరిగేవాడిని. మగాట్లో కూర్చుని మేం ఆడుకునే ఆట, రోడ్డు మీద వచ్చే పోయే బళ్ళని లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అటు వెళ్ళేవి నీవి, ఇటు వచ్చేవి నావి అని "చూడు నా లారీ ఎంత బావుందో... రేయ్ నీకు కుక్కమూతి లారీ వస్తుంది" అని గోల గోల.

మా తాతయ్య, మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు. తెల్లటి రంగు, ఎప్పుడు తెల్లటి బట్టలు, పై పంచ, చేతిలో పొన్ను కర్ర. నా హీరో. అమ్మమ్మ లక్ష్మమ్మ. పెద్ద బొట్టు, ముక్కు పుడక, చెవులకి పెద్ద కమ్మలు, దేవుడంటే భక్తి, అమాయకత్వం. ఇంటికి వచ్చిన ఎవర్ని భోజనం పెట్టకుండా పంపని తత్త్వం. లచ్చుమ్మ మహాతల్లి రా అనిపించుకునేది. మా ఇంట్లో ఎప్పుడూ రెండు జతల ఎద్దులు ఉండేవి. వాటికోసం రంగు రంగుల చిక్కాలు, గంటలు, నల్ల తాళ్ళు, చెర్నాకోల లు ఉండేవి.

ఇంకా బాగా నచ్చేది పరవట పొలం అదే ఏటి కాడ చేను. ఆ చేను మా తాతయ్య కష్టం. చాలా కష్టపడి ఓ పదెకరాల ముక్క చేసాడు ఆయన. ఆ పొలం చుట్టూ తాటి కర్ర, వెదురు గూములు ఉండేవి. ఎప్పుడు వాటి నిండా కోతులు ఉండేవి, ఒకటి అరా కాదు గుంపులు గుంపులుగా. వాటిని తోలడానికి, భయపెట్టడానికి తాతయ్య దగ్గర వడిసేల ఉండేది. దాన్ని తిప్పుతుంటే అదో ఆశ్చర్యం. నేను కూడా ఓ చెయ్యి వేసే వాడిని, అది తిరిగి తిరిగి నాకే చుట్టుకునేది. ఏటి వడ్డున కూర్చుని చిన్న మావయ్య తో ముంజలు కొట్టించుకు తినడం ఓ మధురానుభూతి. ఇప్పటికి ఎండాకాలం నాకది గుర్తు చేస్తూ ఉంటుంది. తినడం అయ్యాక ఏటి లో స్నానాలు, చేపలు పట్టడం. కాళ్ళకి చెప్పుల్లేక పరిగెత్తుకుంటూ వెళ్లి చెట్టు నీడకి చేరడం.

కొంచెం ఊహ తెల్సాక, మా ఊరికి వచ్చేసాను. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మా ఊరి నుంచి నడిచే వెళ్ళాలి. దాదాపు పది కిలోమీటర్లు. దాదాపు పదో తరగతి దాకా నడిచే వెళ్ళే వాళ్ళం. అలా వెళ్ళడం ఓ సాహస కార్యక్రమం. పొలాలన్నీ చవకలు, జామాయిల్ వేసి కారడవి లా ఉండేది. అందులో అడవి పందులు గుంపులు గుంపులు గా తిరుగుతుండేవి. ఓ సారి నాన్నతో ఎద్దుల బండి మీద వెళ్తుంటే, నాన్న తాటి చెట్టు మీద కూర్చున్న గ్రద్ద ని చూపించాడు. అదే మొదటి సారి నేను బయట గ్రద్ద ని చూడ్డం. పొలిమేర లో వెళ్తుంటే, ఏదైనా చచ్చిన బర్రేని పడేస్తే రాబందులు గుంపులు గుంపులు గా వచ్చి వాలేవి. ఎద్దుల బండి తాడు చేత్తో పట్టుకొని నేనే తోలుతున్నట్టు ఆనందపడేవాడిని. చెరువు మొదట్లో కి వెళ్లి పిలిస్తే పలికే చెలమయ్య తాత. ఊర్లో ఉండే మా అమ్మ స్నేహితురాళ్ళు, నాకు అత్తలు ఐన సుశీల అత్త, రాజ్యం అత్త,బుజ్జత్త... ఎప్పుడు వెళ్ళినా పలకరించే అనసూయమ్మ అమ్మమ్మ. ఇంకా బోలెడంత మంది చుట్టాలు.

ఆ ఊరికి ఉన్న మరో పెద్ద ఆకర్షణ చెరువు. కొన్ని వందల ఎకరాలు విస్తీర్ణంలో పరుచుకొని ఉంటుంది.ఎక్కువగా  మాగాణి పొలం ఉండడం వలన వరి చేలతో నిండి ఉండేది.

మా పెద్ద మావయ్య బాలయ్య అభిమాని, యధావిధిగా నేను కూడా. చిన్న మావయ్య చిరంజీవి అభిమాని, ఆ అభిమానంతోనే మా పిన్ని కొడుకు చిన్నోడికి చిరంజీవి అని పేరు పెట్టారు. మా మావయ్యల స్నేహితులు రాజుగారి శీను, పంతులు, పుల్లేక.

ఈ ఏడు అమ్మమ్మ చనిపోయింది, రెండవ సారి కాన్సర్ సోకి. ఏమో ఎందుకంటారో అమ్మమ్మ వాళ్ళ ఊరు అని, అమ్మమ్మ లేనప్పుడు ఏముంటుంది.


ముందు భాగం ..http://aakaasavaani.blogspot.in/2013/10/blog-post_6137.html


హోలీ రోజు ఉదయాన్నే నేను, రాజు గాడు రెడీ అయ్యి మా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం.. ఇంకా ఎవడు రాలా... సరే ముందు ప్రవీణ్ గాడి దగ్గర కి వెళ్దాం అని కిందకి వచ్చాం.... మా కన్నా పిల్లలు ముందే లేచి రంగులు గుడ్లు పట్టుకొని ఆడుతున్నారు.నేను ముందు దిగాను..... ఎదురుగా జాంబి "ఆ మన జోలికి ఎందుకు ఎందుకు వస్తుందిలే " అని లలలు లలలు అని నడుస్తూ ఉన్న నా మీద బాంబు దాడి జరిగింది. అతి దగ్గర నుంచి గుడ్డు తీసుకొని నా మూతి మీద కొట్టింది.... ఏం అర్ధం కాలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్లి ఓ పక్క  చతికిల పడ్డా... ఏం అర్ధం కావడం లేదు.... అదేంటి, నాకేంటి? నేనేంటి?

రాజు గాడు ముసి ముసి నవ్వులు నవ్వుతు వచ్చి లేపాడు..... "మామ అది, ఏంట్రా ఇది?" అంటూ ఉంటె... "అదట్నే, ఉంటది రా.. పద"... మెల్లగా లేచి పైకి వెళ్ళా,మా ఆంటీ వాళ్ళకి రంగు పూయడానికి. నేను పూసి బయట నిలుచున్నా, మా వాడు పూస్తున్నాడు. మళ్ళీ జాంబి వచ్చింది పైకి, నా వైపు నడుస్తూ వస్తుంది, చేతిలో గుడ్డు.... "ఇందాక ఎదో తెలియక కొట్టింది, ఈ సారి నో వే " అని భయాన్ని బిగబట్టి, చూడనట్టు నేను మా వాడి వైపు చూస్తున్నా... మళ్ళీ పడింది ఈ సారి తల మీద.... గుడ్డు ఓ వైపు కొడితే పగలడం చాలా కష్టం..సరిగ్గా ఆటే తగిలింది... ప్రాణం పోయింది... గోడని పట్టుకొని నిలబడాలని చూశా... నా వల్ల కాలా... కాసేపటికి ప్రాణం తెపరిల్లింది..ఎదురుగా రాజు గాడు. 

"బావుందా?" "అదేంటి మామా? నేనేం చేశా?" "నేనేం చేసానని రా? తప్పదు. అయినా ఇలాటప్పుడే అర్జునా, సారీ నరేషుగా గుండె బండ చేసుకోవాలి"...నేను ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ఇక్కడే ఉంటె ఇంకెన్ని పడాలో అని ప్రవీణ్ గాడి ఇంటికి వెళ్లాం. మేం వెళ్ళిన కాసేపటికి నందు గాడు వచ్చాడు. "రేయ్ రాజుగా, మా చెల్లెమ్మ అందరిని ఇంటికి వచ్చేయమంది.".. "ఎవర్రా?".. "జాంబి".."మీ చెల్లి ఏంటి?" "నేను మీ కోసం మీ రూమ్ కి వెళ్తే, బలంగా రంగు కొట్టి అన్నయ్యా అందిరా" అని కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు. "బతికిపోయావురా, అన్నయ్య అంది"... ఇంతలో చిన్నా, కిరణ్, మల్లి గాడు, వాసు అందరు వచ్చారు. విషయమంతా ఎక్కువ చర్చించకుండా, "ఎలా ఐన సరే తాడో పేడో తేల్చాలి" అని నిర్ణయించుకుని రూమ్ కి వచ్చాం. పైన కారిడార్ లో లంకకి కాపలా ఉన్న లంకిణి లా తిరుగుతుంది.

... రేయ్ నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని తోసుకుంటూ అందరం వచ్చాం లోపలకి..చిన్నగా కిందకి దిగింది. ఎదురుగా నేను, నా వెనక రాజుగాడు. మీదకి వచ్చి, బలంగా తోసింది చేత్తో. నేను వంగడం, అది రాజు గాడికి తగిలి గోడ మీద పడ్డం.. ఈలోగా అందరం పైకి వెళ్ళిపోయాం, వెనకనే రాజుగాడు. అందరం పైనుంచి బకెట్ లో నీళ్ళు నింపి, మగ్గులతో కిందకి పోస్తున్నాం. "దమ్ముంటే, కిందకి రండి" "నువ్వేరా దమ్ముంటే" అన్నాడు ఎవడో. వాడెవడో వెతికే లోపే పైకి బయల్దేరింది... అందరు ఒక బకెట్ లో రంగు నీళ్ళు నింపి, నా చేతిలో పెట్టి "నువ్వు  పట్టుకోరా మేం పోస్తాం " అని ముందు నన్ను నిలబెట్టి నా పక్కన వరసగా నిలబడ్డారు... అందరు ఉన్నారుగా అని లెక్క చూసుకొని ఎదురుగా చూస్తే ఎదురుగా జాంబి... వచ్చేసిందిరో అని చూస్తే ఒక్కడు లేడు...

పోటీకోచ్చిన ఆంబోతులా బుసలు కొడుతూ.. చేతిలో ఉన్న బకెట్ అంతా ఒక్క సారిగా మీద కుమ్మరించేసా... అయినా సరే చూపు తిప్పకుండా చూస్తూ ఉంది...


 నేను వణుకుతూ , బకెట్ అక్కడ పడేసి పరిగెత్తి షెడ్ లోకి వెళ్ళిపోయా... ఆ షెడ్ డోర్ దాటాక పక్కకి తిరిగి  వెనక్కి వెళ్తే మా రూమ్. జాంబి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చివర జారి కుండీ మీద పడి దాన్ని పప్పు పప్పు చేసింది. "రేయ్ జాంబి పడిపోయింది రోయ్" అనగానే.. ఒక్కోడు ఆమె మీద నుంచి కూడా దూకి పారిపోయాం... మధ్యాహ్నం 2 దాకా ఇంటికి రాలా.. ఇంటికి రమ్మని పిల్లల చేత రాయబారాలు... మా శ్రీను అంకుల్ ని ముందు పెట్టుకొని, అందరి చేత  వార్నింగ్ ఇప్పించి ఇంట్లోకి వెళ్లాం... ఇది జరిగిన తరువాత అందరు ఆమె ని తిట్టడం... ఆమె వెళ్ళడానికి తయారయ్యి తరువాతి రోజు రాత్రి మా రూమ్ దగ్గరకి వచ్చింది... రాజు గాడు బెడ్ మీద కూర్చుని ఉన్నాడు.. పాప వచ్చి "నరేషన్నా జాంబి అక్క వచ్చింది, పిలుస్తుంది"... రాజు గాడు పడుకొని కళ్ళు మూసుకున్నాడు. నేను కూడా పడుకోబోతుంటే "నువ్వు ఉన్నవని చెప్పేసా".. "హ్మ్మ్ ".. బయటకి వచ్చా "ఎంటండి?" "రాజు?" "నిద్రపోతున్నాడు" "నేను ఊరికి వెళ్తున్నా, సారీ చెప్పండి".. అలాగే అండి... "హ్యాపీ జర్నీ".... లోపల దండం పెడుతూ మా వాడు.....

*******సమాప్తం******* 
ఇది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. వచ్చింది, మా గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది, మమ్మల్ని కూడా.....

అవి నేను, రాజు గాడు చదువుకుంటూ, ట్యూషన్ చెప్పుకుంటున్న కాలం... 100 రూపాయలు ఉంటె పండగ చేసుకుంటున్న కాలం... చేతిలో బాట్ బాల్ ఉంటె చాలు టైం అలా గడచిపోతున్న కాలం.... మాకు తెలియకుండానే, మా ప్రమేయం లేకుండానే మేం ఓ పెద్ద ఆపదలో ఇరుక్కుపోబోతున్నామని మాకు తెలీదు... ఆ విధంబెట్టిదన....

నేను మా ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన షెడ్ లో ట్యూషన్ చెప్పేవాడిని. ఓ 10 మంది పిల్లలు వచ్చే వాళ్ళు. రాజుగాడు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో చెప్పేవాడు. కొత్త సంవత్సరపు సంబరాలు చేసుకుందాం పిల్లలతో అని నిర్ణయించుకున్నాం. పిల్లలంతా సరే అన్నారు. కొందరు పాటలు, కొందరు డాన్స్ ఇలా. మా రాజు గాడు వీర శూర చిరు ఫ్యాన్. ఎంత పెద్ద ఫానో రాయాలంటే ఓ పోస్ట్ సరిపోదు.అది ఇంద్ర సినిమా వచ్చి వీణ స్టెప్ తో చిరంజీవి చెడుగుడు ఆడుకుంటున్న రోజులు. మా వాడు కొత్త సినిమా రావడం ఆలస్యం, ఆ స్టెప్ నేర్చుకోడానికి. ఇక వీణ స్టెప్ ని విరిచి,చించి ఆల్రెడీ కాలేజి లో జూ.చిరు స్టాంప్ పడిపోయి మంచి ఫాం లో ఉన్నాడు. ఏదో మా పిల్లల కోసం డాన్స్ వేయడానికి ఒప్పుకున్నాడు. అదే స్పెషల్ అట్రాక్షన్. 

అది డిసెంబర్ 31. సాయంత్రం నుంచి నేను, రాజు గాడు, పిల్లలు  అలంకరణ పని లో ఉన్నాం. మా ఆంటీ వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు. నేను నిచ్చెన ఎక్కి రిబ్బన్స్ అతికిస్తున్నా రాజు గాడు అందిస్తున్నాడు. ఎవరో తెలీదు కానీ ఓ పెద్దావిడ (పెద్దావిడ అంటే, వయసైపోయిన ఆవిడ కదండీ... పెద్దగా ఉన్న ఆవిడ (ఎవరి మనోభావాలు కించపరచడానికి కాదు)) కూడా సాయం చేస్తున్నారు. ఆవిడ కూడా రిబ్బన్స్ అందిస్తున్నారు. మా రాజు గాడు "ఆంటీ ఆ పచ్చ రిబ్బన్ ఇవ్వరా?", ఆవిడ ఓ చూపు చూసి "ఆంటీ నా? నేను కూడా స్టూడెంట్ నే" అంటూ విస విసా వెళ్ళిపోయింది.

అంటే ఆ ఆ అది మేము అలా అనుకోలేదు....అని.... తరువాత తెల్సింది ఏంటంటే ఆమె 10 వ తరగతి అంట,
 పేరు జాంబవతి( పేరు మార్చడమైనది.చాల హైట్, లావు, కారు నలుపు, ఒకింత భయం గొలిపే ఆకారం.) మా ఆంటీ వాళ్ళ చుట్టాలు. కింద ఇంట్లో ఉంటుంది.
సరే సర్దుకొని, సాయంత్రం ప్రోగ్రాం చించేసాం (ఎదో అలా). మా రాజు గాడు అతిధి పాత్రలో వీణ విరగ్గొట్టాడు. ఆ స్టెప్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆవిడ కి అదే ఆ అమ్మాయికి సారీ లు విన్నవిన్చుకున్నాం.
ఇక రోజులు సాఫీగా  సాగిపోతున్న సమయంలో, మా రాజు గాడు వచ్చి  "రేయ్, ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది" అన్నాడు. అమ్మాయి అనగానే చుట్టు పక్కల ఉన్న అందరు ఓ సారి మైండ్ లో తిరిగారు. ఎవరబ్బా? "ఎవర్రా?" వాడు కొంచెం ఇబ్బంది గా " అదేరా, ఆ రోజు ఆంటీ అన్నాం కదా"...:"జాంబవతా?" అని షాక్ లో నేను... "ఊ".... "ఎహే ఊరుకో, అంతా నీ భ్రమ, అదేం ఉండదు.. పట్టించుకోకు" అని సర్ది చెప్పా. మళ్ళీ కొన్ని రోజులకి అదే మాట, ఈ సారి చెయ్యి ఊపిందని.నాక్కొంచెం భయం మొదలైంది. వీడు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ట్యూషన్ చెప్పి రాత్రి  8 ఆ ప్రాంతంలో వచ్చే వాడు. వచ్చాక ఇద్దరం కలిసి సైకిల్ మీద తినడానికి వెళ్ళే వాళ్ళం.
ఓ రోజు, ఇద్దరం రూమ్ లో ఉంటె రాత్రి 8 కి, మా చిన్నా గాడు (అప్పట్లో సన్నగా, అద్దాలు పెట్టుకొని ఉండేవాడు)వచ్చాడు. "రే,రాజుగా నిన్ను కింద ఆంటీ పిలుస్తుంది"  ఇద్దరం ఎగిరి పడ్డాం... రాజు గాడు సీరియస్ గా "ఎవర్ని రా?".. "నిన్నే".."జోక్ చేయకు?" "నిజం రా, నేను మెట్లు ఎక్కుతుంటే, ఏ బాబు అని పిలిచింది, నేను భయంగా వెళ్లాను. పైన రూమ్ లో రాజు ని పిలువు , అందిరా"... "ఎహే పోరా" అని వీడు తడబడే అడుగులతో కిందకి వెళ్ళాడు. నా సైకిల్ వాళ్ళ గుమ్మం పక్కనే పార్క్ చేసి ఉంటుంది. నేను కంప్యూటర్ లో ఏజ్ ఆఫ్మ్ ఎంపైర్ గేమ్   ఆడుతున్నా, చిన్న గాడు చూస్తూ ఉన్నాడు. ఇంతలో రాజుగాడు విసురుగా పైకి వచ్చాడు. వాడి చేతిలో ఓ పేపర్. "ఏంటి మామ, ఏమైంది?"..."రేయ్..()*#@()@#()... నాకు లెటర్ ఇచ్చిందిరా"...ఆ మాట వినగానే నేను, చిన్నాగాడు...
"నీ యబ్బ, ఆపండ్రా... ఏమనుకుంటుంది... ఆంటీ కి చెప్తా.." అని ఆవేశం తో ఊగిపోతున్నాడు... మేం కింద పడి ఇంకా నవ్వుతునే ఉన్నాం. ఇంకా నవ్వితే, వాడు ఏడుస్తాడని... వాడిని కూర్చోబెట్టి,"అర్జునా, సారీ రాజుగా ఆమె ఎదో చుట్టపు చూపుగా వచ్చింది, కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే, వాళ్ళ ఊరికి వెళ్ళి పోతుంది"..అని గీత ను బోధించాం. అప్పుడు అర్ధం కాలేదు మేము ఎంత పెద్ద తప్పు చేసామో,అది మా వాడికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేసిందో.ఇంతకీ ఏం జరిగిందో చెప్పా లేదు కదూ, వీడు కిందకి వెళ్ళే సరికి ఆమె మెట్ల మీద వీడి కోసం కాపు కాసి ఉంది. వీడు మెల్లిగా సైకిల్ దగ్గరకు అడుగులేసాడు... దగ్గరకు రాగానే ఆ ఆకారం కదిలింది.వీడు వెనక్కి తగ్గాడు. "ఇలా రా!" "ఏంటి?" "చెయ్యి చాపు" "దేనికి?" "చాపు చెప్తా" వీడు చెయ్యి చాపడం, ఆమె చేతిలో ఓ కాగితం పెట్టి, సిగ్గుతో ఇంట్లోకి దూసుకెళ్ళడం క్షణ కాలం లో జరిగిపోయాయి. భూమి క్షణ కాలం కంపించి ఆగిపోయింది, వీడి గుండె లాగా.

 లేఖ లో ఏముందో చెప్పలేదు కదా? ఓ రూళ్ళ కాగితం మీద, పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది"I LOVE YOU, నీకు నేనంటే ఇష్టం ఉంటె రేపు ఉదయం ఓ రోజా పువ్వు పట్టుకొని బయట నిలబడు".... మళ్ళీ మొదలు...



వాడు ఆ లెటర్ చించేసాడు. తరువాతి రోజు నుంచి రాజు గాడు జాగ్రత్త పడ్డాడు. రూమ్ దగ్గర వంచిన తల వాళ్ళ మామ వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తే వాడు. ఈ క్రమంలో మధ్య మధ్య లో చేతులు ఊపడం, సైగలు అన్ని అయిపోయాయి. ఎ రోజు కా రోజు, వాడికి భయం పట్టుకోసాగింది. కింద నుంచి మా రూమ్ కి వచ్చే మెట్ల మీద లైట్ ఉండదు. అంతా చీకటి. ఓ రోజు వాడు ట్యూషన్ అయ్యాక రాత్రి 8 తరువాత  పైకి వస్తూ ఉంటె, ఆమె ఆ మెట్ల మీద నిలుచుని ఉంది. రాజుగాడు తడబడి తట్టుకొని నిలబడ్డాడు.

"ఏయ్, అడ్డం లే"... "నా సంగతి ఏం చేసావ్?'.."నువ్వు వచ్చిన పని చూసుకు వెళ్ళు".... అని తప్పించుకు వచ్చేసాడు.. పైకి వచ్చి ఒకటే ఏడుపు.. "మామా, ఈ టైములో రూమ్ కి రావాలంటే భయంగా ఉందిరా"...ఇక ఆ రోజు నుంచి ముందు వెనకా చూసుకొని రావడం మొదలు పెట్టాడు...

ఇంకోసారి, వాడు షెడ్ లో వంటరిగా దొరికాడు. "ఏంటి, ఏం చెప్పకుండా అలా తప్పించుకు తిరిగితే ఎలా?" "నీకేమైనా పిచ్చా ? ఆంటీ కి చెప్తాను"... అని రూమ్ కి వచ్చి కోపంతో ఊగిపోయాడు "ఇక నా వల్ల కాదురా, చెప్పేస్తా ఆంటీ కి" "మామా కంట్రోల్"....

ట్యూషన్ కి కింది పిల్లలు కూడా వచ్చే వాళ్ళు. ఓ రోజు వాళ్ళు "ఆ నరేషన్నా, జాంబి అక్క ఏంటి, నీ గురించి తెగ పొగుడుతుంది".....ఆఆయ్ 
 "నన్నా?" "నిన్నే, నీ చేతిలో కొట్టించుకోవడం, మా అదృష్టం అంట".... నాకేదో తేడా కొట్టింది.పెద్దగా పట్టించుకోలేదు.. టాపిక్ మార్చా....


హోలీ ఆ రోజు.ఆ రోజే నాకు తల బొప్పి కట్టబోతుందని తెలీదు....

తరువాయి భాగం

http://aakaasavaani.blogspot.in/2013/10/blog-post_6137.html

విభజన దిశగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. సహజంగానే సీమాంధ్ర ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత వినిపించింది. ఇన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నా అసలేం పట్టనట్టు ఉన్న కేంద్రం, రాజకీయనాయకుల ను చూసి తమ గోడు ను ఎవరికీ చెప్పుకోవాలో తెలీక సతమతమైపోయారు. అయినా సరే విభజన జరగదు అని ఘంటాపథం గా చెప్పుకుంటూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు అదేదో కొత్త విషయం అన్నట్టు, అసలిప్పుడే విన్నట్టు అవాక్కయ్యారు, తమ శక్తి వంచన లేకుండా ఈ విషయాన్నీ తీవ్రంగా ఖండించారు. మేం అలిగాం, ఆశ్చర్యపోయాం, బాధపడ్డాం, ఇది రాజ్యాంగ విరుద్ధం అని మైకులు విరగ్గోట్టేసారు. అదేమైనా కొత్త విషయమా? ప్రతి కాంగ్రెస్ నాయకుడికి తెలిసిన విషయం.

కాంగ్రెస్ ముందుగా విభజనకి అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా, ముందుగా ప్రాంతీయ పార్టీల  అభిప్రాయం అడిగారు. వారి వారి రాజకీయ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అందరు "మీ ఇష్టం " అనేసారు. అలా అనని వాళ్ళ మీద తెరాస పార్టీ ని ఉసిగొలిపి ద్రోహులుగా చిత్రీకంచారు. ఇక్కడ ఎక్కడా, తెరాస పార్టీ కాంగ్రెస్ ని నిందించలేదు, TDP ని తప్ప. యధావిదిగానే అందరు సరే అన్నారు, మేం నిర్ణయం తీసుకుంటున్నాం అని కాంగ్రెస్ అనగానే మెజారిటీ ప్రజలైన సీమంద్రుల నుంచి వ్యతిరేకత మొదలైంది. పార్టీలు చెప్పింది విని నిర్ణయం తీసుకుంటారా?మాకేం కావాలో వినరా? మేం ఒప్పుకోం అంటూ అందరు రోడ్డు మీదకి వచ్చారు. కనీసం ఏంటి అని అడిగిన పాపాన ప్రభుత్వం కానీ, మే తరపున మేం మాట్లాడతాం అన్న రాజకీయనాయకుడు కానీ లేకుండా పోయాడు.

ప్రజల్లో గూడుకట్టుకొని ఉన్న అభద్రత కి సమాధానం ఎవరు చెప్తారు? సరే విభజించారు, కొత్త రాజధానికి ఏం చేస్తారు అని అడిగిన చంద్రబాబు మీద కాంగ్రెస్ వాళ్ళే నీకసలు మనసు లేదా? ప్రజల మనోభావాలను గౌరవించకపోయావు సరే, ఇటివంటప్పుడు ఇలా మాట్లాడతావా? అంటూ విరుచుకు పడ్డారు. ఇచ్చింది కాంగ్రెస్ అన్న మాట వాళ్ళకు అవసరం లేదు. ఇపుడేం చేస్తారు? ఇంకా ప్రజలకి నిజాలు తెలియకుండా ఎన్ని రోజులు మభ్యపెడుతూ ఉంటారు?

ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా TDP దారుణంగా విఫలం ఐంది. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు ఏంటి ఇవ్వాలా? అని అడిగిన కాంగ్రెస్ ని వదిలేసి తెలుగుదేశం లెటర్ ఇస్తేనే విభజన జరుగుతుంది అని అటు టి కాంగ్రెస్, తెరాస TDP మీద మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు. ఎటు తేల్చుకోలేక, బలంగా నిలబడలేక విభజనకి అనుకూలంగా లెటర్ ఇచ్చింది. అక్కడే సగం చచ్చిపోయింది.

ఇక YSRCP పార్టీ కి సిద్ధాంతం అంటూ లేకుండా ప్రయాణం మొదలు పెట్టి, ఎన్నోఅవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ సందర్భానికి తగ్గట్టు నిర్ణయాలు మార్చుకుంటూ వచ్చింది. ఆ పార్టీ కూడా TDP నే తప్పు పట్టింది. విభజనకి ముందు లెటర్ ఇవ్వలేదని, తరువాత TDP లెటర్ ఇవ్వడం వలనే విభజన జరిగిందని విరుచుకుపడింది. ఒక్కసారైనా కాంగ్రెస్ ని కానీ తెరాస ని కానీ పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోయింది.ఇదంతా చూస్తుంటే TDP పతనానికి అందరు కల్సి తీసుకున్న నిర్ణయం లా కనిపిస్తుంది. దాన్ని అడ్డుకోవడం లో తెలుగుదేశం దారుణంగా విఫలమై, తమ ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంది.

ప్రస్తుతానికి ఇంకా నాటకాలు ఆపని సీమంధ్ర కాంగ్రెస్ నాయకులు(అందరు కాదు చాలా మంది ఉండవల్లి లాటి వాళ్లకి మినహాయింపు ఇవ్వచ్చు నా అభిప్రాయంలో) ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నారు.

ప్రజలకి ఏం చేయాలో తోచడం లేదు. ఇప్పటి దాకా ప్రశాంతం గా సాగిన ఆందోళన ఇక హింసాయుతంగా మారుతుందేమో అనిపిస్తుంది. హింస చేయాలంటే ఎవరిని హింసించాలి? ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి  ఒక్కరూ అందులో భాగస్వాములే. ఎవరి మీద పోరాటం చేయాలి? తాము ఎన్నుకున్న నాయకులు పార్టీలకి కట్టుబడి వారి వారి రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నారు. చేయాల్సింది ఇప్పుడున్న రాజకీయ నాయకుడు అనే వాడిని ఎన్నుకోకపోవడం. ప్రజల చేతిలో ఉన్నది ఓటు, దానితో ఏం చేయాలి? ఎవడిని ఉంచాలో, ఓడించాలో,నిలబెట్టాలో నిర్ణయించుకోగల అధికారం ప్రజల చేతిలో ఉంది. కులం,మతం,డబ్బు,మన, తన ఈ ఒక్కసారికి పక్కన పెట్టండి. సుప్రీం కోర్ట్ ఈ మధ్య తీసుకున్న నిర్ణయం ప్రకారం మనకు ఎన్నికల్లో నిలబడ్డ ఎ ఒక్కరూ నచ్చకపోయినా అందరినీ నిర్మోహమాటంగా తిరస్కరించవచ్చు.

విభజన జరిగింది. దానిలో మార్పు లేదు. దాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. ఈ మాట చాల మందిని బాధ పెట్టొచ్చు.

ఆంధ్రప్రదేశ్ కి ఉన్న బలం పల్లెటూర్లు. ఒక స్నేహితుడు చెప్పినట్టు, ప్రతి ఊరు ఓ స్వయంప్రతిపత్తి కలిగి ఉండేది. వాటిని మళ్ళీ పునరుద్ధరించాలి. తను అన్న మాటలని ఇక్కడ యధావిధిగా ఉంచుతున్నా"ఇప్పటికయినా తెలివి తెచ్చుకుని పరిశ్రమల కోసం పరిగెట్టడం, రియల్ ఎస్టేట్ మోజు వదిలించుకుంటే మంచిది. స్వయం ప్రతిపత్తిగల గ్రామాల రూపకల్పన వైపు అడుగేస్తే మంచిది. ప్యాకేజిలు మోసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్ని కలుషితం చెయ్యకండి బాబూ.

అన్నపూర్ణ అన్న పేరు తిరిగి సంపాదించుకోవటమే మేలు. ఏనాడో మనం గొయ్యితీసి పాతి పెట్టేసిన రైతుల అవశేషలున్నాయేమో వెతకండి. దొరికితే పల్లకీలకెత్తి సగౌరవంగా మోసుకురండి. గతమెంతో ఘనకీర్తి కలిగిన పల్లెలు మనవి. బాహ్యప్రపంచం మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా మనుగడ సాగించిన ఇండిపెండెంట్ యూనిట్స్ మన పల్లెలు. వాటిని చంపేసి పట్టణాలకొచ్చి మనం సాధించింది ఏమిటి? ఒక్క పట్టణం లేకుంటే బ్రతుకే అంధకారమయ్యే స్థితి." ఎంతో యదార్ధం.కాటికి కాళ్ళు చాచి ఉన్న పల్లెటూర్లని బతికిద్దాం. వ్యవసాయాన్ని బతికిద్దాం. చెరువులను తవ్వుకుందాం. నీటి నిల్వలు పెంచుకుందాం. మళ్ళీ కళ కళ లాడేలా చెయ్యడం మన చేతిలోనే ఉంది. ఎన్ని అనుకున్నా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఉంటాయి. ఎవరికీ లేనంత సముద్ర తీరం ఉన్న రాష్ట్రం మనది. బకింగ్హాం కెనాల్ ని మళ్ళీ పునరిద్ధరించవచ్చు. ఓడరేవుల అభివృద్ధి, సహజ నిక్షేపాల వెలికితీత, వ్యవసాయం,పర్యాటకం,విద్య అన్ని రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపు కోసం ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సిన సమయం. నిజమే మన దగ్గర ఏం లేదు. సాధించుకుందాం, దానిలో ఈ రాజకీయ నాయకులకి మాత్రం చోటు ఉండకూడదు. మాకేం కావాలో నిర్ణయించేది మేమే అని చెప్పడానికి, మన గొంతు వినిపించడానికి మన వాళ్ళంటూ ఉండాలి. వజ్రం తయారు కావాలంటే కోత తప్పదు. ఓ ఆకారం రావడానికి ఎన్నో ముక్కలు పోవాల్సిందే. అప్పుడే అది వజ్రం అవుతుంది.  
మా ఇంటి ముందు గుడిసెల బడిలో చదివేటప్పుడు, నాలుగో ఐదో గుర్తు లేదు కానీ. బడి ఐపోయాక(4 కే అయిపోద్ది గా ) ఊరికే ఉంచడం ఎందుకు రావయ్యపంతులు కాడికి పంపు పిల్లలని అని ఎవరో చెప్పారు మా నాన్నకి.

ఓ రోజు నన్ను,బుజ్జి ని తాయారు చేయించి పంతులు గారింటికి తీసుకెళ్ళాడు.పంతులుగారిల్లు బాగా పాతది. బయటనే కుడిపక్క చుట్టూ గోడ కట్టిన ఖాళీ స్థలం. కూరగాయల మడులు, వంట చేసుకోవడానికి కావాల్సిన కర్రలు అన్నీ అక్కడే ఉంచేవాళ్ళు. అందులో ఓ చెక్క కుర్చీ. మా తో పాటు అనవయ్య, శీనిగాడు ఇంకోరెవరో చేరారు. ఆయన మనవరాలు విజయలక్ష్మి తో కలిపి ఆరుగురం అయ్యాం. విజయలక్ష్మి మా క్లాసే.

రావయ్యపంతులు గారికి బాగా వయసైపోయింది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళంతా బాగా పైకి వచ్చారని చెప్పేవాడు మా నాన్న. నడుం వంగిపోయి,వంటి మీద చొక్కా లేకుండా, బక్క పలచని శరీరంతో, ఇంతలావు అద్దాలు పెట్టుకొని ఉండేవారు. కోపం బాగా ఎక్కువ. ఆ ఇంట్లో ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ మనవరాలు ఉండేవాళ్ళు.వాళ్ళ పిల్లలంతా ఎక్కడో స్థిరపడ్డారు.

మేము సాయంత్రం పూట వెళ్ళే వాళ్ళం, అంటే 6.30 ఆ ప్రాంతంలో. మాతో పాటు కింద వేసుకు కూర్చోడానికి గోతం పట్ట, కరెంటు పోతే ఓ లాంతరు. ముందు కిరసనాయిలు బుడ్లు తీసుకెళ్ళే వాళ్ళం. ఓ రోజు మా నాన్న లాంతరు కొనిచ్చాడు. అదో ఆనందం. దానికి చిమ్ని, దాన్ని తుడవడం. వత్తులు వెయ్యడం. చిమ్ని పగిలితే మా వీపులు అమ్మకి అప్పగించడం. అబ్భ ఆ అనుభూతే వేరు.

అక్కడకి వెళ్తే బడిలో చెప్పిందే చదువుకోవాలి. హోంవర్క్ ఉంటె చేసుకోవాలి. ఇక అంతా లోకాభిరామాయణమే. మాకు భారతం, రామాయణం లాటి కథలు, పంచతంత్రం కథలు, ఇంకా పొడుపు కథలు చెప్పేవారు.ఆయన సాయంత్రం పూట తపస్సు (మేం పెట్టిన పేరు) చేసుకునేవారు. కుర్చీలో కూర్చుని,చేతిలో తులసి మాల తిప్పుతూ కళ్ళు మూసుకొని ఉండేవాళ్ళు.మేం అప్పుడు గమ్మున ఉండే వాళ్ళం.

చదివేప్పుడు దగ్గర ఉంటె గట్టిగా మొట్టేవాడు. బాగా నొప్పి పుట్టేది.అప్పుడప్పుడు కొట్టే వాడు కూడా. మహా కోపిష్టి అని చెప్పా కదా, తెగ తిట్టేవాడు. ఆయనకి ముక్కుపొడి(నశిం ) పీల్చే అలవాటు ఉండేది. నాకేమో చిరాగ్గా ఉండేది.
తుమ్మితే మీద పడేది. దూరంగా కూర్చునే వాడిని. ఆయన అలా వచ్చి "ఏం చేస్తున్నారు" అని వెళ్ళేవాడు. ఆయన వెళ్ళగానే మళ్ళీ కబుర్లు. కరెంటు ఎప్పుడు పోద్దా అని చూసేవాళ్ళం, దీపాలు ముట్టించడానికి.

చిత్రలహరి పిచ్చి ఎక్కి, శుక్రవారం కోసం వారమంతా ఎదురు చూసే రోజుల్లో... వాళ్ళ మనవరాలి (విజయలక్ష్మి)ని మాత్రమే చిత్రలహరి చూడటానికి పంపేవాడు. మేమంతా నోటికాడ కూడు లాక్కున్న ఖైదీల్లా కిక్కురుమనకుండా లోలోపలే రగిలిపోయేవాళ్ళం. ఆ కోపంతో శీనిగాడు ఆయన చాల ముక్కుపొడి డబ్బాలు గోడవతల విసిరేశాడు, ఓ వెండి భరిణతో సహా. పంతులుగారు బాగా తలచుకున్నారు ఆ భరిణ ని. ఓ రోజు ఉదయం ఏదో ఐంది. మా బుజ్జి ని కొట్టాడు ఆయన.దీనికి కోపం వచ్చి ఆయన వెళ్ళగానే, ఆయన కళ్ళద్దాలు తీసి గోడవతల విసిరేసింది.నాకు ఒకటే వణుకు. ఆయన వచ్చి మమ్మల్ని ఏమి అడగకుండా వెతికి వెళ్ళిపోయాడు. విజయలక్ష్మి వచ్చి మా తాత అద్దాలు కనిపించాయా అంటే టామ్ అండ్ జెర్రీ లా అడ్డంగా తల ఊపాం. ట్యుషన్ అయిపోయి వెళ్ళబోయే ముందు అందరిని పిలిచి చెప్పాడు"నేను సాయంత్రం తపస్సు/ధ్యానం లో కూర్చుంటా, ఎవరు తీశారో తెల్సిపోద్ది." అని.మా బుజ్జి ఖంగారు పడింది. "రేయ్ అన్నాయ్ ఏం చేద్దాం?". "సాయంత్రం నేను వెతికి పెడతాలే" అని చెప్పా. ఇంటికి వెళ్లాం కానీ, వామ్మో తప్పస్సు లో ఆయనకి మా మొహాలు ఎలా కనిపిస్తాయో అని ఒకటే వణుకు.

అందరికన్నా ముందు వెళ్లి కూర్చున్నాం.కోపంలో బలంగా విసిరేసింది, అదెక్కడ పడిందో. సరే అని గోడ దూకా. అంతా వెతికితే తడికె మొగదాల కనపడింది. ప్రాణం లేచి వచ్చింది. ఏం పగలలేదు, గట్టిదే. అసలేం జరగనట్టు, తెచ్చి ఆ కర్రల మోపులో పెట్టి,విజయలక్ష్మికి  హింట్ ఇచ్చా. వచ్చి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. చిన్నప్పుడు కోపమే కానీ, ఇప్పుడు తలచుకుంటే బాధ గా ఉంటుంది. చాలా కష్టంగా గడిచేది వాళ్ళ ఇంట్లో. ఆయన ట్యూషన్ డబ్బులకోసం ఆ వయసులో అందరి ఇళ్ళకీ వెళ్ళే వారు. నేను 10వ తరగతి లో ఉండగా ఆయన చనిపోయాడు. ఆ ఇల్లు పాడుబడిపోయింది. ఇంటర్ లో ఉండగా బస్సు లో విజయలక్ష్మి కనిపించింది. చూసి నవ్వుకున్నాం.

ఈ మధ్యనే ఆ ఇల్లు పడగొట్టి ఎవరో కొత్త ఇల్లు కట్టుకున్నారు. మేము గుడికి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి మీదుగానే వెళ్ళాలి. నా చూపు ఆ ప్రదేశాన్ని తడుముతూ ఉంటుంది. బోసి నోరుతో మా రావయ్యపంతులు గారు అక్కడే కూర్చుని ఉంటారు. నాలో ఏదో మూల, మన విలువ లకు మూలమైన దీపాన్ని వెలిగించింది మాత్రం ఆయనే......