తెలుగు దేశం పార్టీ ని కానీ, చంద్ర బాబు గారి ని కానీ ఏమైనా అన్నా , వాళ్ల సిద్ధాంతాలకి విరుద్ధంగా మాట్లాడినా ఆ పార్టీ విధేయులు, అభిమానులు , కులాభిమానులు,స్వలాభం కోసం చూసే వాళ్ళు ఊరుకోరు.
పార్టీ లో ఎన్టీఆర్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు అడుగంటిపోయిన రోజులివి. వాళ్ళు కూడా ఇక తప్పక ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి ఉంటున్నరేమో తెలీదు. చంద్రబాబు గారంటే అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఆయన ఆలోచన పద్ధతి,కష్టపడే తత్వం, అభివృద్ధి పరచిన తీరు చూసి నచ్చి ఉండచ్చు.

ఇక వై ఎస్సార్ పార్టీ కి కూడా ఇదేమి మినహాయింపు కాదు. ఇందులోనూ అభిమానులు,కులాభిమానులు,స్వలాభం కోసం అర్రులు చాచే వాళ్ళు ఉన్నారు. ఇందులో నిజంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి పార్టీ లో మనుగడ సాగిస్తున్న వాళ్ళు ఉండి ఉండవచ్చు.

ఇక జనసేన. ఇందులో రాజకీయంగా కన్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సంఖ్య ఎక్కువ. వాళ్ళు ఆయన కులానికి సంబంధించిన వారై ఉండచ్చు. వాళ్ళకి ఆయనొక ఆశ లా కనిపించి ఉండచ్చు.
ఈ అన్ని పార్టీ లలో సాధారణంగా కనిపించేది, వినిపించేది కులం. మన కులం వాడు కాబట్టి మనం సపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఆయా పార్టీలకి సంబధించిన మీడియా ఏదైతే చెప్తుందో అదే మాట్లాడతారు. అందులో నిజానిజాలకి సంబంధం లేదు. ఇందులో ఉండేది మూర్ఖత్వం. అకారణంగా మనకెటువంటి హాని చేయకపోయినా ఎదుటి వాడి మీద అసహ్యాన్ని,ద్వేషాన్ని పెంచుకోవడం.
ఆశ్చర్యంగా ఆయా పార్టీల గెలుపు ఓటములు మనకి ఏ విధంగా సహాయం చెయ్యవు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు ఏ రకంగానూ లాభపడరు. మన చుట్టూ కులం గోడలు కట్టి ఎదుటి వాడిలో ఉండే మంచిని కనిపించకుండా ద్వేషాన్ని నింపే ఈ పార్టీ లు ఏ రకంగానూ మన రాష్ట్రానికి సాయం చేయలేవు సరికదా ఇంకా నాశనం చేస్తాయి.

ఒక పక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే అంశం మీద ప్రజలందరినీ ఒకే తాటి మీదకి తీసుకు రావడం మానేసి మీది తప్పు మీరు అలాంటివాళ్ళు అంటూ మీడియా లో విషం జల్లుతున్న పార్టీలను వాటి భ్రమ లో పడి అసలు విషయాన్ని విస్మరిస్తున్న తెలుగు ప్రజలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం కుల ప్రాతిపదిక మీదన విడదీయబడ్దాం. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు మీ కులం మా కులం అంటూ మనకి మనమే గొప్పలు పోతు సాటి తెలుగు వాడిని ద్వేషిస్తే ఇప్పటి దాక ప్రాంతాల వారిగా విడిపడిన మనం ఇక కులాల వారిగా విడిపోతాం. కుల ప్రాతిపదికన రాష్ట్రం ఇస్తాం అంటూ భవిష్యత్తులో ప్రచారం చేసినా ఆశ్చర్యం ఉండదు. కుల ప్రాతిపదికన అధికారం ఇవ్వడం కాదు అర్హత ఉన్నవాడికి అధికారం ఇవ్వాలి, అపుడే దేశం ఐన రాష్ట్రం ఐన బాగుపడేది. ఎవరి అభిమానాలు వాళ్ళవి. కానీ మీరు వాళ్ళ ఎజండా లతో తోటి తెలుగు వాళ్ళ నుంచి విడిపోవద్దు. అభిమానం ఉంటే ఓటు వేసుకుందాం. కానీ మనలో మనం కొట్టుకొని కేంద్రం దృష్టిలో పలచన కావద్దు.
ఆలోచించండి. మేలుకోండి. #జైతెలుగోడా


తురుష్కుల దండయాత్రలకి పూర్వం భారత దేశం సంపద పరంగా
, సంప్రదాయాల పరంగా, కుటుంబ వ్యవస్థ పరంగా, రాజ్యాల పరంగా ఎంతో బలంగా ఉండేది.దండయాత్రలకి వచ్చిన తురుష్కులకి ఒక చిన్న రాజుని ఓడించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఎంత ప్రయత్నించినా బలం తో వీళ్ళని ఓడించడం కష్టమని తెల్సుకున్న వీళ్ళు, బలహీనతల మీద దృష్టి సారించారు.దేశమంతా హిందువులున్నా మా దేవుడు గొప్పోడంటే మా దేవుడు గొప్పోడని కొట్టుకునే అలవాటు ఉందని కనుక్కున్నారు. తోటి రాజులకి పడదని తెల్సుకున్నారు.ఒక్కో రాజు దగ్గరకి వెళ్లి వాళ్ళ సాయం తో తోటి రాజుల్ని ఓడించారు. దానికి ఈ రాజుల ఈర్ష్య సహాయపడింది. ఈ రాజులేమి రాజులుగా ఊరేగలేదు, ఆ తురుష్కుల సామంతులై కప్పం కట్టి ఊడిగం చేసారు.బ్రిటిషు వారి కాలంలో కూడా ఇదే తంతు కొనసాగింది. “మనం నాశనం అయిపోయిన పర్లేదు కాని అవతల వాడు మాత్రం బాగుపడకూడదు” ఈ ఆలోచన రాజులను సామంతులను చేస్తే జనాల జీవితాల్ని హీనంగా చేసింది.భారత దేశంలో భారతీయులు ఉండరని నానుడి. రాష్ట్రాల వారిగా,ప్రాంతాల వారిగా, కులమతాల వారిగా విడిపోయి బ్రతుకుతున్నారు. నేను భారతీయుడిని అని దేశం దాటితే గాని గుర్తురాని భారతీయులం మనం.అందులో ఉత్తర భారతం, దక్షిణ భారతం ఇలా విడదీయబడ్డ దేశం. అందులో ఈ తేడా రాజకీయాల్లో గట్టిగా కనపడుతుంది. దక్షిణాది నుంచి వచ్చి పెద్ద పదవుల్ని అలంకరించిన వారిని వేళ్ళ మీద చూడచ్చు. ఇది చిన్న చూపా, అవకాశం లేదా? దక్షిణాది వారు ఉపయోగించుకోవడానికి మాత్రమే పనికి వస్తారా?అసలు విషయానికి వస్తాను. బిజెపి అప్రతిహతంగా సాగుతున్న ఈ విజయ యాత్ర ను చూసి నేను కూడా సంతోషపడ్డాను,దేశం ఒక గాడిన పడుతుందని. కానీ పన్ను లు కట్టే వాళ్ళని చెరుకు మిషన్ లో పెట్టి పిండినట్టు పిండి ఎంత రాబట్టాలో అంత రాబట్టాలి అనే ఆలోచనని ఇష్టం లేకున్నా భరిస్తూ సాగుతున్న ఎందరో మధ్య తరగతి జనాల్లో ఒకడిగా దొడ్డి దారిన సంపాదించిన వాడికి శిక్ష పడకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అప్పుడు ఎంత నష్టం జరిగింది? ఎలా విభజించారు లాంటి పెద్ద విషయాల్లోకి వెళ్ళనుగానీ రాష్ట్రం నష్టపోయిందని మాత్రం ఎవరిని అడిగినా చెప్తారు.మరి అభివృద్ధి ఎలా? పవన్ కళ్యాణ్ తెలుగు దేశానికీ అనుకూలంగా ప్రచారం వలనో, ఇలాంటి పరిస్థితి లో బాబు లాంటి అనుభవజ్ఞుల వలన రాష్ట్రం బాగుపడుతుందనో, జగన్ లాంటి యువకుడిని(అనుభవ లేమి కారణం కావచ్చు) కాదని బాబు కి ఓటేశారు జనాలు.ప్రత్యెక హోదా మీద 4 ఏళ్ళ పాటు నాన్చి ఇప్పుడు కుదరదని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశారు కేంద్రం వాళ్ళు. కడుపు మండిపోతుంది మాములు జనాలకి.విభజన జరిగేప్పుడు, ఇంత మంది MP లు ఉండి ఏం చేస్తున్నారు? ఒక్కరన్నా గట్టిగా మాట్లాడండి అంటే.మేమెందుకు మాట్లాడాలి అని కాంగ్రేసు వాళ్ళు, వాళ్ళు మాట్లాడకపోతే మాదెం పోయిందని తెలుగు దేశం వాళ్ళు ఎవరు మాట్లాడకుండా విభజన జరిగాక ఎంతో గొప్పగా నటించి ఆశ్చర్యాన్ని బాధని వెలిబుచ్చారు.ఇపుడు కూడా అదే జరుగుతుంది. మోసం చేయడం మాములే, తెలుగు వాళ్ళకి మోసపోవడం మాములే.మీరు (MP లు) బిజెపి వాళ్ళ లా మాట్లాడతారు,తెలుగుదేశం వాళ్ళలా మాట్లాడతారు, వైఎస్సార్ సిపి లా మాట్లాడతారు. అందరు కల్సి తెలుగు వాళ్ళమని మర్చిపోయి చచ్చారు. కల్సి మాట్లాడండి. మేము తెలుగు వాళ్ళం, మా వాళ్ళు నష్టపోతున్నారు. ఒక సారి మనం మేం అని వినాలని ఉంది.మా బిజెపి చాలా చేసింది, మా తెలుగు దేశం వల్లే రాష్ట్రం ఇలా ఐన ఉంది. ఏం చేయలన్నా పదవి లో ఉండాలని వై ఎస్సార్ సిపి.... పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశ్నలు వేస్తాడు. ఒక మంచి పని చేయాలంటే ఆయనకి 4 ఏళ్ళు పట్టింది.మీదేం పోదు. ఈ పార్టీలో కాకపోతే ఆ పార్టీలో, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా. జనాలకి వాళ్ళ కడుపు మంట వినే వాడే కరువయ్యాడు. మీ డ్రామాలు ఆపండి. ఏమైనా చేయగలిగితే చేయండి లేదా మాకు ధైర్యం లేదు. మా బతుకులింతే అని వదిలేయండి. మిమ్మల్ని చూసి తెలుగు వాళ్ళంతా ఇదే రకం అని దేశం అనుకుంటుంది.మాకంటూ ఒక రాజధాని లేదు. హైదరాబాద్ లో ఉద్యమం జరుగుతున్నప్పుడు “సిగ్గులేదంట్రా, ఎన్ని రోజులుంటారు” అన్న మాటలు విని, చెన్నై కో బెంగళూరు కో ఉద్యోగాలకోసం వలస వెళ్ళిన జనాలు ఎప్పటికైనా మాకంటూ ఒక రాజధాని అందులో ఉద్యోగాలు రాకపోవా అని ఎదురు చూస్తున్న జనాలని చూడండి.జిల్లాకో మంచి ఆసుపత్రి లేక ప్రతి దానికి విజయవాడ కి పరిగెత్తుతున్న జనాలని చూడండి.అయినా తప్పు లేదులే ఇపుడు మీరు ముగ్గురు విడిపోయారు, మీతో పాటు జనాలని కూడా కులాల ప్రాతిపదిక మీద విడదీస్తారు. మాకు సిగ్గులేదు. అసలు విషయం వదిలేసి కుక్కల్లా కొట్టుకొని మళ్ళీ ఇదే బతుకు బతికేస్తాం. విడిపోవడం మాకలవాటు. విడగొట్టడం మీకలవాటు. ఎన్ని తరాలు మారినా మేం నేర్చుకోం. #జైతెలుగోడా



వంశీ చనిపోక ముందు 3 వారాల పాటు ఆ ముసలివాడి ఆత్మ వంశీ ని వేడుకుంటూ హింసించింది. ఆఫీస్ లో తన ప్రవర్తన వలన జాబ్ లోంచి తీసేశారు. మానసిక వైద్యుల చుట్టూ, తాంత్రికుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వంశీ ఏదైతే అది అవుతుందని ఇంతకు ముందు ఆ ఊరు చూసిన చోటికి బయల్దేరడానికి నిశ్చయించుకుని వచ్చేసాడు. ఇది తెలిసిన సుబ్బు వాళ్ళ చిన్నమ్మమ్మ కి ఫోన్ చేసాడు. వంశీ ని పెంచింది ఆవిడే. జరిగిందంతా విన్న తరువాత, ఆవిడ చెప్పిన మాటలు ఇవి. వాళ్ళ నాన్న కూడా ఇలానే చనిపోయాడని, ఇది తెల్సిన వాళ్ళమ్మ చనిపోయింది. వీళ్ళ కుటుంబం ఎన్నో సంవత్సరాల క్రింద ఎక్కడ నుంచో వచ్చి అక్కడ స్థిరపడి పోయారు.
వంశీ కనపడకుండా పోయిన వారం రోజుల తరువాత విషయం తెల్సి సుబ్బు కి ఫోన్ చేసింది మృదుల ."సుబ్బు, నీకో మాట చెప్పాలి. అసలు వంశీ కనపడకుండా పోవడానికి కారణం నేనే?" అని ఆగిపోయింది. "ఏమంటున్నావ్ నువ్వు?". "వంశీ ని గేటెడ్ కమ్యూనిటీ అని తీసుకు వెళ్ళా కదా, అక్కడ అలాంటిదేమీ లేదు." అవతల నుంచి నిశ్శబ్దం. "ఒక వారం పాటు ఒక ఆత్మ నన్ను హింసించింది. వంశీ ని అక్కడ తీసుకురాకపోతే, మా ఆయన్ని చంపేస్తానని భయపెట్టింది. ఒక ఆక్సిడెంట్ కూడా అయింది. అదృష్టం ఏంటంటే ఆయన చిన్న దెబ్బలతో బయటపడ్డాడు.", "స్వార్ధం చూసుకున్నావా మృదుల?". "అది కాదు సుబ్బు". "మాట్లాడద్దు నువ్వు. ఒక్క మాట చెప్పి ఉంటే, ఏదోలా ప్రయత్నం చేసి ఉండే వాళ్ళం. తల్లి తండ్రి లేనోడు వాడు. మనమే కుటుంబం అనుకున్నాడు. అలాటిది మన వల్లే......" సారీ చెప్పే లోగానే ఫోన్ కట్ ఐంది.
బొబ్బిలి స్టేషన్ లో కేసు పెట్టారు సుబ్బు వాళ్ళు. హైదరాబాద్ లో మిస్ అయితే ఇక్కడ కేసు ఏంటని పట్టించుకోలేదు వాళ్ళు.
వంశీ ఏమైపోయాడో ఎవరికీ తెలీదు.
అది 1947 వ సంవత్సరం జూలై నెల. కొలనుకోట గ్రామం లోని కొందరు పెద్ద కుటుంబంలోని వారు బొబ్బిలి కోటలో ఆంగ్లేయులతో సమావేశం అయ్యారు.
ఆ ఆంగ్లేయుల అనువాదకుడు వాళ్ళకి వివరించసాగాడు. "మీ గ్రామంలో ఉన్న వైధ్యనాదుని ఆలయంలో ఉన్న ఆ పుస్తకం మాకు కావాలి. మీ వాళ్ళని నాయనా భయానా అడిగి చూసాం. కానీ వారు ఇవ్వడానికి సుముఖంగా లేరు. మీరు మాకు తెల్సు కాబట్టి ముందుగా ఒక మాట చెప్పాలని పిలిపించాం. ఆ పుస్తకాన్ని బలవంతంగా అయినా మేము తీసుకు వెళ్తాం. కాదని ఎదిరిస్తే ప్రాణం తీయడానికి వెనుకాడం. అది మీ దగ్గర ఉండడం కన్నా మా దగ్గర ఉండడం మంచిది. మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే ఆ ఊరు వదిలి వెళ్ళండి. ఈ విషయం మీ ఊరి వాళ్ళకి చెప్పి వెళ్ళినా సరే చెప్పకుండా వెళ్ళినా సరే, మీ ఇష్టం. ఇక మీరు వెళ్ళచ్చు." అని ముగించారు.

అలా ప్రాణాలకి భయపడి విషయాన్ని దాచి ఒక కుటుంబం ఆ ఊరిని వదిలి  వెళ్ళింది. అసలు విషయం తెలీక ఆ ఊరంతా ఒక రాత్రి ఆంగ్లేయుల నరమేధానికి బలైంది. ఆ రాత్రే బ్రిటీషు వాళ్ళు స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. దేశమంతా సంబరాల్లో ఉంటే ఆ ఊరు లో మాత్రం ఒక్కరు  కూడా బ్రతకలేదు. చంపిన అందరిని ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక లోతైన నేలబావిలో వేసి కాల్చేశారు. ఆ గుడిని,ఊరిని కూడా ధ్వంసం చేసారు. ఆ ఊరి గురించి జనం ఆలోచించడానికి చాల రోజులు పట్టింది.
అప్పటికి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయిందా ఊరు.
అలా నమ్మకద్రోహానికి గురి అయ్యామన్న బాధలో ఆ చనిపోయిన వారంతా ఆత్మలై అక్కడే ఉండిపోయారు.ఆ ఊరి నుంచి వెళ్ళిన కుటుంబలో ప్రతి ఒక్కరిని ఇలానే ఆ ఊరికి తీసుకు వచ్చి చంపేశారు. అందులో మిగిలిన చివరి వాడు వంశీ.

ఆ పుస్తకం మాత్రం లండన్ మ్యుజియం లో బధ్రపరచబడివున్నది.


                                                                             (సమాప్తం)
వంశీ భయం తో బిగుసుకుపోయాడు.
వంశీ అంటూ అరుస్తుంది మృదుల. వంశీ రెప్ప వేసి తెరిచే లోగా ఆ ముసలివాడు గుట్ట మీద కనపడలేదు. తల పట్టుకుని నొక్కుకుంటున్నాడు. "జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |జయ కపీశ తిహు లోక ఉజాగర" అంటూ వంశీ ఫోన్ మోగింది. ఒక్క క్షణం లో అంతా సర్దుకుంది. ఇక్కడ ఉండటం అంత మంచిది కాదని అర్ధం ఐంది వంశీ కి. వెంటనే గేర్ మార్చి కార్ ని పరిగెత్తించాడు. ఓ అర గంట తరువాత దూరంగా లైట్లు కనపడ్డాయ్. హైవే వచ్చేసింది. ఎలాగోలా బయటపడి ఎప్పటికో ఇల్లు చేరారు.
స్నేహితులంతా తమ కోసం ఎదురుచూస్తున్నారు. ఏమైందంటూ చుట్టూ మూగి ప్రశ్నల వర్షం కురింపించారు. మృదుల మాత్రం వంశీ ని అనుమానంగా చూస్తూ లోపలి వెళ్ళింది.
వంశీ కి మాత్రం దడ తగ్గలేదు. వచ్చి గమ్మున కూర్చున్నాడు. అందరూ అడుగుతున్నా ఏం సమాధానం చెప్పలేదు.
రాత్రంతా నిద్ర లేదు,ఒకటే జ్వరం.ఎవరితోనూ మాట్లాడనూ లేదు. అంతా కల లా ఉంది. ఉదయాన్నే మృదుల చెప్పకుండా నే వైజాగ్ వెళ్ళిపోయింది.అందరూ కల్సి హైదరాబాద్ బయల్దేరారు.వంశీ కార్ లో వెనక ఒక మూల కూర్చుని మౌనంగా ఉన్నాడు. ఎవరూ ఏంటని అడగలేదు. చీకటి పడుతుందనగా, వంశీకి జ్వరం పెరిగింది. నిద్రలో పలవరించసాగాడు. అప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వంశీ తో పాటు పెళ్ళికి వచ్చిన వంశీ రూమ్మేట్ సుబ్బు తనని తీసుకెళ్ళి ఫ్లాట్ లో పడుకోబెట్టి తినడానికి ఏమైనా తెద్దామని బయటకి వెళ్ళాడు.
మగత నిద్రలో ఉన్న వంశీకి ఎవరిదో ఏడుపు వినిపించింది.మలేసియన్ టౌన్షిప్ లో పదకొండో అంతస్తు లో ఉండే తనకి ఎవరు ఏడుస్తున్నారో అర్ధం కాలేదు. చుట్టు పక్కల ఫ్లాట్స్ కూడా ఖాళీగా ఉన్నాయ్. భయం గుండెను పరిగెత్తించ సాగింది.కళ్ళు తెరవడానికి ధైర్యం చాల్లేదు. దూరంగా వినిపించే హారన్ సౌండ్స్ లో కూడా ఆ ఏడుపు భయంకరంగా ఉంది.కళ్ళు తెరిచే ధైర్యం లేదు, అలా అని కళ్ళు మూసుకొని ఉండలేడు.మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే గుండె ఆగిన పని ఐంది. మంచం పక్కనే కాళ్ళ దగ్గర కూర్చుని తననే చూస్తూ ఉన్న ముసలాడు. కానీ ఏడుపు మాత్రం వాడిది కాదు. బిక్క చచ్చిపోయాడు వంశీ. ఇంతలో కిర్రుమంటూ వచ్చిన తలుపు శబ్దం ఆ ఏడుపు ని ఆపేసింది, ముసలాడు కూడా కనపడకుండా పోయాడు. సుబ్బు వచ్చి లైట్ వేసాడు. వంశీ పరిస్థితి చూసి భయపడిపోయాడు. "ఏంటి మామా ఇది?" అని లేపి "ఇక్కడొద్దు పద క్రిష్ణ గాడి ఫ్లాట్ కి పోదాం" అంటూ లాక్కుపోయాడు.  క్రిష్ణ ఫ్లాట్ కి వెళ్ళాక కూర్చోబెట్టి ఏమైందని అడిగారు. జరిగిందంతా వివరంగా చెప్పాడు వంశీ. సుబ్బు నవ్వాడు "మామా, దీనికే ఇలా అయితే ఎలా? అక్కడితో ఐపోయింది కదా. వదిలేయ్". "లేదురా నాకా ముసలోడు మళ్ళీ కన్పించాడు మన ఫ్లాట్ లో" అన్న మాట విని ఉలిక్కిపడ్డాడు సుబ్బు. సుబ్బు స్వతహాగా భయస్తుడు. అంతో ఇంతో వంశీ నే ధైర్యవంతుడు వీళ్ళలో.
అందరూ కూర్చుని ఉన్నారు. వంశీ మాత్రం "నాకు తల పగిలిపోతుంది రా నేను పడుకుంటాను" అని ఒక బెడ్ రూమ్ కి వెళ్లి పోయాడు. పడుకున్నాడే కాని, చెవిలో ఎవరో గుసగుసలాడుతున్నారు . అందులో వైద్యనాదుడు, కొలనుకోట,నాశనం ఇంకా ఏవో పిచ్చి అరుపులు వినిపించాయి. ఇక ఏం చేయలేక ఒక నిద్ర మాత్ర వేసుకొని పడుకున్నాడు. ఎప్పటికో మెలకువ వచ్చింది. క్రిష్ణ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. సుబ్బు మాత్రం ఆఫీస్ కి సెలవు పెట్టి ఉన్నాడు. "మామా, చూడరా కళ్ళు ఎలా గుంటలు పడ్డాయో. అసలది దెయ్యమో, ఆత్మో. వీటిని సినిమాల్లో చూడ్డం తప్ప బయట పెద్దగా పరిచయం లేదు. నువ్వేమో రెండు రోజులకే ఇలా ఐపోయావ్. ఎవర్ని అడగాలి రా? లేకపోతే ఎవర్నైనా బూత వైద్యుడిని పిలుద్దామా? ఇలా కాదు కానీ ముందు ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం పద" అంటూ ఫ్రెష్ అయి దగ్గరలో ఉన్న గుడికి తీసుకు వెళ్ళాడు. పూజ చేయించుకొని బయటకి వచ్చి కూర్చున్నారు. ఇప్పటికీ సుబ్బు కి నమ్మకం కలగలేదు అని తెలుస్తూనే ఉంది అలా అని తనని నమ్మించడానికి వంశీ ఎలాంటి ప్రయత్నము చేయడం లేదు. ఇంతలో ఒక పెద్దాయన దర్శనం చేసుకొని వచ్చి వీళ్ళ పక్కనే కూర్చున్నాడు, చూడ్డానికి పల్లెటూరి కి చెందినవాడిలా కనిపించాడు."గుడికి వచ్చినా కూడా ప్రశాంతత లేకుండా పోయిందయ్యా. ఈ గోల ఏంటో" అని తనలో తానూ అనుకున్నట్టు గా వంశీ వైపు చూసి "ఏమైంది బాబు అలా ఉన్నావు?" అని అడిగాడు. వంశీ నుంచి సమాధానం రాకపోయేసరికి సుబ్బు వైపు తిరిగాడు. చెప్పడం ఇష్టం లేకపోయినా, ఏదైనా సలహా వస్తుందేమో అని "మా వాడికి దెయ్యాలు కనిపిస్తున్నాయండి. చీకటిపడితే ఒకటే అరుపులు, ఏడుపులు. అందుకే ఇలా ఐపోయాడు." అని చెప్పాడు. " అవునా, అంతేనయ్యా వాటి కోరికలు తీరిందాక, తీర్చిందాక అవి వదలవు. మా మేనత్త వాళ్ళ ఆయన అక్క కి కూడా ఇలానే అయితే, ఆంత్రం వేసి ఎం కావాలని అడిగి ఆ కోరికేందో తెల్సుకొని తీర్చిందాక వదలలేదు ఆయన్ని." అన్న మాట విని తలెత్తి చూసాడు వంశీ. "నిజంగానే ఉంటాయా దెయ్యాలు" అని అడిగాడు. "అదే కదా చెప్తుంది. వాటి కోరిక తీర్చిందాక, నీ పరిస్థితి ఇంతే. గుడికెళ్ళి తాయత్తులు కట్టించుకున్నా కొన్ని రోజులు మాత్రమే పని చేస్తాయి" అని తన ధోరణి లో తాను చెప్పుకుపోతున్నాడు. ఇంకా అక్కడ ఉండలేక ఫ్లాట్ కి వచ్చేసారు.
సుబ్బు ని కూర్చుబెట్టి వివరంగా చెప్పసాగాడు వంశీ."ఆ ఊర్లో నేను ఈ ముసలోడితో పాటు చూసిన వాళ్ళంతా ఆ ఊరి వాళ్ళే అయి ఉంటారు. అక్కడేదో జరుగుతుంది. నన్ను అక్కడ చూసినప్పటి నుంచీ ఆ ముసలోడు నా వెనకనే పడ్డాడు. వాడికి నా సాయం కావాలేమో అనిపిస్తుంది. నాకర్ధం కానీ విషయం ఏంటంటే నన్నే ఎందుకు అని?" అని ఆగిపోయాడు. సుబ్బు కి ఈ మధ్యకాలం లో రిలీజ్ ఐన అన్ని హారర్ తెలుగు సినిమాలు తలలో తిరుగుతున్నాయ్. ఇంతలో విష్ణు ఫోన్ మోగింది.
సుబ్బు ఫోన్ ఎత్తి "ఆ చెప్పరా, అవునా? ఎప్పుడు రేపా? సరే. రేయ్ విషయమంతా చెప్పావా. సరే మామా పొద్దున్నే ఫ్లాట్ కి వస్తాం" అంటూ ముగించాడు. "విష్ణు గాడు రా, వాడికి తాత వరసయ్యే ఒకాయన వస్తున్నాడంట రేపు. ఆయనకి ఈ విషయాల గురించి కొంచెం ఐడియా ఉందంట. రేపు పొద్దున్నే రమ్మన్నాడు కొంచెం స్నానం అది చేసి". వంశీ వింటున్నాడే కానీ చీకటి పడుతుందంటేనే భయం వేస్తుంది. ఆ ఏడుపులు వినడానికి భయంకరంగా ఉన్నాయి.
అక్కడ ఉండలేక ఒక సినిమా చూసి , బయట తిరిగి తిని చీకటిపడుతుందనగా ఫ్లాట్ కి వచ్చారు. వస్తూనే స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చుకున్నాడు వంశీ. రావడంతోనే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకుండి పోయాడు. పొద్దున్నే లేచేసరికి సుబ్బు ఆంజనేయ స్వామి ఫోటో పక్కన పెట్టుకొని ఫ్లోర్ మీద పడుకొని ఉన్నాడు. గదంతా చిందరవందరగా ఉంది. తలంతా బరువుగా ఉంది.
"రేయ్ సుబ్బుగా, రేయ్" అని గట్టిగా అరిచాడు. అదిరిపడి లేచాడు సుబ్బు. వాడి ముఖం చూసి ఆగిపోయాడు వంశీ. "నీ యబ్బ, ఇంకో టాబ్లెట్ తెస్తే నీ సొమ్మేం పోయిందిరా. రాత్రి ఆ ముసలోడు నా ప్రాణం తీసాడు రా నిన్ను లేపమని. కనపడడు. ఒకటే గోల. వస్తువులన్నీ ఎగిరిపడ్డాయ్. నా దరిద్రానికి కరెంటు లేదు. నా వల్ల కాదు ఇంకా. ముందు విష్ణు గాడి ఫ్లాట్ కి పోదాం పద" అని రెండు జతల బట్టలు బాగ్ లో వేసుకొని లాక్కెళ్ళాడు.  
వీళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అయ్యే సరికి 75 ఉంటాయేమో ఒక పెద్దాయనని తీసుకువచ్చాడు విష్ణు. ఆరడుగుల పొడుగు, బక్క పలచగా ఉన్న ఆకారం. చాలా మాములుగా ఉన్నాడాయన. కాఫీ టిఫిన్ లు కానిచ్చి విషయం అందరూ కూర్చుని విషయం మళ్ళీ ఒక్క సరి చెప్పారాయనకి. అంతా విన్న తరువాత, ఆయన తన బాగ్ లోంచి ఒక పుస్తకం తీసి చెప్పడం మొదలు పెట్టాడు. " నీ విషయం విన్న తరువాత నాకు తెల్సిన కొన్ని విషయాలను కలిపి లైబ్రరీ లో ఉన్న పుస్తకాల ద్వారా నాకు ఒక ఒక కొత్త విషయం తెల్సింది. నువ్వు చెప్పిన ప్రదేశం దగ్గర లో స్వాతంత్ర్యం రాక ముందు "కొలనుకోట" అని ఒక ఊరు ఉండేది. ఆ ఊరికి ముఖ్యమైన ఆకర్షణ ఆ ఊరి వైధ్యనాదుని గుడి. అది ఎప్పుడు ఎవరు కట్టించారో తెలీదు కానీ చాలా పాతది.
ఆ గుడి ఆలయ అర్చకుని దగ్గర వంశ పారంపర్యంగా వస్తున్న ఒక గ్రంధం ఉండేది. అందులో ఏమి ఉందొ ఎవరికీ తెలీదు కానీ, అక్కడకి ఏ జబ్బుతో వచ్చే వాళ్ళనైనా ఇట్టే నయం చేసి పంపే వాళ్ళు. ఆ గుడికి అందరు రాజులూ, జమిందారు లు తమకు తోచిన కానుకలు సమర్పించుకున్నారు. స్వాతంత్ర్యం రాకముందు వరకూ ఆ గుడి వైభోగం చెప్పనలవి కాదు." అని ఆపాడు. అసలు ఈ దెయ్యాలకీ ఈ కథ కీ సంబంధం ఏంటో తెలీక విసుగ్గా చూసాడు వంశీ. ఇదేమీ పట్టించుకోకుండా కొనసాగించాడు ఆ పెద్దాయన. " ఏమైందో తెలీదు కానీ స్వాతంత్ర్యం తరువాత గుడి కూలిపోయింది. పుస్తకం మాయమైపోయింది. ఆ తరువాత ఆ ఊరు ఏమైందో అందులో జనాలు ఏమయ్యారో ఎవరికీ తెలీదు. నీకు వినిపించిన కొలనుకోట , వైద్యనాదుడు అనే మాటల వెనక వినిపించిన కథ ఇది. ఒక లైబ్రేరియన్ గా పని చేసిన నాకు తెలిసిన విషయాలు ఇవి. ఇక ఆత్మల గురించి అయితే ఒక మాట చెప్తాను. దాని కన్నా ముందు నీకు ఊరితో ఏమైనా సంబంధం ఉన్నదా?" అంటూ వంశీ వైపు చూసాడు. "నాకేం తెలీదు, ఆ ఊరి పేరు వినడం కూడా ఇదే మొదటి సారి. నాకు వెనకా ముందు కూడా ఎవరూ లేరు" అని ఆగాడు.
హ్మ్ అంటూ నిట్టూర్చాడు ఆ పెద్దాయన.
"మరి ఇందులోంచి బయటపడే దారేది" అంటూ అడిగాడు సుబ్బు.
"నాకు తెల్సిన ఒక పూజారి ఉన్నాడు. ఆయన్ని ప్రయత్నించి చూడండి. మీ సమస్యకి కొంత వరకు పరిష్కారం దొరకచ్చు" అంటూ ఆ వివరాలు ఇచ్చి ఆయన పని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు.
హైదరాబాద్ లో ఉండే ఆ పూజారి దగ్గరకి వెళ్లి ఆయన పూజ చేసి ఇచ్చిన తాడు కట్టించుకొని ఫ్లాట్ కి వచ్చారు.ఎందుకైనా మంచిదని నిద్ర మాత్రలు వేసుకున్నారు ఇద్దరూ. ఆ రాత్రి సాఫీగా సాగింది.
వంశీ టీం లీడ్ కి ఫోన్ చేసి నైట్ షిఫ్ట్ చేస్తామని అడిగారు. రాత్రైతే జనాలు ఉంటారు సందడిగా ఉంటుంది కదా అని. ఆఫీస్ పని రాత్రి 3 ఇంటి దాక ఉంటుంది.
రాత్రి 1 గంట కి వాష్ రూమ్ కి వెళ్ళిన వంశీ కి వాష్ రూమ్ అద్దం పక్కన ఎవరో నిలబడి ఉన్నారు. పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు. వాళ్ళు మాత్రం కదలడం లేదు.  ఇంతలో ఏడుపు మొదలైంది. అదే ఏడుపు.తిరిగి చూస్తే ముసలాడు. గుండె ఆగినంత పనయింది. "రావా, కొలనుకోటకు రావా" అని ఏడుపులు, అరుపులు. ఎలా వచ్చిపడ్డాడో తెలీదు కేబిన్ కి.
తను అరిచిన అరుపులకి అందరూ పరిగెత్తుకువచ్చారు. ఏమైందని అడిగిన వాళ్ళని సుబ్బు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగా, వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చాడు. "ఇస్ ఎవిరి థింగ్ ఆల్రైట్? ఏమైంది సుభాష్?" అని అడిగాడు. "లేదు సర్ వంశీ ఏదో చూసి భయపడ్డాడు" అని మాట మార్చాడు. "ఎంత భయపడితే మాత్రం అంతలా అరవాలా ? చూడు జిప్ కూడా పెట్టుకోకుండా వచ్చాడు. టేక్ కేర్. టీం, గో అండ్ డూ యువర్ వర్క్" అని వెళ్ళిపోయాడు. భయపడడం కన్నా అందరి ముందు అలా చేయడం సిగ్గనిపించింది వంశీ కి.
సరిగ్గా మూడు వారాల తరువాత అర్ధరాత్రి తను ఎక్కడైతే ఆ ముసలివాడిని చూసాడో ఆ ఊరికి దగ్గర లో ముసలి వాడి ఆత్మ వెనుకనే నిశ్సబ్దంగా నడుస్తున్నాడు వంశీ. దూరంగా పాడుబడిన గోపురం. 


ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందో ఏమో, బీప్ బీప్ మని కొట్టుకోసాగింది. పండు వెన్నెల.స్స్స్ మంటూ గాలి. దూరంగా కొలనుకోటలో ఏదో కోలాహలం. అంతా హడావిడిగా ఉంది. కొంత దూరం పోయాక ఆ ముసలివాడి ఆత్మ ఆగిపోయి కిందకి చూసింది. పాతాళానికి దారి చూపిస్తున్నట్టున్న పెద్ద నేల బావి.
"చెప్పు తాతా, ఎక్కడ ఉందా పుస్తకం? ఈ బావి లోనా?" అంటూ తొంగి చూసాడు. అప్పటి దాకా దైన్యంగా ఉన్న ముసలివాడి ముఖం వికృతంగా మారింది. వంశీ దగ్గరకి గాల్లో ఎగురుతూ వచ్చి బావిలోకి తోసేసాడు.అర్ధం అయ్యే లోపే వంశీ తల నేలని తాకింది. టప్ మన్న శబ్దం. మెడ ఎముక విరిగినట్టుంది. కానీ కొస ప్రాణం ఉంది. ఇంతలో ఫోన్ మోగింది.
ఎంతో కష్టం మీద ఫోన్ ఎత్తాడు వంశీ, ఫోన్ లో సుబ్బు"మామా, ఎక్కడున్నావురా? ఇప్పుడే నాకో విషయం తెల్సింది. మీ అమ్మమ్మ చెప్పింది. నువ్వు మాత్రం ఆ ముసలివాడి మాటలు విని అటు వెళ్ళద్దు రా. వాళ్ళు నిన్ను చంపేస్తారు. హలో హలో". ఫోన్ ఆఫ్ ఐంది. బావి పైనుంచి లీలగా మాటలు విన్పించాయి. "చచ్చాడా?" "ఆ చచ్చినట్టే. వీళ్ళ నాన్నకి పట్టిన గతే వీడికీ పట్టింది" అంటూ వికృతంగా అరుచుకుంటూ వెళ్ళిపోయాయి ఆ ఆత్మలన్నీ. అంతా నిశ్శబ్దం. ఆ మాట్లాడుకున్న వాళ్ళంతా ఆ రోజు తనకి కనిపించిన వాళ్ళే. తను ఎందుకు ఇలా చావాల్సి వచ్చింది? తన తండ్రికి ఉన్న సంబంధం ఏంటి? ఇలా ఆలోచిస్తుండగానే వంశీ ప్రాణం పోయింది.

(ఇంకా ఉంది)
హైదరాబాదు లో ఐటి కంపెనీ లో పని చేస్తున్నవంశీ కి పాత మితృడి పెళ్లి కోసం బొబ్బిలి వెళ్ళాల్సి వచ్చింది.
పెళ్లి లో క్లాస్మేట్స్ చాలా మంది కనిపించారు మృదుల కూడా. మృదుల మంచి స్నేహితురాలు, అమెరికా లో ఉంటుంది. ఇక్కడకి వచ్చి సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. బొబ్బిలి దగ్గర లో గంగాడ అనే ఊరి అవతల ఏదో గేటెడ్ కమ్యూనిటీ ఉంది చూద్దాం పద అంది. అలాగే పెళ్లి అయ్యాక మధ్యాన్నం బయల్దేరారు కార్ లో.  బొబ్బిలి దాటి పల్లెటూర్ల మధ్య నుంచి ప్రయాణం సాగింది. గంగాడ దాటాక మట్టి రోడ్డు.
“ఎలా వెళ్ళాలో తెలుసా” అని అడిగాడు.
“అదే చూస్తున్నా ”  అంటూ google మాప్స్ లోకి చూస్తుంది మృదుల. “ఈ రోడ్డునే పద” అంది.
తన ప్రమేయం లేకుండా తీసుకున్న ఆ మలుపు తన జీవితాన్ని మలుపు తిప్పబోతుందని తెలీదు వంశీ కి.
అప్పటికే సూర్యుడు సెలవు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దూరంగా ఓ ఊరు కనిపించింది.
“అదేంటి మళ్ళీ ఏదో ఊరు వచ్చింది? అసలు సరిగ్గా చూసావా?” విసుగ్గా అన్నాడు వంశీ.
“ఇక్కడే అన్నారు,కానీ ఈ ఊరేంటో ” అంటూ ఆగిపోయింది.
చిన్నగా ఊరు దగ్గర కాసాగింది. దగ్గరయ్యే కొద్దీ కొన్ని విషయాలు వంశీ నీ విస్తుపోయేలాచేసాయి. సాయంకాలం అయేసరికి గూటికి చేరే పిట్టల సవ్వడి ఎక్కడ వినపడలేదు, ఎక్కడో అరిచే గుడ్లగూబ శబ్దాలు తప్ప.
ఊరు దగ్గర కి వచ్చేసింది. అన్ని చిన్న ఇల్లు,ఎప్పటివో రాజుల కాలం నాటి కట్టడాల్లా ఉన్నాయి. ఊరి మధ్యలో ఒక ఒంటి స్తంభం లాంటి మేడ. ప్రతి అంతస్తు పైకప్పు చుట్టూ గంటలు కట్టి,చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి.
ఎక్కడో దూరంగా పాడుబడిపోయిన గుడి గాలిగోపురం కళాకాంతులు కోల్పోయి ఉంది.
ఇంతలో గంటల శబ్ధం వినపడి రోడ్డు వైపు చూసాడు వంశీ. రోడ్డు నిండా ఎద్దుల బళ్ళు వస్తూ కనిపించాయి. ఆ ఎద్దుల్లో జంతువులలో ఉండే స్వచ్చత ఏ కోశానా కనపడ్డం లేదు, ఒక రకమైన క్రూరత్వం తొణికిసలాడుతుంది. ఆ బండ్లను ఎవరూ నడపడం లేదు.అన్నీ బండ్లకీ కలిపి ఒకడే ఉన్నాడు, వాడు కూడా దున్నపోతు లా ఉన్నాడు.వాడి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఎద్దులు కారు మీదకి వస్తుంటే అదిలించి “ఏం కావాలి” అన్నటు కళ్ళు ఎగరేసాడు. కారు పక్కన ఆపి దిగి ,
“గేటెడ్  కమ్యూనిటీ” అని నసిగాడు వంశీ దాని పేరు కూడా మర్చిపోయి. “ఆ” అన్ని గట్టిగా హూంకరించాడు. ఈ సారి ఆ మాట కూడా బయటకి రాలేదు. “వెనక్కెళ్ళిపో, లేకపోతే చచ్చిపోతావ్” అని బెదిరించి వెనక్కి చూస్తూ వెళ్ళిపోయాడు .
ఆ ఎద్దులు రేపిన దుమ్ము తెర వెనక ఏదో కోలాహలం వినిపించింది. “హమ్మయ్య ఎవరో మనుషులు ఉన్నారు” అనుకుంటూ ముందుకు కదిలాడు.  కొంత దూరం వెళ్ళగానే ఓ పది మంది మృగాల్లాంటి మనుషులు పక్కన నిలుచుని ఉండగా ఓ వృద్ధుడు మోకాళ్లమీద నిలబడి ఉన్న నలుగురి వైపు క్రూరంగా చూస్తూ ఉన్నాడు. ఓ మూలన పూర్తిగా జీర్ణమై పోయిన బట్టల్లో ఓ మనిషి వైపు తిరిగిన ఆ వృద్ధుడు “ఏరా, ఇంకా ఆశ చావలేదా? వీళ్ళు వచ్చి ఆ సంపదని గుడికి చేరుస్తారనుకుంటున్నావా? అందరికీ పట్టిన గతే వీళ్ళకీ” అని మాట ముగించే లోగా, ఆ పది మంది గొడ్డళ్ళు,కత్తులతో ఆ నలుగురినీ నరకడం మొదలు పెట్టారు. అక్కడ నుంచి పారిపోవాలని అనిపిస్తున్నా అడుగు కదలడం లేదు వంశీ కి. స్థాణువు లా నిలబడిపోయాడు. ఆ చింకి బట్టల వాడు తనలో తాను కుమిలిపోతున్నాడు. జీర్ణావస్థ లో ఉన్న ఒక పుస్తకం ఆ ఒంటి స్థంభం మేడలోకి చేర్చబడింది.ఇంత జరిగినా ఆ ఊరిలో ఎలాంటి అలికిడి లేదు. తనని గమనించే లోగా అక్కడ నుంచి వచ్చేయాలని వంశీ ప్రయత్నం. ఇంతలో ఆ మూలన ఉన్న మనిషి తనని పట్టి పట్టి చూస్తున్నట్టు అనిపించింది. నిజమే, తన దగ్గరకి వచ్చి చూస్తున్నట్టుంది. ఆ కళ్ళలో దైన్యం, ఆవేదన, అభ్యర్ధన ఉన్నాయి.వళ్ళంతా నీరసం కమ్మి నిలబడిన చోటే పడిపోయేలా ఉంది పరిస్థితి. ఇంకాసేపు ఉంటే వాళ్ళకి పట్టిన గతే తనకీ పడుతుందని కారు దగ్గరకి బయల్దేరాడు. అక్కడ ఉన్న వాళ్ళ వేషధారణ వింతగా ఉండటం తన దృష్టి నుంచి దాటిపోలేదు.
కారు దగ్గరకి వెళ్ళే సరికి మృదుల కనిపించలేదు. పై ప్రాణం పైనే పోయింది. మృదులని పిలవడానికి గొంతు,ధైర్యం రెండు రాలేదు. “ఏంటి,ఆలోచిస్తున్నావ్” అన్న మాటకి ఎగిరిపడి వెనక్కి తిరిగాడు. తన వెనకే మృదుల  ఆయాసపడుతూ నిలబడి ఉంది. “ఏంటీ,ఒక్క మనిషి లేడు ” అన్న మాట మృదుల నోటి వెంట రాకుండానే లాగి కార్లో వేసి స్టార్ట్ చేయబోయాడు. కారు స్టార్ట్ అవడం లేదు. అప్పటికే చీకాట్లు ముసురుతున్నాయి. ఆకాశం లో నక్షత్రాలు మిణుకు మిణుకు మంటూ ప్రత్యక్షమౌతున్నాయి. చుట్టు పక్కల ఏ శబ్దమూ లేదు, గుస గుస లతో నిండిన గాలి సవ్వడి తప్ప. వంశీ కి పిచ్చెక్కి పోతుంది. “వంశీ ఏమైంది?” అంటున్న మృదుల వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు వంశీ. నోట్లోంచి మాటలు రావడం లేదు. కారు స్టార్ట్ ఐంది. వేగంగా రివర్స్ చేసి ఆ గతుకుల్లో పరిగెత్తించ సాగాడు. కారులో ఎగిరిపడుతూ మృదుల గట్టిగా అరవసాగింది “ప్లీజ్ వంశీ చిన్నగా పోనీ భయంగా ఉంది” అంటూ. ఇవేం పట్టించుకునే స్థితిలో లేడు వంశీ. అరగంట ఎటు పోతున్నాడో,ఎలా పోతున్నాడో తెలీకుండా వెళ్ళాక స్థిమిత పడ్డాడు. కారు వేగం తగ్గింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న మృదుల “ఇప్పుడైనా చెబుతావా,ఏమైందో” అంది. మృదులకి ఆ భయంకరమైన విషయం చెప్పడం ఇష్టం లేకపోయింది.
“అసలు కారులో లేకుండా ఎక్కడకి వెళ్ళావ్?” అని అడిగాడు.
“నీతోనే వచ్చా కదా?” అంది.
“నాతో వచ్చావా?” అంటూ ఆశ్చర్యపోవడం వంశీ వంతు ఐంది.
“ఆ, ఏం ఊరది. ఒక్క మనిషి కూడా లేడు?” అంది.
“నీకేం కనపడలేదా?” వంశీ ఇంకా షాక్ లోనే ఉన్నాడు.
“లేదు” అని తన సమాధానం.
సడన్ బ్రేక్ తో కార్ ఆగింది.
“ఏమైంది వంశీ?” అంది మృదుల.
ఎదురుగ్గా ఉన్న గుట్ట మీద కూర్చుని తనవైపే చూస్తున్న మాసిన బట్టల వాడు....
(ఇంకా ఉంది...)

ముందు భాగాలు
1.http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_6126.html 2.http://aakaasavaani.blogspot.in/2013/09/blog-post_30.html 3.http://aakaasavaani.blogspot.in/2014/01/blog-post_15.html
http://aakaasavaani.blogspot.in/2014/06/blog-post.html
http://aakaasavaani.blogspot.in/2014/11/2.html









కాలం సాగిపోతూ ఉంది. ఇలా కూరగాయలుపండించడానికి ఉత్సాహం చూపించే రైతులు ఎక్కువయ్యారు. దీనికి  పరిష్కారం చూపించాలి.
ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడాడు వంశీ. తన ఆలోచనని,  అందులో కష్టనష్టాలని వివరించాడు. పెట్టుబడి సమస్య ఐంది. ఇది రైతులకి చెప్తే నిరుత్సాహపడతారు. స్నేహితులు షాప్స్ అద్దెకు తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసి అమ్మెంత వరకు పర్లేదు కానీ వ్యవసాయానికి పెట్టుబడి అంటే ఆలోచనలో పడ్డారు. అదేమీ చిన్న విషయం కాదు. ఈ 3 నెలల వరకు ఇబ్బందేమీ లేదు. ఈ లోగా ఏదైనా చేయాలి.

ముందుగా కొత్తగా చేరే రైతులను లెక్క వేస్తే 10 మంది అయ్యారు. దాదాపు 10 ఎకరాల భూమి. పెట్టుబడి ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 5 లక్షలు అవుతుంది. పక్క ఊర్లో ఉన్న గ్రామీణ బ్యాంకు మేనేజర్ తో మాట్లాడాడు వంశీ. తన ప్రయత్నాన్ని, అందుకు అయ్యే ఖర్చుని వివరించాడు. ఆ బ్యాంకు మేనేజర్ కుర్రవాడు, ఈ మధ్యనే మేనేజర్ గా పదోన్నతిపొందాడు. అతను కూడా ఉత్సాహంగా ఉన్నాడు,  మరి అలా అప్పు రైతులకి మాత్రమే  ఇవ్వడానికి కుదురుతుంది.
ఇక్కడ నాన్న సహాయం అవసరం ఐంది వంశీకి. రైతులందరినీ కూర్చోబెట్టి వివరంగా చెప్పాడు శ్రీనివాసరావు. రిలయన్స్ తీసుకున్న నిర్ణయం గురించి వివరించాడు,కొత్తగా చేరదాం అనుకున్న రైతులకు అయోమయంగా ఉంది. వారందరూ సిద్ధంగా లేరు. ఈ  పని కోసం కొందరు రైతులని ఎంచుకున్నారు.స్నేహితులతో కలసి పెట్టుబడి పెట్టడానికి  వంశీ సిద్ధమయ్యాడు.
ఈ పని చేయడంలో నష్టపోవడం కన్నా నమ్మకాన్ని బ్రతికించడం ముఖ్యం.

వంశీ ఆలోచన ఇలా ఉంది.
ఏదైనా కూరగాయలు కిలో 40రూ అమ్ముతున్న ఈ తరుణంలో, రైతులకి మిగిలేది మాత్రం కిలోకి 10 కన్నా తక్కువే. అలా కాకుండా కిలో 30 రూ లకి అమ్మి, రైతులకి 15 రూ ఇస్తే. మిగిలిన 15 రూలలో గ్రేడింగ్, రవాణా, షాపులకి అద్దె ఇవన్నీ కలిపాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, మంచి ఫలితాలు వస్తాయి.
పంట వేసిన నాటి నుంచి కోతకి వచ్చేది 2-3 నెలల తరువాతే. అంటే దాదాపుగా పని మొదలైన నాటి నుంచి 6 నెలల పాటు ఉంటుంది ఈ పనంతా.
ముందుగా రైతులతో కలసి బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం వంశీ పని అయితే, పట్నంలో షాపులు అద్దెకు తీసుకోవడం,అక్కడ రవాణా,అమ్మడానికి కావాల్సిన మనుషులు ఇత్యాదివి అన్ని అతని స్నేహితులు చూసుకుంటారు.

వంశీ కి మధు సాయపడుతూ ఉంది. ఎంతెంత పెట్టుబడి అవుతుంది , మిగతా జామా ఖర్చులు,వంశీ స్నేహితులతో మాట్లాడటం ఇలా. వంశీ ఇక్కడ ఉద్యోగంలో చేరక మునుపే ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు.అప్పుడప్పుడు  కుటుంబమంతా కల్సి వారాంతాల్లో దగ్గరలో ఉన్న బంధువుల ఇంటికి, గుడికి వెళ్లి వస్తుండే వాళ్ళు.ఆ ప్రయాణాల్లో వాళ్ళ ఆలోచనలు కూడా పంచుకునే వాళ్ళు. ఇష్టమైన పని కోసం తపన పడ్డం ఎపుడూ కష్టం అనిపించదేమో. ఆ పనే వాళ్ళకి వెసులుబాటు,కాలక్షేపం,కబుర్లు. ఇంటిముందు,వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో పూల మొక్కలు, కూరగాయలు వేసారు. ఇంటి ముందు బాగా పెరిగిన కొబ్బరి చెట్లు పున్నమి వేళల్లో వెన్నల జారవిడిచేవి. రేపటి కోసం ఎదురు చూపు, పని మీద ఇష్టం, ఏదో సాధించాలన్న తపన మనిషిని ఎప్పుడు యవ్వనంగా ఉంచుతాయి.

వంశీ ప్రయత్నం సాగుతూనే ఉంది. దానితో పాటు చాటుగా నవ్వుకునే వాళ్ళు ఎక్కువయ్యారు.

రసాయనాలు లేని వ్యవసాయం చేయాలని సంకల్పించారు అందరూ. ఖర్చు తక్కువ ఉండటం తో రైతులు కూడా అటు వైపే మొగ్గుచూపారు. పని మొదలైంది. కూరగాయలు వెళ్తున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. చుట్టు పక్క గ్రామాల్లో ఈ పనికి గుర్తింపు లభించింది. 
తొందరలో ఇలానే బియ్యం, చిరు ధాన్యాలు చేయాలని ఆలోచన చేశారు. 

ఊరి చివర ఉన్న పోలేరమ్మ కి  జాతర చేయాలని అనుకున్నారు ఊరంతా... 
కొత్త ఉత్సాహం, ఆ ఊరు కళ కళ లాడిపోతూ ఉంది.. ఓ రోజు ఇంకో శుభవార్త తొందరలో ఆ ఇంట్లోకి ఇంకో కొత్త మనిషిరాబోతుందని... 
తల్చుకుంటే తన ప్రయాణం సంతోషాన్నిచ్చింది వంశీ కి.. 

ప్రతి పని  లోనూ కష్ట నష్టాలు ఉంటాయి , కానీ మనం చేసే పని మనకి సంతోషాన్నిస్తోందా.. అవును అయితే మనం బాగున్నట్టు, లేదంటే ఓ సారి ఆలోచించాల్సిందే... 







ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా హళిబేడు, బేలూరు చూడాలని... ఇన్నాళ్ళకి ఆ అవకాశం వచ్చింది. బెంగళూరు చుట్టూరా మంచి రోడ్లు.. పచ్చని అందమైన పల్లెటూర్లు.. ప్రయాణం చాలా బావుంటుంది. చిన్న వాన పడుతూ కొంచెం దూరానికి ఆగిపోతూ, చల్ల గాలి తడుతూ... ఎక్కడ పట్టినా కొబ్బరి తోటలు అనే కన్నా కొబ్బరి అడవి అంటే బావుంటుంది, అల్లుకొని ఉన్నాయి అంతా. ముందు శ్రావణబెళగొళ అనే  ఊరి మధ్యలో కొండ మీద ఉంది బాహుబలి(గోమఠేశ్వరుడు) విగ్రహం. చాలా పెద్దది. అంత ఖచ్చితంగా ఎలా చెక్కారో అర్ధం కాదు. 12 ఏళ్ల కోసారి ఉత్సవాలు జరుగుతాయట. 
అక్కడ నుంచి హాసన్ అనే ఊరి మీదుగా హళేబీడు, అది హోయసాల రాజుల ప్రభావానికి ఓ గుర్తు. అసలలా చెక్క గలిగే వాళ్ళు ఇప్పుడున్నారో లేదో, మనమెందుకీ కళని బ్రతికించుకోలేక పోయాం అనిపిస్తుంది.ప్రతి రాయి అందంగా ఉంది. కానీ వాటి మీద కూడా ప్రేమ పైత్యాన్ని ఒలకబోసిన(I love you  లాంటి రాతలతో) వెధవల్ని చూస్తే మనమే మన సంపదని జాగ్రత్త చూసుకోలేకపోతున్నాం అనిపిస్తుంది. 

చాలా వరకు విరగ్గొట్టిన విగ్రహాలే, అవే అంత అందంగా ఉన్నాయే , బావుండి ఉంటే ఇంకెంత బావుండేవో అనిపిస్తుంది. దాదాపు రామాయణ భారత భాగవతాలు చెక్కారు. హళేబీడు శివుడికి అంకితం ఇస్తే, బేలూరు విష్ణువుకి ఇచ్చారు. రెండు గుడులు చూడ్డానికి కళ్ళు సరిపోవు. కానీ పోషణ లేదు. ఇక్కడే కాదు మైసూర్ దగ్గరలో శ్రీరంగ పట్టణం లో కూడా అదే పరిస్థితి. ఆ గుడికట్టడానికి ఎంత ఆలోచించి ఉండాలి, ఆ చోటుకి ఎంత స్థల పురాణం ఉంది ఉండాలి. ఎంత వైభోగం జరిగి ఉండాలి అనిపిస్తుంది. అసలు ఎటువంటి హడావిడి ఉండదు. బేలూరు చెన్నకేశవుడిని చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోవు. హళేబీడు శివుడి లోను, ఇక్కడ చెన్నకేశవుడిలోనూ దైవత్వం తొణికిసలాడుతుంది. ఎంత సేపైనా చూడాలనిపిస్తుంది. కొత్తగా కట్టిన గుడులకి, కొత్త దేవుళ్ళకి పడి కొట్టుకునే జనాలని చూస్తే జాలేస్తుంది. 
బేలూర్ విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇది మన చరిత్ర అని ఎందుకు మనం తెలుసుకోవడం లేదు ? ప్రపంచానికి ఎందుకు చెప్పడం లేదు అనిపిస్తుంది. భారతదేశం అంటే తాజమహల్ ఒక్కటే కాదు, ఇదిగో ఇలా మరుగున పడిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయని ఎందుకు చెప్పారా అనిపిస్తుంది. 
ఆ విగ్రహాలు చూడాల్సిందే తప్ప వాటి గొప్పతనం చెప్పడానికి నా స్థాయి సరిపోదు. ఒకటి మాత్రం చెప్పగలను, నేను ఈ మట్టి మీద పుట్టినందుకు గర్వపడుతున్నాను. 


























#halebeedu #belur

మనసు మాటలు 


ఏడ్చినప్పుడు కూడా ఒక్కో సారి బావుంటుంది,మనసు తేలికౌతుంది. ఏడుపు అనేది ఎలా అయినా రావచ్చు,బాధతోనో,సంతోషంతోనో,ఇష్టమైన వాళ్ళు గుర్తోచ్చో,చేసిన తప్పు వలన మనసులను పోగొట్టుకోనో,ఇలా కారణాలు రాసుకుంటూ పోతే ఈ ప్రపంచం లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎదురైన అనుభవాన్ని రాయాల్సి ఉంటుంది.
కాని ఏడ్చాక అందరి అనుభవం మాత్రం చెప్పగలను “మనసు తేలికౌతుంది”. తప్పు లేదు ఏడవచ్చు.ఏడుపు ఎప్పుడు గోల కాదు, మనసు మాట్లాడే మాటల్లో అదో మాట. మనసు నవ్వితే, అది మన కళ్ళలో కనిపిస్తుంది. మనసు ఏడిస్తే కన్నీరై కరుగుతుంది. చెప్పా కదా ఏడుపు ఎలా అయినా రావచ్చు అని. ఏడుపు ని ఆపద్దు.
జీవితం బావుంటుంది. అన్నీ ఉన్నపుడే బావుంటుంది. కష్టాలు,బాధలు,కన్నీళ్లు,నవ్వులు,స్నేహితులు,ప్రేమించే వాళ్ళు,ద్వేషించే వాళ్ళు. ఈ ప్రయాణం లో నువ్వు ఎంత మంది నీ సంపాదించుకున్నావ్? ఎంత సంపాదించావ్
అని కాదు అడిగింది. ఎంత మంది నీ, ఎన్ని మనసులుని. ఎంతో సంపాదిస్తే మంది మన దగ్గరకి వచ్చే రోజులివి.అవి పోతే వాళ్ళూ పోతారు. అందుకే మనుషులు,మనసుల్ని సంపాదించుకోవడం బావుంటుంది.
ఒక్కో సమయం లో ఒక్కోరు ముఖ్యం అనిపిస్తారు. వాళ్ళే జీవితం అనిపిస్తుంది.వాళ్ళు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం. అలా అనుకునేది అమ్మ కావచ్చు,నాన్నకావచ్చు, అమ్మాయి/అబ్బాయి కావచ్చు,స్నేహితులు కావచ్చు, పేరు పెట్టలేని బంధం కావచ్చు... కానీ కాలం గడిచే కొద్ది మనం మారుతూ ఉంటాం,మనసు కూడా మారుతుంది,ప్రాముఖ్యతలు మారతాయి. కొంత కాలం గడిచాక,తలుచుకొని నవ్వుకుంటాం,బాధపడతాం,సంతోషపడతాం. అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే/అలా అనకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది. అలా చేయకూడదని మనమూ అనుకుంటాం,కానీ “ఏవో కారణాల” వాళ్ళ ఆ పని చేయం. దాని వల్ల మనసుకి దగ్గర గా ఉన్న మనసుని,మనుషుల్నిపోగొట్టుకుంటాం. ఆ పరిస్థితిలో అవతల వాళ్ళ మొహం ఎలా ఉన్నా, వాళ్ళు నోరు జారినా, అసలు మన మాట వినడం ఇష్టం లేకపోయినా, మనం చెప్పాలనుకున్న మాట చెప్పి రావచ్చు(మనం ఏమి నోరు జారకుండా ). అది చాలా కష్టం. ఈ కష్టాన్ని దాట లేక బంధాలు తెగిపోతున్నాయి. ఒక్క
చిన్న గట్టు దాటలేక మనసుల్ని పోగొట్టుకుంటున్నాం.ఇద్దరి లో ఎవరో ఒకరు భరించి మనసులోని మాట చెప్పగలిగితే అవతలి మనసు అప్పుడు కాకున్నా కొన్నాళ్ళకి అర్ధం చేసుకుంటుంది. అలా చేయలేకపోతే, భవిష్యత్తులో వచ్చే ఏడుపు బాధతో ఉంటుంది. ఆ మాట చెప్పగలిగితే మనుషులు దగ్గరగా లేకున్నా కన్నీళ్లు మనం ఏం తప్పు చేయలేదన్న సంతోషం తో వస్తాయి...ఇలా ఏడ్చేపుడు, కన్నీళ్ళు మనసుని తేలిక చేసేప్పుడు అనిపిస్తుంది ఏడుపు తప్పు కాదు అని. ఏడవడానికి ఆడో మగో అక్ఖర్లేదు, స్పందించే మనసుంటే చాలు. ఏడుపు ఆపుకొని/ఆపి మనసుని మాట్లాడకుండా చేయకండి...


మేము హైదరాబాద్ నుంచి బెంగుళూరు కి మారిపోతున్నాం.నేను ఇంటర్నెట్  తీసేయించి, గ్యాస్ ట్రాన్స్ఫర్ చేయించే పనుల్లో హడావిడిగా ఉన్నాను. క్షణం తీరిక లేదు. ఇల్లంతా ఖాళీగా ఉంది. సామాన్లన్నీ సర్ది పంపించేసా. చిన్న చిన్న మాటలు కూడా పెద్దగా వినపడుతున్నాయి. ఏంటో ఖాళీ చేస్తున్నాం అంటే అక్కడ క్షణం  ఉండ బుద్ధి కాదు. ఇప్పుడు ఉన్న ఇల్లు కడిగించడానికి పనమ్మాయిని పిలవమని మా ఆవిడకి చెప్పాను.సరే అంటూ "కళమ్మ చచ్చిపొయిందట" అంది. అంత నీరసం లోను నన్ను ఆ మాట ఉలిక్కిపడేలా చేసింది. "చచ్చిపోవడం ఏంటి?" అన్నాను. " అవును, చచ్చిపోయిందట" తన సమాధానం. 
"ఏమైందంట?" అన్నాను. "వాళ్ళాయన చంపేసాడట" అంది.. మనసు వికలమై పోయింది. 
కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాను. 
కళమ్మ మా ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో పని చేస్తూ ఉండేది. వాళ్ళ ఆయన్ని అక్కడ పనికి కుదిర్చింది, అది కూడా పేరుకే. ఆ పని కూడా తనే చేసేది. వాళ్ళకి ఒక 10 వ తరగతి చదివే పిల్లాడు. మాకు బాబు పుట్టాక వాడికి స్నానం చేయించడం కోసం,ఇంటి పని కోసం ఆమెని ఏడాది కింద రమ్మన్నాం. మనిషి నలుపు, కాలికి పట్టాలు, ముక్కు పుడక,మొహాన  రూపాయి బిళ్ళంత బొట్టు, కళ్ళలో నీళ్ళు దాచేసి పని చేసుకుంటూ పోతుండేది. చాలా కష్టపడేది. ఒకటే పరుగు. ఎపుడైనా రాకపోతే, "ఏమైందని" అడిగితే , "రాత్రి వాళ్ళాయన తాగొచ్చి కొట్టాడంట" అని సమాధానం. "తిన్నావా" అని అడిగితే లేదు అని చెప్పడానికి నామోషి పడేది. కనుక్కుని తిండి పెట్టేది మా ఆవిడ
 . 

కష్టం తనది, అయినా సరే మొగుడు ఐన పాపానికి తిండి పెడుతూ మరి కొట్టించుకోవాలా అనిపించేది నాకు. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరూ లేరా అడగడానికి. అన్నీ  అయ్యాయంట, పంచాయితీ పెట్టారంట. అప్పుడు బానే ఉంటా అంటాడట, మళ్ళీ మాములే. మరి 10 వ తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు కదా, వాడేం మాట్లాడడా అంటే, వాడికి భయం అంట. అడ్డం వస్తే వాడిని కూడా తంతాడట. ఒక నిట్టూర్పు. 
కొన్ని నెలలు పని చేసాక, ఓ వారం రాలేదు. ఓ రోజు ఉదయాన్నే వచ్చి పని చేసుకు పోతూఉంది. రాగానే బాబుకి స్నానం చేయించేది, వాడితో ఏదోటి మాట్లాడుతూ ఉండేది. మౌనంగా ఉంది. పనయ్యాక "అమ్మా నేను ఇంకా రావడం లేదు , మీకు ఇష్టమైతే వేరే అమ్మాయిని తీసుకువస్తాను" అని చెప్పింది. "ఏమైంది కళమ్మ" అంటే చేతి నిండా వాతలు చూపించింది. కళ్ళలోంచి నీళ్ళు దూకకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. "ఇక్కడ ఉండద్దు అంటున్నాడమ్మా,పిల్లోడిని కొట్టి ఊరికి తీసుకోపోయాడు, ఇక నాకు పోక తప్పదు" అని అంది. ఆ నెల జీతం,కొన్ని చీరలు తీసుకువచ్చి ఇచ్చింది మా ఆవిడ. తన మొఖం లో సంతోషం. ఇంకొంచెం ఇవ్వాల్సిందే అనిపించింది. 
మరుసటి రోజు కొత్త పనమ్మాయిని తెచ్చి ఇల్లు చూపించి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తరువాత అనుకుంటా, మా ఆవిడా అంది "కళమ్మ  మళ్ళీ వచ్చిందంట, ఇక్కడే పని చేసుకుంటూ ఉందంట. వాళ్ళ ఆయన  మాత్రం రాలేదంట" అని. 
తను ఎలా చనిపోయింది అంటే, మొగుడు వచ్చి మారిపోయాను అని నమ్మించి, ఇంటికి తీసుకు వెళ్లి మందు పెట్టాడంట. కోపం, కసి చెత్త నా@)@)(@) , ఏం పోయే కాలం వాడికి. 
ఇక్కడ బలం,బలహీనత గురించి మాట్లాడను, ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు ఆ బాధ్యత ని అలా నెరవేరుస్తూ ఏదో ఓ రోజు కనపడకుండా వెళ్ళిపోతారు.అప్పటి దాకా తనని గుర్తించని వాళ్ళు,తను మిగిల్చిన శూన్యం లో పడి పోతారు. ఆ లేమి ఏదో ఓ చీకటి రాత్రి తన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. 

ఎవరికైనా ఏదైనా సాయం చేయాలనిపిస్తే ఎటువంటి ఆలోచన లేకుండా చేసేయాలి. మనతో,మనలో ఉన్న చాలా మంది నవ్వుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూఉంటారు. ఆ నవ్వే కళ్ళ వెనకున్న కష్టం మనకి తెలీకపోవచ్చు కానీ, మనం నవ్వుతూ పలకరించవచ్చు.. ఈ పని నువ్వు మాత్రమే బాగా చేయగలవని ఒక చిన్న మాట అనవచ్చు. అంతే... 


Image courtesy: NaheemRustum
మనం అందరం దాదాపు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే... చిన్నప్పుడు ఆ పొలాల్లో పడి పని చేసిన వాళ్ళమే.. మనకి అప్పుడు ఏమి తెలీదు, పని కొంచెం కష్టం అనిపించేది అంతే. ప్రతి సీజన్ లో పచ్చగా ఉండి పొలాలన్నీ ఏదో ఒక పంట తో ఓ కళ కళ లాడుతూ ఉండేవి. ఇంటి దగ్గర కూరగాయలు కొనడం కూడా తక్కువే. ఇంటి పెరట్లో అల్లుకున్న దొండ పాదులు,సొర పాదులు,కాకర పాదులు , పొట్ల పాదులు, ఆకు కూరలు. పొలాన్నున్చి తెచ్చుకునే పచ్చి మిరపకాయలు,టమాటో లు, గోంగూర. మన చేలో పండే కంది పప్పు , మినప్పప్పు,వేరు సెనగ. ఇవన్నీ మనం చూశాం.కానీ మన ముందు తరాన్నుంచి ఆ అనుభవాన్ని మాత్రం అందుకోలేక పోయాం.
మనకి నెల జీతం వస్తుంది కాబట్టి కొంచెం రేట్లు పెరిగినా కొనుక్కో గలుగుతున్నాం. కానీ పల్లెటూర్లలో ఈ వ్యవసాయాన్ని బతికించడానికి మన ముందు తరం ఇంకా పోరాడుతూ ఉంది. ఎవరికైనా ఒక వయసు వచ్చాక విశ్రాంతి అవసరం. మన తాతల నుంచి తండ్రులు అందిపుచ్చుకున్నారు. కాని వారి నుంచి అంది పుచ్చుకునే వారు లేకపోయారు. వయసు 60 వచ్చినా వాళ్ళే పొలం పని చేయాల్సిన పరిస్థితి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యవసాయం చచ్చిపోతుంది. కారణాలు చాలానే ఉన్నాయి.
1.ఆదాయం లేకపోవడం .
2.నష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేకపోవడం(5౦౦౦౦ పెట్టి కొన్న బైక్ ఇన్సురన్సు ఉంది కానీ ప్రజల కడుపు నింపే పంట కి లేదు)
3.ప్రకృతి లో మార్పులు.
4.కూలి ఖర్చులు పెరగడం , కూలి వాళ్ళు దొరక్కపోవడం.
5.పంట చేతికి వచ్చాక ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన కొనుగోళ్ళు లేకపోవడం. అప్పుడు తీర్చాల్సిన అప్పులు కోసం ఎంతో కొంత కి అమ్మి వాటికీ కట్టి ఖాళీగా ఉండటం. మళ్ళీ పంట కోసం అప్పు చేయడం. ఎందుకంటే వాళ్ళకి ఆ పని తప్ప ఇంకోటి రాదు. వెనక చేయి వేసి ఆసరా ఇచ్చే బిడ్డలు లేరు. ఇంత కష్టం చూసాక ఎ రైతు తన పిల్లల్ని వ్యవసాయం చేయమని చెప్పడు.
మనలో చాలా మందికి ఇవన్నీ తెలుసు. కాని మన జీవితపు పరుగులో పడి ఒక నిట్టూర్పు మాత్రం ఇవ్వగలుగుతున్నాం.
మనకి తెల్సు ఎంత మంది రైతులు బలవంతగా బతుకు ముగిస్తున్నారో. పరువు కోసం బ్రతకలేక ప్రాణాలు తీసుకునే ఒక రైతు విలువ పేపర్లో ఒక మూల  ఉండచ్చేమో కానీ ఆ నష్టం ఆ కుటుంబానికి ఎవరు తీర్చలేరు. వ్యవసాయం చేయడం అంటే పచ్చని పంట పొలాల్లో భుజం మీద కర్ర వేసుకొని ముందు వెళ్ళే ఎద్దుల వెంట కూని రాగాలు తీస్తూ నడవడం కాదు. ఎర్రటి ఎండలో శరీరం సహకరించించక పోయినా ఆ రోజు వెయ్యాల్సిన ఎరువు వెయ్యకపోతే మొక్కలు చచ్చిపోతాయని పాకులాడటం. ఇది పిల్లల కోసం తండ్రి పదే బాధ.
ఇదంతా ఎందుకు అంటే, నాదొక చిన్న ఆలోచన నచ్చితే ప్రయత్నిచండి.
మనం అందరం బియ్యాన్ని 25KG లు 1800 పెట్టి కొంటున్నాం. సగటున ముగ్గురు ఉన్న కుటుంబానికి ఏడాదికి 13 నుంచి 15 వరకు బియ్యం బస్తాలు అవసరం అవుతాయి. కూరగాయలకి,పప్పు ధాన్యాలకి అంతా కలిపి 20,000 దాక ఖర్చు అవుతుంది. అంటే బియ్యం తో కలిపి మొత్తం 40000  దాకా ఖర్చు అవుతుంది. మనలా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒక కంపెనీ లో 50 మంది కలిసి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరి కి వెళ్ళి అక్కడ ఉన్న రైతులకి పెట్టుబడి పెట్టి ఆ పంటని మనమే కొనుక్కుంటే కొన్ని కుటుంబాలని బ్రతికించిన వాళ్ళం అవుతాం... అప్పుడప్పుడు వెళ్తుంటే  మన పిల్లల కి కూడా ప్రకృతి తో పరిచయం అవుతుంది. వాళ్ళలో కూడా సాటి మనిషికి గౌరవంగా సాయం చేయచ్చు అన్న ఆలోచన వస్తుంది. వారంతం లో షాపింగ్ మాల్ కి వెళ్ళడం కన్నా పచ్చని పొలాల్లో తిరగడం మనసుకి,మనషికి రెంటికి మంచిదే....

ఇది నా ఆలోచన మాత్రమే నచ్చితే పంచుకోండి.... అందరికి షేర్ చేయండి, ఎవరో ఒకరు ఇంకో మంచి ఆలోచన వచ్చినా సంతోషమే ...